Sunday, April 26, 2020

నీకు తెలిసింది మాత్రమే విద్య కాదు

నీకు తెలిసింది మాత్రమే విద్య కాదు

ఒకసారి ఒక పండితుడు నది దాటవలసి వచ్చింది.

పడవలో కూర్చున్నాడు. వాతావరణం ఆహ్లాదంగా, చల్లని గాలి తాకుతూ ఎంతో చక్కగా ఉంది.
పడవ నడిపే వాడు మాట్లాడకుండా, పడవ నడుపుతున్నాడు. పండితుడు, అతడి ఊరు, పేరు, కుటుంబ వివరాలు అన్నీ తెలుసుకున్నాడు. నావవాడు ఓపికగా సమాధానాలు చెప్పాడు.

“నీకు వేదాలు తెలుసునా?” ప్రశ్నించాడు పండితుడు.

“అవేవిటి స్వామీ తింటే బాగుంటాయా?” అడిగాడు పడవవాడు.

పండితుడు నవ్వుకుని “పోనీ శాస్త్రాలో?” అని ప్రశ్నించాడు.

“అవి నేనెప్పుడూ చూడలేదు బాబయ్యా, ఏమిటవి ఎగిరే పిట్టలా?” అని అడిగాడు.

అందుకు పండితుడు “నీకు చదువు వచ్చునా?” అని ప్రశ్నించాడు.

“లేదు స్వామీ, నాకు అక్షరాలు కూడా రావు. చిన్నతనం నుంచీ పడవ నడపడంతోటే సరిపోయింది. నేను బడికి పోలేదు. అయినా పడవ నడిపే వాడికి నాకు చదువుతో పనేమిటి బాబయ్యా” అని అన్నాడు.

పడవ వాని అజ్ఞానానికి విచారించాడు పండితుడు. నీవెలా తరిస్తావని వాపోయాడు.

పడవ వాడు మాట్లాడలేదు. మౌనంగా పడవ నడపసాగాడు. పండితుడు కూడా మాట్లాడలేదు. వేదాలూ, శాస్త్రాలూ రాకపోతే పోనీ అక్షరాలైనా రాని వాడితో తనకి మాటలేమిటని అనుకున్నాడు.

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోయింది. పెద్ద గాలి వేసింది. ఎక్కడనించో అకస్మాత్తుగా నీరు వరదలై వచ్చింది. పడవ ఊగసాగింది.
నీరు హెచ్చిపోయింది. దానికి తోడు ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం మొదలైంది. పడవవాడు నిశ్చింతగా ఉన్నాడు.
పండితుడు భయపడ్డాడు.
పడవ తలక్రిందులైంది. పండితుడు గోల పెట్టాడు.

అప్పటిదాకా మాట్లాడకుండా ఉన్న పడవ వాడు, “మీకు ఈతవచ్చునా?” అని అడిగాడు.
“నాకు ఈత రాదు” అన్నాడు పండితుడు.
“అయితే మీ బ్రతుకు వృథా స్వామీ! నాకు ఈత వచ్చును” అని ఈదుకుంటూ వెళ్ళిపోయాడు పడవవాడు.

ఎన్ని శాస్త్రాలు, వేదాలు తెలిసినా ఈ సంసారాన్ని సాగించాలంటే భగవన్నామమనే ఈత రాకపోతే ప్రమాదం. సంసారాన్ని ఈ జన్మని సురక్షితంగా ఒడ్డు చేర్చాలంటే ఎటువంటి పరిస్థితులలోనైనా దాటాలంటే భగవంతుని నామమనే ఈతవచ్చి తీరాలి.

" ఏ వేదంబు పఠించె లూత? భుజంగంబేశాస్త్రంల్సూచె? దా
నే విద్యాభ్యాసనం బొనర్చి కరి? చెంచే మంత్రమూహించె? బో
ధా విర్భావని దానముల్ చదువులయ్యా, కావు? మీ పాదసం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా ??

అని ధూర్జటి గారు అంటారు

అందుకే, ఏమి రాదు అని చెప్పినవాడే నిశ్చింతగా ఏదో ఒక నామాన్ని పట్టుకొని భవ సాగరాలను (జనన-మరణ చక్రాన్ని) ఈది గట్టెక్కి న (ఈశ్వరుడిని పొందిన) వారు ఎందరో, మహానుభావులు ఉన్నారు.

అందుకే భువసాగరాని దాటుటకు బహు దారులు వున్నాయి అని గుర్తుంచుకోవాలి కేవలం మనకు తెలిసింది మాత్రమే విద్య కాదు అని గమనించాలి.
🙏👏

No comments:

Post a Comment