Friday, September 25, 2020

పాప_పుణ్యాలు అంటే ఏమిటీ ..?

 

పాప_పుణ్యాలు అంటే ఏమిటీ ..?

మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు... కాని పుణ్య ఫలాన్ని మాత్రం ఆశిస్తారు., పాప ఫలితాన్ని ఆశించరు.
కాని పాప కార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకం గానే చేస్తారు..., అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం...

ఇంతకీ పాపం అంటే ఏమిటి..., పుణ్యం అంటే ఏమిటి..?

"పరోపకారాయ పుణ్యాయ..,
పాపాయ పరపీడనం" ..అంటే, ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం...

తెలియక చేయడం, అజ్ఞానంతో చేయడం ఒక విధంగా ప్రారబ్ద ఖర్మలను అనుభవిoచడం అవుతుంది..... కానీ తెలిసి చేస్తే అది మహా పాపం అవుతుంది...

పూర్వజన్మ ల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి... చేసుకున్న పాప,పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు. అయితే... ఎంతకాలం ఈ అనుభవం? అనేదీ ప్రశ్నే... దానికీ జవాబు ఉంది.

చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం...ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే. ఇదేం తీర్పు..... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు... ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాబారతంలో ఉంది. ఆ కథ ఏమిటంటే....

కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప దాత. దశ మహాదానాలే కాక షోడశ మహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు... ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు... అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.

ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూత లు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది... నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు. ‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు... ‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు. ‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.

ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోక వాసులందరిలోకి అతి వృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.. దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.

అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.

అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది... వెళ్లి దాన్ని అడుగుదాం రండి అన్నాడు నాళీజంఘుడు. అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు..

‘మీరెవరో నాకు బాగా తెలుసు.... మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడం లోనూ మీరు చక్రవర్తే... ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం... దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనే కదా ఈ కొలను ఏర్పడింది ... అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు... నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.

దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు...... ఇదీ కథ.

కనుక కలకాలం అందరూ చెప్పుకునే విదంగా పుణ్యకార్యాలే చెయ్యాలి. అలాకాక పాపకార్యాలు చేస్తే.. ప్రజలు తలుచుకున్నంత కాలం నరకబాధలు తప్పవు...

పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి, పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది...ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాప ఫలమే కాక వేరొకటి కాదు...

మనం ఆనందంగా ఉన్నాము కదా అని, పరులను కించపరిచేలా ప్రవర్తిస్తే, అది మహాపాపం, ఎందుకంటే వారి కర్మలు వారు అనుభవిస్తున్నారు... పాపదోషం అనేది అనుభవించితే తప్ప పోదు...

అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్ని మధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మనలను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి...... అంతే గానీ ఇది నా గొప్ప, నా భక్తి, నా ఒక్కడి పైననే భగవంతుని దయ అనుకోవడం,
మన అజ్ఞానం మాత్రమే...

ఉత్తమమైన ధర్మం - విదురుడు చెప్పిన ధర్మం..

" ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం " అని విదురవాక్కు...

పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు... ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం.... తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది..... తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది.

ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి ( ఒకరిని కించపర్చడం, ఒకరి గూర్చి చెడుగా మాట్లాడుకోవడం, ఇలాంటివి ) రేపు ఏడుస్తూ ఆ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి...

అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి...., నలుగురి కి సహాయపడాలి , భగవంతుని అనుగ్రహం పొందాలి...

సర్వేజనా సుఖినోభవంతు..

🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment