Saturday, May 30, 2020

చక్కని కధ - మూడు జన్మల ముష్టివాడు

మూడు జన్మల ముష్టివాడు

చక్కని కధ

ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు.

ఆ ఇంటి యజమాని పండితుడు.

అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు.

ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు.

పండితుడికి కోపం వచ్చింది
నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా.

వీడికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే.... ఏమేవ్

మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు
బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు.

ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది.

కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు.

అతని చేతిలో కర్ర కూడా ఉంది.

అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది.

అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి.

వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు.

ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు.

అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు.

ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు

హ... అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు.

ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.

శ్లోకం :
అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః
దరిద్ర దానాచ్చ కరోతి పాపం
పాప ప్రభావాత్ పునర్దరిద్రః
పునర్దరిద్రః పునరేవ పాపీ
అని శ్లోకం చదివాడు.

వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు.

నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు.

నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు.
అంటే రెండు కారణాలు.
నీకు లేకపోయి వుండొచ్చు.

ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు.

లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు.

అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు.

ఎందుకు ?

ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా.

నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.

జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూచో అన్నాడు.

పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు.

పర్వాలేదు కూచో జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు.

కూర్చున్నాడు బిచ్చగాడు.

ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు

నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక.

అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు.

నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్.

ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు.

తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం.
తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు. బిచ్చగాడికి విషయం అర్థమైంది.

వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు.

తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి.

ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు.

దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది.

తిరగడం కాలం కూడా తగ్గిపోయింది.

అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది.

కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి.

అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు.
నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు.
ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు.

అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది.

సాత్వికంగా ఉండేది.
మంచి ఆహారం లభించేద తనకీ

పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు.

అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు.

ఇతడికది అంగీకారం లేదు.

ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళిపో కూడదు అని అనిపించింది.

బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు.

తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం.

మిగిలినదే తినడం
అంటే అర్థాకలి తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు.

మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు.

అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు.

ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం
ప్రసక్తి లేదు.
లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు.

ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు.

అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు.

ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. అతనొక సాధకుడని
కారణ జన్ముడనీ అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు.

ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము.

అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆపేరు పెట్టారు .

కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరుపెట్టారు.

ఇలాగ వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు.

సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు.

కానీ ఇతనికీ విషయాలు ఏవీ తెలియవు.

ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది.

కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు.

వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు.

పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది.

ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీ ని పిలిచారు.

అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు.

వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు,

మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి

పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు.

కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు.

మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు.

అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.

మన కరపాత్ర స్వామీజీకి అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ 1) కరపాత్ర స్వామిజీ ఎవరు. ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి.
2) నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు.

ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు.

ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు.

అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు.

దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం...

ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది.

అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో....
కరపాత్ర స్వామిజీ వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు.

ఆయనకూడా వెంటనే అంగీకరించాడు.

పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు

ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు.

ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు

నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది.

ఇలా చాలామంది మాట్లాడారు.

స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు.

పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు.

వెంటనే ఆయన అంగీకరించాడు.
వాళ్ళింటికి వెళ్ళాడు.
ఇద్దరు లోపల కూర్చున్నారు.

ఆయన నియమం ముందే ఎరిగిన ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.

ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వం తొణికిసలాడింది.

ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు.

ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది.

సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.

అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు.

అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుల వారు స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టారు.

ప్రసాదంగా ఇచ్చేశాడు భోజనం ప్రారంభించారు.

వెంటనే పండిత స్వామిజీ ఇచ్చేశాడు.

ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది.

గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు.

ఆ సమయంలో స్వామిజీ
అ అడిగాడు.

పండితుల వారు నన్ను గుర్తు పట్టారా అని.

అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.

సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు

పండితుడు.... వద్దండీ శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు.

సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి.

నాగురుదేవులు మీరు.
అన్నాడు స్వామి.

అబ్బే నేను పండితుడను.
అంత వరకే అన్నాడు.

అయ్యా ముందు వినండి.

నేను ఎవరో కాదు మీమూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు.

పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు.

ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి....
పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది.

అంత మాటలొద్దు అమ్మా.
ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి.

ఆనాటికే కాదు
ఈనాటికీ నేను సామాన్యుడినే.

కానీ ...
ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు.

నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు.

అంచేత మీరే నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ.

లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు.

నేను మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది

నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు.

అహంకారాలు పోయాయి గనక
ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.

బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లోఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు.

శ్లోకం:
లౌకికానాంహిసాధూనాంఅర్థం వాగను వర్తతే ।ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి॥

1987 ప్రాంతంలో టీ.టీ.డీ. ధర్మ ప్రచార పరిషత్ ఉండేది. అందులో కాకినాడ ఆచారి దాసు (హరిదాసు)గారు*
ఈ కథ రాసారు
కానీ ప్రచురణ చేయలేదు.

ఈ కథ కాకినాడ దాసుగారికే అంకితం.
👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment