Monday, April 27, 2020

దైవం మానుష రూపేణా ...

దైవం మానుష రూపేణా ...

అది 1976 నవంబర్ 11 వ తేదీ, న్యూఢిల్లీ ...

తెల్లవారుజామున 5 గంటలకు టెలీఫోన్ మొగుతోంది,
పక్క గదిలో ధ్యానం చేసుకుంటున్నాడు వైద్యనాథ్,

అతని భార్య గౌరీ వెళ్లి ఫోన్ తీసుకుంది ...

గౌరీ : హలో ఎవరు ?

అవుతలి వ్యక్తి : మేడమ్ !!! నేను పరమేశ్వర్ మాట్లాడుతున్నాను, అయ్యగారు ఉన్నారా ?

గౌరీ : అయ్యగారు ధ్యానంలో ఉన్నారు పరమేశ్వర్,
ఏమిటీ విషయం ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్ ?

పరమేశ్వర్ : సరే అమ్మా, అర్జంట్ గా అయ్యగారితో మాట్లాడాలి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ...

గౌరీ : సరే ఆయన రాగానే చెబుతాను, ఆయనతో మాట్లాడు

పరమేశ్వర్ : అలాగే అమ్మ ...

ధ్యానం అయిపోయాక గౌరీ పరమేశ్వర్ ఫోను చేసిన విషయం చెప్పింది.

వైద్యనాథ్ పరమేశ్వర్ తో మాట్లాడి హుటాహుటిన రామేశ్వరం ప్రయాణమయ్యాడు ...

గౌరీ : ఏమిటండీ ఈ పరుగులు, అంత అర్జంట్ ఏమిటీ అని అడిగింది.

రామేశ్వరంలో ఒక రోగికి అత్యవసర చికిత్స చేయాలి, సమయం తక్కువగా ఉంది, వెంటనే వెళ్లకపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ, ఆ వైద్యానికి కావలసిన పరికరాలు ఒక పెద్ద సూట్ కేసులో సర్దుకుని బయల్దేరాడు.

రామేశ్వరమా !!! అయితే సముద్ర స్నానం చేసి,
స్వామి వారి దర్శనానికి కూడా వెళ్ళిరండి అనింది గౌరీ.

చూడు నాకు దేవుని మీద నమ్మకం లేదు అని తెలుసు కదా, ఇలాంటివి నాకు చెప్పకు అన్నాడు చిరాగ్గా.

ఇక ఏమి చెప్పాలో తెలియక ఊరుకుంది గౌరీ,

నిజానికి వైద్యనాథ్ నాస్తికుడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల, మేనమామ దగ్గర పెరిగాడు,

తన తల్లిదండ్రులను అంత చిన్న వయసులోనే దూరం చేసాడనే దేవుడంటే కోపం.

దానికి తోడు చిన్నప్పటినుండీ తన మేనమామ కూడా నాస్తికత్వం నూరిపోసాడు.

నేను వెళ్ళి రెండురోజుల్లో వచ్చేస్తాను అంటూ, టెలిఫోన్ ద్వారా రెండు విమాన టికెట్లు రానూ పోనూ బుక్ చేసాడు.

ఆయనతో పాటుగా కాంపౌండర్ ను కూడా తీసుకెళ్లాడు వైద్యనాథ్,

రమేశ్వరానికి నేరుగా విమాన సౌకర్యం లేదు, మధురైకి వెళ్లి అక్కడి నుండీ 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. సాయంత్రం 6 గంటలలోపు చేరుకోవాలి.

మధ్యాహ్నం 3:30 గంటలకు మధురై చేరారు.

అక్కడ వారికోసం ఒక కారు సిద్ధంగా ఉంది. ఆ కారు డ్రైవర్, ఢిల్లీ నుండీ వచ్చిన డాక్టర్ విద్యానాథ్ మీరేనా అని అడిగాడు,

అవును నేనే అని సమాధానం చెప్పాడు వైద్యనాథ్.

మీకోసం రామేశ్వరం నుండీ కారు పంపించారు డాక్టర్ సుందరేశ్ అన్నాడు ఆ డ్రైవర్.


డాక్టర్ సుందరేశా, ఆయనెవరో నాకు తెలియదే అనుకున్నాడు మనసులో కానీ రామేశ్వరంలో ఇంచార్జ్ అయ్యుంటాడులే అని సమాధానపడి, సరే వెళదాం పదా అన్నాడు వైద్యనాథ్.

వాళ్ళు కారు ఎక్కుతుండగా, ఒక వృద్ధుడు వారి దగ్గరకు వచ్చాడు.

ఆయన ఒంటి నిండా విభూతి రేఖలు, మేడలో రుద్రాక్షలు, జడలు కట్టిన జుట్టు, చిల్లులు పడిన పాత మాసిన పంచ కట్టుకుని, చేతి కర్ర సాయంతో వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.

ఆయన ఎవరో బిక్షకుడు అనుకుని రెండు రూపాయలు ఇవ్వబోయాడు వైద్యనాథ్, "

నాకు వద్దు ఏమీ నాయనా, గౌరీ ఎలా ఉంది " అని అడిగాడు ఆ వృద్ధుడు.

గౌరీ వాళ్ళ పూర్వీకులది మధురైయ్యే కానీ ఈయన్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. "

క్షమించండి,
మీరు భిక్షకు వచ్చారేమోనని అలా ప్రవర్తించాను, మిమ్మల్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు,

మీ పేరు ? "
అని అడిగాడు వైద్యనాథ్.

" నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను భిక్షకుడినే,
నా పేరు ఏమని చెప్పను,
ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు, ఇప్పుడే గౌరీ పెట్టిన బొబ్బట్లు తిన్నాను, అన్నాడు ఆ వృద్ధుడు.

అది వినగానే ఈయనెవరో మతిస్థిమితం లేనివాడు అనుకున్నాడు వైద్యనాథ్.

ఆయనతో మాట్లాడుతూ సమయం వృధా చేయడం ఇష్టంలేక వైద్యనాథ్ సతమతమవుతూ చూస్తున్నాడు,

నీకు సమయం అవుతున్నట్లుంది, ఇందా ఇది తీసుకుని వెళ్ళి ముత్తులక్ష్మికివ్వు, కుమార్ కి నయమవుతుందని ధైర్యం చెప్పు అంటూ ఒక చిన్న పొట్లం వైద్యనాథ్ చేతిలో పెట్టి, బయలేదరండి అని డ్రైవర్ తో అన్నాడు .

వారు మధురై నుండీ బయలుదేరిన కాసేపటికే ఆకాశం మేఘావృతమై ఉంది,

స్వాతంత్రం 4 గంటలకే నల్లని మేఘాల వల్ల చిమ్మ చీకటి ఆవరించింది, చెవులు చిల్లులు పడేలా ఉరుములు,
కళ్ళు మిరిమిట్లు గలిగేలా మెరుపులు, కొండలను కొట్టుకుపోయేలా గాలులు,
వీటి మధ్య ప్రయాణం మొదలయింది.

ఉన్నట్లుంది కుండపోతగా వానా కురవడం మొదలయ్యాయి.

త్వరగా చేరుకోవాలని వేగంగా వెళుతోంది కారు. వారికి ఒక 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు మీద పిడుగు పడి అది నిలువునా చీలిపోయి కాలిపోతూ రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది.

ఉన్నఫళాన కారు ఆపే సరికి,
ఆ వేగం వలన తడి రోడ్డు మీద కారు ఒక పది మీటర్లు జారుతూ వెళ్లి నిలిచింది.

అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.

కొద్ది సేపట్లోనే తేరుకున్నారు, సమయం దగ్గర పడుతోంది,

వేరే దారి ఏదైనా ఉందా అని డ్రైవర్ ని అడిగాడు వైద్యనాథ్, వెనక్కు తిరిగి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే,

ఒక చిన్న దారి వస్తుంది కానీ అది అంత సౌకర్యంగా ఉండదు, పైగా వర్షం కదా, బురదగా ఉంటుంది, టైర్లు బురదలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు డ్రైవర్.

మనకు వేరే దారి లేదు కదా,
ఆ దారిలోనే వెళదాం, సమయం లేదు అన్నాడు వైద్యనాథ్.

సరే మీ ఇష్టం సర్ అంటూ డ్రైవర్ కారును వెనక్కి తిప్పి ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం కొనసాగించాడు.

మట్టి రోడ్డు కావడం వలన నిదానంగా వెళుతున్నారు.

అలా కాస్త దూరం వెళ్ళాక వారి దారికి అడ్డుగా ఒక వాగు పొంగి పోర్లుతోంది.

