Saturday, November 28, 2020

జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.

మనసు విచిత్రమైంది. ఒకే ఆలోచన మీద నిలకడగా ఉండదు. మంచి మాటల దారాలతో కట్టినప్పటికీ గాలిపటంలా గిరికీలు కొడుతుంది. కష్టసుఖాలను పక్కపక్కనే ఉంచి ఒకదాన్ని ఎంచుకొమ్మంటే సుఖం వైపే మొగ్గు చూపుతుంది. దుఃఖానికి వెనకడుగు వెయ్యడం, సుఖం కోసం ఆరాటపడటం- రెండూ మనసుకున్న బలహీనతలే. సుఖాస్వాదనకు అలవాటుపడిన మనసు అది తన నుంచి దూరం కావడం ఏ మాత్రం సహించలేదు. కోరికలు నిండిన మనసుతో భగవంతుణ్ని సేవిస్తే అది బానిసత్వం. వాంఛారహిత స్థితితో దైవం ముందు సాష్టాంగపడటం నిజమైన భక్తుడి తత్వం. సర్వేశ్వరుడికి ఇష్టమైంది నిష్కామసేవ.
సుఖం అనే గాలాన్ని చూపించి మనసును మోహింపజేయడం లోక స్వభావం. అస్థిరతకు చిరునామా వంటి మనసును కారణజన్ములు గాటన కట్టేయగలుగుతారు. కోరికలకు తలలూపే నైజాన్ని మాన్పించి కష్టసుఖాలు రెండూ జీవుడి ప్రస్థానంలోని భాగాలే అని దాని చేత ఒప్పిస్తారు. అన్నమాచార్యులు, పోతన వంటి మహాపురుషులు నాటి పాలకులు తమపై విసిరిన ఆశల వలల్ని ఛేదించగలిగారు. తాత్కాలిక కష్టాలను అనుభవించారు. ఆ ఇక్కట్లు వారి చరితను శోభింపజేసి, శాశ్వత మోక్షప్రాప్తికి కారణమయ్యాయి.
అన్ని సమయాల్లోనూ సుఖంగా జీవించగలగడం ఒక నేర్పు. పాంచభౌతికమైన దేహాన్ని ఆకలి దప్పులు బాధిస్తుంటాయి. అవి తీరినప్పటికీ కొంతమంది అసం తృప్తులు నిరాశతో జీవిస్తుంటారు. సిద్ధార్థుడు సతీ సుతులను వదిలి పెట్టాడు. నిరాహారుడై తపస్సు చేశాడు. అతడు పొందిన జ్ఞానోదయ సారాంశం- అన్ని దుఃఖాలకు కారణం కోరికలు అన్న సత్యం.ఈ వాస్తవం కొన్ని శతాబ్దాల పాటు దేశ దేశాల్లోనూ ప్రభావం చూపించింది. పాలకుల నుంచి ప్రజానీకం వరకు ఆశారహిత జీవనంలోని మాధుర్యాన్ని చవి చూశారు.రాజ్య విస్తరణ కాంక్షను విడిచిపెట్టి అశోకుడు అన్ని శోకాల్నీ అధిగమించాడు. నిష్కామంగా ప్రజల్ని సేవించి ప్రజారంజక పాలకుడు అనిపించుకున్నాడు.
ప్రతి ఏడాది కాలం గీసే ప్రకృతి చిత్రం నిష్కామ సేవకు ప్రతీకగా నిలబడుతుంది. సూర్యభగవానుడి ఎండ ధాటికి భూమి బీటలు వారుతుంది. వరుణదేవుడి కరుణా దృష్టికై ఆకాశాన్ని అర్థిస్తుంది. సామాన్యుల శ్రవణేంద్రియాలకు వినిపించని నిశ్శబ్ద సందేశాన్ని ప్రకృతి పరమాత్మకు చేరవేస్తుంది. ఈ నేలతో సంబంధంలేని రుతుపవనాలు ఏ మూల నుంచో వేగంగా వీస్తాయి. ఆకాశం ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఉరుములు ఉరుముతాయి. నీటికై ఎదురు చూసీ చూసీ భూమి అడుగు పొరల్లో ఎండిపోతున్న విత్తనాన్ని నీటి చెమ్మ పలకరిస్తుంది. చల్లని తన స్పర్శతో ఆ గింజకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఎంతో ఉత్సాహంతో భూమి పైపొర దాకా ఎదిగొచ్చిన విత్తనం రెండుగా చీలిన తన భాగాలను ఒక్కటిగా చేసి నమస్కార ముద్రతో ఆకాశానికి ప్రణామం చేస్తుంది. ఏరులుగా నదులుగా పారిన నీరు దాహార్తితో అలమటిస్తున్నవారి గొంతు తడుపుతుంది. నిశ్శబ్దంగా పైకెదిగిన మొక్క ధాన్య సిరుల్ని రైతుకు అందిస్తుంది.ప్రపంచ చిత్రపటం మీద కాలం గీసిన ఈ చిత్రం ప్రతి ప్రాణికీ సుపరిచితమైందే. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే వర్ణాల కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
పంచభూతాత్మకమైన శరీరంలో కొలువైన మనసు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది- ఏదీ నీది కాదు, నీతో ఏదీ రాదన్న వాస్తవానికి మనసు తలొగ్గక తప్పదు. ప్రలోభపెట్టే కోరికలకు ప్రభావితం కావడాన్ని మనసు తగ్గించుకోవాలి. జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment