Sunday, February 1, 2026

 రాజ్యం చేపట్టే విషయంలో శ్రీరామ భీష్ముల అభిప్రాయాలు :—
పెద్దవాడు యోగ్యడైనపుడు అతడే రాజ్యాధికారం చేపట్టడం పరంపరాగత ధర్మం.

శంతనుడు గానీ, దశరథుడు గానీ , ఈ ధర్మం తప్పడం అనుచితమని నమ్మినవారే.

రాముడికి యౌవరాజ్య పట్టాభిషేకం జరగబోయే క్షణంలో కైక కారణంగా అవరోధం కలిగింది.

దశరథుడు కైకకు మాట ఇచ్చాడు. కొడుకుగా అది నెరవేర్చి తండ్రికి బ్రహ్మలోక ప్రాప్తి కలిగించడం పుత్రధర్మంగా భావించాడు శ్రీ రాముడు .. కైక అడిగినది రెండు అంశాలు. ఒకటి రామవనగమనం. రెండు భరతపట్టాభిషేకం.

భరతుడు ఇది ఏమాత్రం ఇష్టపడలేదు. పెద్దవాడు రాజు కావడం అనే పూర్వాచారం అతడు ఉల్లంఘించదలచలేదు.

రాముడికి అనూచానధర్మపాలనే లక్ష్యం. అంతేగానీ రాజ్యకాంక్ష లేదు.. రావణవధానంతరం గూడా భరతుడికి ఒకవేళ ఆసక్తి ఉంటే ఆతడే రాజ్యం ఏలనీ అని అనుకొన్నాడు.

అరణ్యవాస ఆరంభంలో తండ్రి కామవశుడై ధర్మం తప్పాడే అని లక్ష్మణుడితో అంటాడు. కామపాశబద్ధుడైనాడు..పరంపరగా వచ్చే సంప్రదాయం పాటించలేకపోయాడే అని చింతించడం అది.

ముందు ఇచ్చిన వరాలు తీర్చడం ఇపుడు ఆయనకు బాధ్యతగా నిలబడింది.. చేయక తప్పలేదు— అని బాధపడ్డాడు.

శంతనుడు సత్యవతి వలపులోపడలేదు. బహుపుత్రత వంశం నిలవడానికి అవసరం అని తలచాడు. దాశరాజు షరతులకు లొంగినవాడు కాలేదు .

భీష్ముడే తండ్రి ధార్మికవాంఛకు తాను అడ్డు కాకూడదని తానుగానే తండ్రి ప్రమేయం లేకుండా దాశరాజుకు మాట ఇచ్చాడు. చిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టారు. ఆ విధంగా పరోక్షంగా తండ్రికి సంతోషం కలిగించాడు. తల్లికీ ( సత్యవతికి) ఆనందం కలిగించాడు . సత్యవతి పుత్రులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. భీష్ముడే వివాహాలూ చేసి, రాజ్యరక్షణ చేస్తున్నాడు .

ఇంతకాలం కేవలం రక్షణబాధ్యతే స్వీకరించి ఇపుడు రాజ్యం ఏలుతాననడం సమంజసం అనిపించలేదు ఆయనకు.

శాశ్వత బ్రహ్మచర్యంలో ఉంటానని మాట ఇచ్చాడు.

సత్యవతి విచిత్రవీర్య మరణానంతరం ఆయనను వివాహమాడి రాజ్యం చేపట్టమనింది.

ఇపుడు వివాహం చేసుకోవడం తండ్రికోసం చేసిన ఒక మాటను తానన్న మాటను తానే తప్పడం.

రాజ్యం ఎక్కడా పోదు . తన భుజస్కంధాల మీద మోస్తునే ఉన్నాడు. చిత్రాంగద విచిత్రవీర్యులున్నపుడూ తానే రక్షణ చేస్తున్నాడు అనధికారికంగా.

సత్యవతికి ఇంతకాలం తన వంశం అధికారంలో ఉంటున్నది గాబట్టి అదే కొనసాగడం ఆమె ఇంగితం. దాశరాజు కోరికా అదే. తన కూతురివంశం పాలనలో పరంపరగా సాగాలి అని. అవన్నీ మనసులో పెట్టుకొని అన్నీ తీరే మరో మార్గం సూచించాడు.