ఇక ఎటూ పోలేని పరిస్థితి, అన్ని దారులూ మూసుకుపోయాయి, ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారు.

సర్, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్ళడం మంచిది, కొద్ది దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది,

అక్కడకు వెళ్ళి తలదాచుకుందాం,
ఇక్కడ క్రూర మృగాలు సంచరిస్తుంటాయి అన్నాడు డ్రైవర్.

సరే, ఇక చేసేదేముంది అని తలూపుతూ, చీకటి, పైగా వర్షం, వీధి దీపాలు కూడా లేవు, ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టాలన్నా ఇంత రాత్రి సమయంలో కొత్తవారిని ఆదరిస్తారో లేదో అన్నాడు వైద్యనాథ్.

మీరు చెప్పింది నిజమే కానీ ఇలాంటి పరిస్థితులలో ఈ అడవిలో ఉండడం కంటే ఆ ఊరి దగ్గర ఉంటే మంచిది కదా అన్నాడు డ్రైవర్.

సరే పద అన్నాడు వైద్యనాథ్.

ఆ డ్రైవర్ చెప్పిన పల్లెకు చేరేసరికి రాత్రి 8 గంటలయ్యింది.

హోరున వాన,
పట్టుమని పదిళ్ళు కూడా లేవు, నిర్మానుష్యంగా ఉంది.

కారు వచ్చిన దగ్గర నుండీ ఆ ఊరిలోని కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.

వర్షం తగ్గేంతవరకూ వేచి ఉండడమే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇద్దరికీ చాలా ఆకలిగా ఉంది.

అలా ఒక అరగంట పాటూ కారులోనే ఉన్నారు వాళ్ళు,

అప్పుడు ఒక లాంతరు పట్టుకుని, గొడుగు అడ్డుపెట్టుకుని, వాళ్ళ కారు వైపుకు ఎవరో వస్తున్నట్లు అనిపించింది.

వస్తున్నదెవరో సరిగ్గా కనిపించడం లేదు. సర్

తొందరపడి తలుపు తీయకండి, ముందు చూద్దాం ఎవరో ఏంటో అని చెప్పాడు డ్రైవర్.

సరే అన్నాడు వైద్యనాథ్,

ఎంత ప్రయత్నించినా ఆ కారు అద్దాల మీద నుండీ వర్షపు చినుకులు కారుతుండడం వల్ల ఆ వస్తున్న మనిషిని చూడలేకపోతున్నారు.

ఆ వ్యక్తి వాళ్ళ కారు కిటికీ వైపుకు వచ్చి, అద్దం మీద తట్టాడు.

నిదానంగా కిటికీ అద్దం కిందకు దించాడు వైద్యనాథ్,

ఎవరో ఒక ముసాలివిడ నిలబడి ఉంది,
ఎవరు బాబు మీరు, ఇందాకటినుండీ చూస్తున్నా, దారి తప్పిపోయారా అని అడిగింది.

ఆవిడను చూసాక కాస్త ధైర్యం వచ్చింది వారికి, అవును అవ్వా మేము రామేశ్వరం వెళ్ళాలి వర్షం వల్ల వాగు పొంగుతోంది అందుకే ఇక్కడ ఉన్నాము అన్నాడు డ్రైవర్.

సరే మా ఇంటికి రండి నాయనా, రాత్రికి ఉండి రేపు పొద్దున్న వెళ్ళచ్చు అన్నది.

హమ్మయ్య !!! అనుకుని ఆవిడ వెనుకే వాళ్ళింటికి వెళ్ళారు ముగ్గురూ ...

ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతూ ఆ ముసలవ్వ ఇంటికి చేరారు ముగ్గురూ.

ఇందా ఈ తువాలుతో తలలు తుడుచుకుని, ఈ పంచలు కట్టుకోండి అని మూడు పాత పంచలు ఇచ్చింది ఆ ముసలవ్వ.

రెండు గదులున్న పూరి పాక అది. అవి కట్టుకుని కూర్చున్నారు.

ఎప్పుడు తిన్నారో ఏంటో, కాస్త వేడిగా ఈ రాగి జావ జాగి తాగి, ఈ జొన్న రొట్టెలు తినండి అంటూ మూడు కంచాల్లో ఉల్లిపాయ ముక్కలు,
పచ్చి మిరపకాయలు,
కాస్త ఉప్పు, జొన్న రొట్టెలు పెట్టిచ్చింది.

