Tuesday, March 17, 2020

నటరాజు ఎందుకు తాండవమాడాడంటే!

నటరాజు ఎందుకు తాండవమాడాడంటే!

పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది.
సప్త సారస్వతమనే పుణ్యభూమి ఉంది. అక్కడ తపస్సు చేస్తే శివజ్ఞానం కలుగుతుందని తెలుసుకున్న మంకణమహాముని అక్కడకు వెళ్లి తపోనిష్ఠలో మునిగిపోయాడు. నిరంతర పంచాక్షరీ జపంతో అతని శరీరం మహా తేజస్సుతో వెలిగిపోసాగింది. భక్తి పారవశ్యంతో ఆయన తాండవం చేయడం ప్రారంభించాడు. అతని తపోశక్తికి మెచ్చుకుని శివుడు మంకణ మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ తాండవలో మునిగిపోయి ఉన్న మంకణుడు శివుడి రాకను గుర్తించలేదు. శివుడు ఆ మహర్షిని ఆపడానికి ప్రయత్నిస్తూ నీ తపస్సు, తాండవం, తపనా ఎవరికోసమని ప్రశ్నించాడు. దానికీ సమాధానం లేదు. దీంతో పరమ శివుడు ఉగ్రుడయ్యాడు. తేజోమూర్తిగా మారి మహాతాండవం చేయడం ప్రారంభించాడు. ఆయనతో పాటు ఆ తాండవంలో ఓ స్త్రీకూడా ఉంది. శివుడి మహా తాండవం ముందు మంకణుడి నాట్యం వెలవెలబోయింది. దీంతోపాటు మంకణ ముని అహంకారం కూడా తొలగిపోయింది. పరమేశ్వరుడి ముందు సాగిలపడి క్షమించమని కోరారాయన. అప్పుడు పరమశివుడు ‘సర్వప్రాణుల్లో ఉన్న జీవాత్మను నేనే. నాతోపాటు మహా తాండవంలో కనిపించిన దేవి ప్రకృతి. లింగరూపుడినైనా, అర్ధనారీశ్వరుడినైనా, మహాతాండవం చేసిన నటరాజునైనా నేనే’ అన్నాడు. అలా నీలకంఠుడు నటరాజు అవతరాన్ని ధరించాడు.

No comments:

Post a Comment