Thursday, April 30, 2020

త్రిమతాలు

🌹 త్రిమతాలు 🌹

జీవాత్మ పరమాత్మ ని గూర్చిన విచారణలో మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.వాటిని త్రిమతాలు అంటారు.

అద్వైతం
ద్వైతం
విశిష్టాద్వైతం

♥♥ అద్వైతం♥♥
ఇది ఆదిశంకరులుగా ప్రసిద్ధులైన శంకర
భగవత్పాదులు ప్రతిపాదించిన
సిద్ధాంతము.మూడింటిలోను మొదటిది. హిందూమతముపై
అత్యంత ప్రభావము కలిగిన ఆలోచనామార్గములలో ఇది ఒకటి.
బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు,
పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే
అందరి లోని ఆత్మ బ్రహ్మ మయమే. మాయవలన అజ్ఙానము,
దానివలన భేదభావము కలుగుచున్నవి. త్రాడును చూచి
పాము అనుకొన్నవానికి భయము కలుగును. అది తాడు అని
తెలియగానే భయము తొలగిపోవును. అలాగే జ్ఞానము వల్ల
మాయను అధిగమించి, మోక్షము పొందుట సాధ్యము.

♥♥విశిష్టాద్వైతం♥♥
ఇది రామానుజాచార్యులు ప్రతిపాదించిన మార్గము.
నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి
వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని
అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా
త్రోసిపుచ్చిన మార్గమిది.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు -
మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది.
'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే
ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో
జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా
శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల
సంసారబంధమున చిక్కుకొందురు.
భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన,
భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి
విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు.
అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.

♥♥ద్వైతం♥♥
ఇది మధ్వాచార్యులు (ఆనందతీర్ధులు) ప్రతిపాదించిన
తత్వము. మూడింటిలో చివరిది. పై
రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా
అధ్యయనం చేసిన తరువాత ప్రతిపాదింపబడినది.
జీవుడు, జగత్తు, దేవుడు - ఈ మూడూ వేరు వేరనీ,
వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని
ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద
మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము.
వారివారి గుణకర్మలననుసరించి జీవులు తమోయోగ్యులు,
నిత్య సంసారులు,
ముక్తియోగ్యులు అను మూడు విధములు.
దేవునకు, జీవునకు గల సంబంధము యజమానికి,
దాసునకు మధ్య గల సంబంధము వంటిది.

★వీటితో పాటు ద్వైతాద్వైతము ను నింబాల్కుడు,శుద్దాద్వైతము ను వల్లభుడు ప్రతిపాదించారు★

"ఆది శంకరుల అద్వైత సిద్ధాంతమే సత్యమూ,పరమోన్నత స్థాయి సిద్ధాంతం" 🙏

No comments:

Post a Comment