ఫలితంగా—

పాండురాజు రాజై రాజ్యం విస్తరించాడు.. ఆయన సంతు (తన మనవలు) మరింత విస్తరించారు. ఏదీ ఆగలేదు. భీష్ముడికి సంతృప్తే కలిగింది.

తనవాళ్ళు ఎవరూ చేయలేని రాజసూయం చేశారు. వంశానికి కీర్తి తెచ్చారు.

తాను ప్రతినపట్టిన తర్వాత రెండు తరాలు నడిచి, ఆ తర్వాత యుద్ధం వచ్చింది.

ఈ పరిణామం కాలగతిలో జరిగింది. దీనికి ఎపుడో ఒక మంచి కోరి చేసిన చర్యలు కారణం అనుకోగూడదు.

వ్యక్తి తాను అనుకొన్న ధార్మిక నియమాలు పాటించి కడతేరుతాడు . తనకది దారి అనుకొని అందులో నడుస్తాడు. అది లోకసహజం. జీవుడి ధర్మం. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం.

తనకు విస్తారంగా పుణ్యలోకాలున్నాయి. వివాహం లేమి తనకు పుణ్యలోకాలకు అవరోధం కాదు( సభా పర్వం ఆ 1)— అని కచ్చితంగా ఎరిగి , కర్మశేషానుభవం అయి తన వసులోకానికి సంతోషంగా వెళ్లిపోయాడాయన .

రాముడి విషయం—

అరణ్యవాసకాల ఆరంభంలోనే " రాజ్యం స్వీకరించడం నీ ధర్మం— అని వసిష్ఠాది ఋషులు చెప్పారు. భరతుడు వద్దంటూ ఆత్మత్యాగానికి సిద్ధపడుతున్నాడు.

దశరథుణ్ణి ఆనాడు బలవంతపెట్టిన కైకమ్మే తిరిగివచ్చి రాజ్యం గ్రహించు అంటున్నది.

తండ్రికి ఆయన మాట నిలపడం ద్వారా సద్గతి కలిగించాడు.

తాను రాజ్యం స్వీకరించడం ద్వారా తండ్రి అభీష్టమూ తీరినట్లయింది.

రాముడు అందరికీ శాశ్వతానందం కలిగించినవాడైనాడు.

చక్రం పట్టి భీష్ముణ్ణి వధించబోవడం ధర్మమా? అని పలువురికి సందేహం.

రథి, సారథి చేరి ఒకే విభాగం. రెండు కాదు. పరస్పరం రక్షించుకోవడం యుద్ధధర్మం. ..చక్రం పట్టడం కృష్ణుడు మాటతప్పడం కాదు. కృష్ణుడు తానొక రథం ఎక్కి ఆయుధం పట్టడమే ఆయన మాఅన్న మాట తప్పడం ఔతుంది.

ఒకే రథంలో ఉన్నపుడు సారథి ప్రాణాలు కాపాడడం రథికుడి కర్తవ్యం . అలాగే సారథి రథికుణ్ణీ.
అరణ్య పర్వం( 1 ఆ.)లో వచ్చే ఒక సంఘటన.

సాల్వుడితో యుద్ధంలో ప్రద్యుమ్నుడు స్పృహకోల్పోయాడు..అపుడు సారథి యుద్ధభూమి నుంచి దూరంగా రథం తోలుకొని పోయాడు. నగరంలో బలరామకృష్ణులు లేనపుడు ఈ దాడి జరిగింది.

ప్రద్యుమ్నుడు తనకు వీరలోకంలో అవమానం జరిగిందనీ ఇలా ఎందుకుచేశావు? అనీ సారథినంటాడు. అందుకు సారథి సమాధానం ఇది.

కృష్ణుడు చేసినది యుద్ధధర్మోల్లంఘన ఐతే అపుడే కౌరవపక్షం పెద్ద రచ్చ చేసేది. ఎన్నో ప్రశ్నలు వేసిన ధృతరాష్ట్రుడూ ఈ విషయం ప్రస్తావించలేదు.

No comments:

Post a Comment