వైద్యనాథ్ కి ఆ పదార్ధాలు అమృతంలా అనిపించాయి.

అవి తిని తమ ఆకలి తీర్చుకున్నారు.

మీరు ఇక్కడే పడుకోండి అని చెప్పి చాపలు దుప్పట్లు ఇచ్చింది

పాపం ఆ రోగికి ఎలా ఉందో ఏమిటో, సమయానికి చేరుకోలేకపోయాను అంటూ కాస్త బాధపడి,

అయినా నా చేతుల్లో ఏముంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు వైద్యనాథ్.

నీకోసం కనీసం ఒక్క రొట్టైనా ఉంచుకోవచ్చు కదమ్మా,
ఇలా పస్తుంటే ఎలాగ,
అసలే నీ ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే కదా,
అని ఎవరో అనగానే,

నాకేమీ కాదులేరా,
మనం ఎదుటివారి ఆకలి తీరిస్తే,

మన ఆకలి ఆ భగవంతుడే తీరుస్తాడు అని ఆ ముసలవ్వ వినిపించింది.

ఆ తీరుస్తాడు, తీరుస్తాడు మరి రాత్రంతా నీ ఆకలి ఎందుకు తీర్చలేదు అన్నాడు మళ్ళీ.

తనకు మెలకువ వచ్చినప్పటి నుండీ ఈ సంభాషణ వింటునే ఉన్నాడు వైద్యనాథ్.

లేచి వెళ్ళి ఆ వచ్చిందెవరో చూసాడు.

ఆ ముసలమ్మ కొడుకు షుమారు 45 సంవత్సరాల వయసుంటుంది.

వాళిద్దరూ ఆరుబయట కుర్చుని మాట్లాడుకుంటున్నారు,

వైద్యనాథ్ ను చూస్తూనే రండి అని పలకరించాడు ఆ వ్యక్తి.

వీడు నా కొడుకు కార్తీక్ అని పరిచయం చేసింది ఆ ముసలవ్వ.

అవునా మంచిది అంటూ నవ్వుతూ పలకరించాడు విశ్వనాథ్.

ఏవిటి ఇందాకటినుండీ ఏదో మాట్లాడుతున్నారు ఆని అడిగాడు వైద్యనాథ్.

ఏమీ లేదులే బాబు,
నువ్వు మొహం కడుక్కొని రా

జావ తాగుదువు గానీ అన్నది ఆవిడ.

సరే అని వెనక్కి తిరిగి చూడగానే గోడకానుకుని ఒక ఆవిడ కూర్చుని ఉంది,

ఆమె ఒడిలో తల పెట్టుకుని 11 సంవత్సరాల బిడ్డ పడుకొని ఉన్నాడు.

వైద్యనాథ్ ను చూస్తూనే నమస్కారం పెట్టింది, తను కూడా నమస్కారం పెట్టి మొహం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాడు వైద్యనాథ్.

తనకు వేడి వేడి జావ ఒక చెంబులో ఇస్తూ ఇక్కడ కాఫీ టీ దొరకవు బాబు అని చెప్పింది.

అయ్యో పరవాలేదు అవ్వ అన్నాడు వైద్యనాథ్.

వాళ్ళు నా కోడలు, మనవడు అని పరిచయం చేసింది ముసలవ్వ.

వైద్యనాథ్ ఆ రెండవ గదిలోకి తోని చూసాడు, మొత్తం పేడ నీళ్ళతో తడిసిపోయుంది.

అవ్వా ఈ గదంతా ఇలా తడిసిపోతే నువ్వెక్కడ పడుకున్నావ్ అని అడిగాడు,

మాకిది అలవాటేలే బాబు, ఇక్కడే పడుకున్నాను అనింది. అక్కడ ఎవరూ నిద్రపోలేరు అలా ఉంది

ఆ గదిలో పరిస్థితి, రాత్రి నువ్వు రొట్టెలు తినలేదా అవ్వా అని అడిగాడు వైద్యనాథ్,

ఆ తిన్నాను బాబు అంటుండగానే ఇంతలో వాళ్ళబ్బాయి కార్తీక్ అప్పుడే లోపలికి వస్తూ లేదు సర్,

తనకోసం మేము చేసి పెట్టి వెళ్ళినవి మీకిచ్చి,
తను పస్తుంది, పైగా తనకు చెక్కర వ్యాధి కూడా ఉంది అన్నాడు,

ఈ వయసులో ఇంకా ఉపవాసాలు, పస్తులు ఉంటుంది అన్నాడు.

వైద్యనాథ్ గుండె ద్రవించింది,

ఆవిడ త్యాగం శ్లాఘనీయం అనిపించింది.

ఎంత గొప్ప మనసు ఈవిడది అనుకున్నాడు.

రాత్రంతా పస్తుంది,
నిద్ర కూడా లేదు,
ముక్కూ మొహం తెలియని వారికోసం ఇంత త్యాగం ఎలా చేసావు, ఎంత గొప్ప మనసు అవ్వా నీది అంటుండగా బయటకి నుండీ ఒక కేక వినిపించింది.

పరుగున వెళ్ళారు అవ్వా, కార్తీక్.

వైద్యనాథ్ కూడా వెళ్ళి చూచాడు.

వాళ్ళ మనవడు గిలగిలా కొట్టుకుంటున్నాడు.

ఏమయ్యింది అన్నాడు
వైద్యనాథ్,

ఏదో జబ్బు చేసింది నా మనవడికి, పట్నంలో పెద్దాసుపత్రిలో చూపిస్తున్నాం,

దానికి ఎంతో కర్చవుతుందట పైగా దీన్ని నయం చేసే వైద్యుడు కూడా ఇక్కడ లేడు అంటున్నారు అని చెప్పాడు కార్తీక్.

ఏదీ తన రిపోర్ట్లు ఉంటే ఇవ్వండి అన్నాడు విశ్వనాథ్, అది చూసి ఆశ్చర్యపోయాడు.

తను రామేశ్వరంలో ఏ జబ్బుకైతే ఆపరేషన్ చేయాలని వచ్చాడో అవే లక్షణాలు ఉన్న ఈ అబ్బాయిని చూసాడు.

మాకోసం ఇంత సహాయం చేసిన వీరికోసం ఈ మాత్రం చేయడం నా కనీస ధర్మం అనిపించింది విశ్వనాథ్ కి.

అవ్వా నేను డాక్టర్ ని,
మీ మనవడికి వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నాడు వైద్యనాథ్.

ఎంత కర్చవుతుంది అన్నాడు కార్తీక్, వాటి గురించి ఆలోచించకండి,

నా దగ్గర ఆపరేషన్ కి కావలసిన పరికారాలు సిద్ధంగా ఉన్నాయి, కొన్ని మీరు ఇంట్లో ఉండేవే సమకూరిస్తే ఇప్పుడే చేస్తాను అన్నాడు.

ఆ మాటలు వినగానే ఆ అవ్వ కళ్ళలో నీళ్ళు మొదలయ్యాయి.

వెంటనే వైద్యనాథ్ అడిగినవన్నీ సమకూర్చారు, కాంపౌండర్ సహాయంతో వాళ్ళ మనవడికి ఆపరేషన్ చేసాడు.

మీ మనవడికి నయమవుతుంది, భయపడాల్సిన పని లేదు ఈ మందులు వాడితే చాలు,
పది రోజుల తరువాత కుట్లు ఊడిపోతాయి అన్నాడు వైద్యనాథ్,

కృతజ్ఞతతో వైద్యనాథ్ కాళ్ళ మీద పడ్డారు కార్తీక్,
అతని భార్య.

మీరు దేవుడిలా వచ్చారు సర్, మీ ఋణం తీర్చుకోలేము అన్నాడు కార్తీక్.

అలాంటిదేమీ లేదు అని చెప్పి, భోంచేసి త్వర త్వరగా రామేశ్వరం బయలుదేరారు.

అక్కడకు చేరి, ఆసుపత్రిలో విచారిస్తే అసలు అలాంటి జబ్బుతో అక్కడ ఎవరూ లేరు అని చెప్పారు వాళ్ళు. ఆశ్చర్యపోయాడు వైద్యనాథ్.

మరి డాక్టర్ సుందరేశ్ పంపించారని చెప్పి, మధురైకి కారు ఎవరు పంపించారు అని అడిగాడు వైద్యనాథ్.

అసలు ఇక్కడ సుందరేశ్ అనే పేరుతో ఏ డాక్టరూ లేరు, మేమేకారూ పంపలేదు,

ఏదీ చూద్దాం పదండీ అన్నారు అక్కడి సిబ్బంది.

బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఏ కారూ లేదు, ఆశ్చర్యపోయారు వైద్యనాథ్ , కాంపౌండర్.

అంతా విచిత్రంగా ఉంది అనుకుంటుండగా మధురైలో కనిపించిన వృద్ధుడే కాస్త దూరంలో కనిపించాడు వైద్యనాథ్ కి.

వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తాడు వైద్యనాథ్ కానీ అంతలోనే ఆయన అదృశ్యమయ్యాడు.

అప్పుడు వైద్యనాథ్ కి ఆ వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి,

వెంటనే ఒక కారు మాట్లాడుకుని మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్ళాడు.

అక్కడ ఆ ముసలవ్వను చూస్తూనే, ....

మీ పేరేమిటి అని అడిగాడు, ముత్తులక్ష్మీ బాబు అనింది.

నీ మనవడి పేరు కుమార్ కదూ అన్నాడు, అవును బాబు అనింది ఆ ముసలవ్వ.

ఇక చేసేది లేక తిరుగు ప్రయాణం అయ్యాడు,

అప్పుడు తనకు ఒక విషయం గుర్తొచ్చింది, ఆ ముసలవ్వ మనవాడి పేరు రిపోర్ట్ లో కుమార్ అని ఉంది.

వెంటనే ఆ పల్లెటూరికి వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ వీళ్ళను చూస్తూనే ఎంతో సంతోషించింది ఆ అవ్వ.

నీ పేరేంటి అవ్వ అని అడిగాడు వైద్యనాథ్. ముత్తులక్ష్మీ బాబు అన్నది.

అప్పుడు అర్ధమయ్యింది ఆ ముసలాయన ఇచ్చిన పొట్లం వీరికోసమే అని,....

తన బ్యాగు లోనుండీ తీసి అది ఆవిడకు ఇచ్చాడు.

మొదటిసారిగా ఒళ్ళు పులకరించింది వైద్యనాథ్ కి,

తనలోని నాస్తికత్వం పటాపంచాలయ్యింది,

కళ్ళలో నీళ్ళు కారడం మొదలయ్యాయి.

ఏవిటి బాబు ఏమయ్యింది, ఇవన్నీ ఎందుకడుగుతున్నారు అనడిగింది ఆ ముసలవ్వ.

అవ్వా !
నువ్వెంత అదృష్టవంతురాలివి నీకోసం ఢిల్లీ నుండీ నన్ను రప్పించాడు ఆ దేవుడు అని జరిగినదంతా చెప్పి,

తన బ్యాగు లోనుండీ అ పొట్లం తీసి వణుకుతున్న చేతులతో ఆ ముసలవ్వకిచ్చాడు వైద్యనాథ్.


అక్కడి వారందరికీ ఆ క్షణం భగవంతుని అనుగ్రహం వర్షిస్తున్నట్లనిపించింది.

ఆనందబాష్పాలు రాలుతుంటే ఆవిడ అది తెరిచి చూసింది, అందులో కాస్త విభూతి, అక్షితలు ఉన్నాయి.

ఆ ఇచ్చింది సుందరేశ్వరుడైన ఈశ్వరుడే, మా ఇంటి దేవుడు ఆయనే అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ,

ఆ పొట్లాన్ని భక్తితో కళ్ళకద్దుకుని నుదుటిన పెట్టుకుని, అక్కడ ఉన్న అందరికీ పెట్టింది.

వైద్యనాథ్ ఒళ్ళంతా పులకరించింది,

వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఢిల్లీ కి ప్రయాణమయ్యారు వైద్యనాథ్, కాంపౌండర్.

తను ఇంటికి చేరి జరిగిందంతా చెప్పాలనే ఆతృతతో ఉన్నాడు.

తలుపు తీస్తూనే గౌరీ, నీకో విషయం చెప్పాలి ఇలారా అంటూ సోఫాలో కూర్చోబెట్టి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు,

గౌరికి కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది.

ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఒక కవర్ తెచ్చిచ్చింది.

దాని మీద పేరు ఊరు లేదు, ఎక్కడి నుండీ వచ్చింది,
ఎవరు పంపిందో తెలియదు, ఇదేక్కడిది అని అడిగాడు వైద్యనాథ్.

మొన్న మీరు రామేశ్వరం వెళ్ళిన రోజున మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఒకాయన వచ్చారు,

మీకు బాగా తెలుసునని చెప్పి మీకిమ్మని ఈ కవర్ ఇచ్చారు అని చెప్పింది.

దానిని వెంటనే తీసి చూసాడు, అందులో పది వేల రూపాయలు, ఒక లెటర్ ఉంది.

ఆ లెటర్ తీసి చూస్తే అందులో మీనాక్షీ సుందరేశ్వరుల దివ్య ఆశీస్సులతో అని రాసుంది, అలానే ఆ దేవతా మూర్తుల చిత్రపటం చిన్నది ఒకటుంది.

వైద్యనాథ్ వలవలా ఏడ్చేశాడు,
స్వామి వారి అనుగ్రహం
ఎంతని చెప్పగలం అంటూ,
అది చూసి నివ్వెరపోయింది గౌరీ,

మీరెంత అదృష్టవంతులండీ స్వామి మీతో మాట్లాడారు అని భర్త కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టింది.

అప్పుడు వైద్యనాథ్,
ఆయన వచ్చినప్పుడు తినడానికి బొబ్బట్లు పెట్టావా అని అడిగాడు,

అవునండీ అనింది గౌరీ,

ఆయన నాకు మధురైలో నువ్వు బొబ్బట్లు పెట్టిన విషయం కూడా చెప్పాడు,

అప్పుడు ఏదో పిచ్చి వాడు అనుకుని పట్టించుకోలేదు,
ఆ మహాదేవుడ్ని గుర్తించలేకపోయాను అంటూ ఏడుస్తూనే ఉన్నాడు.

ఈ విషయం వినగానే గౌరి ఒళ్ళంతా వెయ్యి వాట్ల విద్యుత్తు ప్రవహించినట్లయ్యింది,

తన ఇంటికి వచ్చి, తను పెట్టిన బొబ్బట్లు సాక్షాత్తూ ఆ ఈశ్వరుడే తిన్నాడంటే ఎంత అదృష్టం కదా, ఎన్నో జన్మల పుణ్యఫలం అది.

స్వామి నీతోనూ మాట్లాడాడు, నువ్వు పెట్టిన నైవేద్యం తిన్నాడు అని చెప్పాడు వైద్యనాథ్.

అది తలచుకుని ఆనందభాష్పాలు రాల్చింది గౌరీ.

సాధారణంగా అటువంటి ఆపరేషన్ కు 7 వేలు తీసుకుంటాడు వైద్యనాథ్, రాను పోనూ చార్జీలతో కలిపి పది వేల వరకూ అయ్యింది. అదే ఇలా ఇచ్చాడు అనిపించింది వైద్యనాథ్ కు. వెంటనే గౌరీ వైద్యనాథ్ లు మధురై వెళ్ళి, మీనాక్షీ సుందరేశ్వరులను దర్శించుకుని,

మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్ళి కుమార్ కు ఎలా ఉందో కనుక్కుని, ఆ పది వేలు ఆ అవ్వకు ఇచ్చేసారు ...

చూసారా ఢిల్లీ ఎక్కడ,
మధురై ఎక్కడ,
ఆ పల్లెటూరు ఎక్కడ,
రామేశ్వరం ఎక్కడ ...

ఎవరిని ఎలా కలుపుతాడో,
ఏ పావును ఎలా కదుపుతాడో
ఆ ఈశ్వరునికే ఎరుక ...

మా అమ్మమ్మ ఈ లీలను చెప్పడం అయ్యేసరికి అందరికీ ఆనందభాష్పాలు రాలడం మొదలయ్యింది,

పిల్లలకు అన్నం తినిపించేప్పుడు ఇలాంటివి చెప్పడం వలన వాళ్లలో సత్వగుణం మేల్కొంటుంది, వారి తినే అన్నం కూడా పవిత్రమైన ప్రసాదమవుతుంది అని మా అమ్మమ్మ అంటుండేది,

ఈ లీల జరిగిన కొన్ని సంవత్సరాలకు డాక్టర్ వైద్యనాథ్ వాళ్ళ కుటుంబం మధురై వచ్చి స్థిరపడ్డారట.

సర్వేజనా సుజనోభవంతు
సర్వే సుజనా సుఖినోభవంతు
🙏🏻🙏🏻

కధ ముగిసింది
ఓం నమఃశివాయ🙏🏻

No comments:

Post a Comment