అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-188.
296d3;2810e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣8️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*11. వ శ్లోకము:*
*బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।*
*ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥11॥*
“ఓ అర్జునా! నేను కామముతో కానీ, రాగముతో కానీ సంబంధములేని బలాన్ని, అలాగే ధర్మవిరుద్ధమైన పనులు చేయని వారియొక్క కోరికలు కూడా నేనే అయి ఉన్నాను.”
```
ఈ శ్లోకంలో నెగటివ్ మీనింగ్ వచ్చేపదాలు వాడారు వ్యాసులవారు.
స్థూలంగా చెప్పాలంటే అధర్మముతో కూడిన పనులు చేసే వారి కోరికలలో, రాగము (సంగము--అటాచ్మెంట్) తో కూడిన కోరికలు ఉన్న వారిలో నేను ఉండను అని భావము.
బలవంతుడు అని ఎప్పుడు అంటాము, వాడికి బాగా బలం ఉంటే అంటాము. ఆ బలం నేనే అంటున్నాడు పరమాత్మ. బలం అనేది ఒకటే మానవునిలో ఉన్న శక్తి. ఆ బలం మంచి పనులకు ఉపయోగపడితే అది ధార్మికమైన బలం. ఆ బలాన్నే అసాంఘిక కార్యక్రమాలకు, ధర్మవిరుద్ధమైన కార్యాలకు వినియోగిస్తే అది రాక్షస బలం అంటారు.
రాముడు బలవంతుడు. రావణుడు కూడా బలవంతుడే. రాముడు తన బలాన్ని ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు వినియోగించాడు. రావణుడు తన బలాన్ని రాక్షసప్రవృత్తులకు వినియోగించాడు. రాముని బలంలో దైవత్వం ఉంది. రావణుని బలంలో దైవత్వం లోపించింది. అందుకే రాముడి బలం ముందు రావణుని బలం నిలువలేకపోయింది. కాబట్టి, మనలో ఉన్న బలం ధర్మబద్ధంగా ఉండాలి. పరోపకారానికి వినియోగపడాలి. ధర్మవిరుద్ధమైన పనులు చేయడానికి, తన స్వార్ధపూరితమైన కోరికలు తీర్చుకోడానికి ఉపయోగించబడకూడదు. స్థూలంగా చెప్పాలంటే భగవత్స్వరూపమైన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
అలాగే కోరికలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. మానవునికి ఉన్న బలం, తనలో చెలరేగే పనికిమాలిన, ఇతరులకు హాని కలిగించే కోరికలు తీర్చుకోడానికి, తనలో ఉన్న ఇష్టాఇష్టాలకు సంబంధించి ప్రవర్తించడానికి అయి ఉండకూడదు. తనలో ఉన్న బలాన్ని ఉపయోగించి ఒకడిని అనవసరంగా కొట్టాలి అనే కోరిక ఉండకూడదు. వీడు నావాడు, వాడు పరాయివాడు, వాడిని చితక బాదాలి, నా వాడు వెధవ, దుర్మార్గుడు, నీచుడు అయినప్పటికినీ, వాడిని రక్షించాలి అనే రాగద్వేషములు లేకుండా ఉండాలి. అంతే కాకుండా, బలవంతుడు, ధైర్యవంతుడు అయి నందుకు, బలహీనులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి.
మన సినిమాలలో హీరోలను బలవంతులుగానూ, ధైర్యవంతులుగానూ, ఆపదలలో ఉన్న వారినీ, అబలలనూ రక్షించేవారిని గానూ చిత్రీకరించడంలో ఉన్న అంతరార్థం ఇదే. కనీసం తమ అభిమాన హీరోలను చూచైనా అటువంటి మంచి లక్షణాలు అలవరచుకుంటారనేదే సినిమాలు తీసేవారి ఆశ. (ఈ రోజుల్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఈనాడు ఇడియట్, పోకిరి, డాన్, ఖతర్నాక్, ఖల్నాయక్, మన్మధుడు... వీళ్లు మన హీరోలు. నేటి యువత వీరినే అనుకరిస్తున్నారు) అందుకనే పరమాత్మ, సత్పురుషుడిలో ఉన్న బలం నేనే అని అన్నాడు.
అలాగే కోరికలు కూడా నేనే కానీ ఆ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. ధర్మంగా కలిగే కోరికలు నేనే అని అన్నాడు పరమాత్మ. కాబట్టి మనలో ఉండే బలం, కోరికలు, ప్రతాపం, వీరత్వం అన్నీ ధర్మబద్ధంగా ఉంటే భగవంతుని సాయం తప్పక ఉంటుంది. ఆయన పక్కన ఉండి నడిపిస్తాడు. తాత్కాలికంగా అధర్మం పైచేయి అయినా ధర్మమే గెలుస్తుంది. ధర్మమేవ జయతే అని అందుకే అన్నారు.
లోకంలో అన్ని రకాల కోరికలు ఉంటాయి. మంచి కోరికలు చెడ్డ కోరికలు రెండూ ఉంటాయి. ఏది కావాలో కోరుకోవడం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ధర్మానికి అనుకూలంగా ఉంటుందో, ఏది ధర్మవిరుద్ధం కాదో ఆ కోరికలనే కోరుకోవాలి. అంటే సంకల్ప స్థితిలోనే ధర్మవిరుద్ధం కాని కోరికలు కావాలని సంకల్పించాలి. ఇతరులకు పరోపకారం చేయడం, భగవంతుని ధ్యానం చేయాలని అనుకోవడం, మంచి పనులు చేయాలని కోరుకోవడం, పుణ్యకార్యములు చేయాలని కోరుకోవడం, ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఇతరులకు అపకారం చేయడం, ఇతరులను మోసం చేయడం, వారికి నష్టం కలిగించడం మొదలగునవి అధర్మబద్ధమైన కోరికలు.
మనలో ఉన్న విచక్షణ ఉపయోగించి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే భగవంతుడు ఆ కోరికలను తీరుస్తాడు. ఆ కోరికలలోనే తాను ఉంటాడు. క్రమక్రమంగా ఆ కోరికలను కూడా వదిలిపెట్టి పరమాత్మను చేరుకోవచ్చు.✍️```
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment