Wednesday, December 23, 2020

భావాతీత ధ్యానం

🌸భావాతీత ధ్యానం🌸

మహర్షి మహేశ్‌ యోగి ధ్యానానికి నిధానమైన యోగ ప్రక్రియకు పురుడుపోశారు. అది భావాతీత ధ్యానయోగంగా జగత్‌ ప్రసిద్ధమైంది. ధ్యానం అంటే మనసును ఒక దారిలో కుదురుగా నిలువరించడం. అందుకు చాలా పద్ధతులున్నాయి. అన్నింటికన్నా సులభం అయినదాన్ని ఎన్నుకొంటే, కాలంతో పోటీపడుతున్న ఈ యాంత్రిక యుగానికి అది ఒక మంత్రంలాగా ఉపయోగపడుతుంది. తాను కనిపెట్టిన భావాతీత ధ్యానయోగాన్ని అందరికీ పంచిపెట్టడానికి మహేశ్‌ యోగి దేశవిదేశాలు పర్యటించారు. ధ్యానమందిరాలు నెలకొల్పారు. శిష్యులు ఆ బంగారు బాటకు మెరుగులు దిద్ది గురువు రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గురువు కోరుకునేది దక్షిణ కాదు, శిష్యులు తనలా మారడమే ఆయనకు కావాలి. అదే నిజమైన గురుదక్షిణ.
ప్రస్తుతం ప్రపంచమంతా కృత్రిమంగా తయారు కావడానికి అసలైన కారణం యంత్రానికి బానిస కావడమే. డబ్బుకు లోకం దాసోహమైనట్టుగానే, మనిషి మరమనిషికి దాసుడుగా మారాడు. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మశక్తిని, దైవభక్తిని, జీవన్ముక్తిని తాకట్టు పెట్టాడు. మీట నొక్కితేగాని బతుకుబండి కదలలేని దారుణమైన స్థితికి దిగజారి పోయాడు. యాంత్రిక మంత్ర జాలంలో చిక్కుపడ్డ మనిషికి మానసిక ప్రశాంతత కొరవడు తుంది. అనుకోని అవాంతరాలు, సవాళ్లు- శాంతి సాగరంలాంటి జీవితాన్ని అల్లకల్లోలపరుస్తాయి. వాటినుంచి ఉపశమనం పొంద డానికి రకరకాల మాదకద్రవ్యాలకు అలవాటుపడి జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నాడు. ఈ విష వలయం నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి. అందుకు నిదిధ్యాసను మించిన మంచిమందు మరొకటి కని పించదు. నిదిధ్యాస అన్న పదానికి అర్థం నిరంతర చింతన. ఏదో చేయాలని ముక్కు మూసుకోవడంవల్ల శాశ్వతమైన ఆనందం, సమమైన మానసిక స్థితి సాధించలేం. మతాలన్నీ లోకకల్యాణం సాధించాలనే బయలుదేరాయి. కల్యం అంటే ఆనందం. దాన్ని ఎలా పొందాలో చెప్పగలిగిన మతమే సనాతనంగా, సర్వకాల సర్వావస్థల్లో మనల్ని ఆదుకొంటుంది.
భావాతీత ధ్యానం అంటే ఒక వస్తువుపైన మనసును లగ్నం చేయడం కాదు. మనసును స్థూల స్థితినుంచి అతి సూక్ష్మమైన స్థితికి చేర్చడం. ఆ స్థితికి చేరినప్పుడు చైతన్యవంతమైన జగత్‌ స్వరూపం సాక్షాత్కారిస్తుంది. ఆ చైతన్యానికి మూలమైన ఆనందం కరతలామలకమవుతుంది. నిశ్చల జ్ఞానమే నిజమైన సుఖానికి ఆధారం. భావనాతీతమైన చైతన్య స్థితికి చేరినప్పుడు అదే ఆనందార్ణవంగా మారుతుంది. అందరికీ సమ్మతమైంది ఆనంద రసానుభూతి అనే మతం.
యోగాభ్యాసులకు సుఖాసనం ఎలాంటిదో, భావాతీత ధ్యానానికి సులభమైన మార్గం అలాంటిదే; అంతే అవసరం! అనేక రూపాల్లో కనిపిస్తున్న ఈ బాహ్యప్రపంచం వెనక ఒక నిశ్చలత్వం ఉన్నది. అదే సచ్చిదానందం. సత్యంతో కూడిన మానసిక స్థితివల్ల కలిగే ఆ అనుభూతే ఆనందం! పైన ఉవ్వెత్తుగా లేచే అలలు, అడుగున ప్రశాంతంగా ఉండే సముద్రానికి సంకేతాలు మాత్రమే. లోతుకు వెళ్ళినకొద్దీ అలల అలజడి దూరమైనట్లుగా, మనసును బాహ్యప్రపంచంనుంచి దూరం చేసినకొద్దీ అది స్థూలత్వం కోల్పోతుంది. కోమలంగా సూక్ష్మంగా తయారవుతుంది. లోక వ్యవహారంలో అది ఒక సమన్వయాన్ని సాధిస్తుంది. సర్వాత్మ తత్వం మనల్ని పరమాత్మకు చేరవ చేస్తుంది. నేను-నువ్వు, మంచి-చెడు, నాది-నీది అన్న ద్వైతీభావనకు అతీతంగా మనిషి ఎదిగి రుషి అవుతాడు. ఆ స్థాయికి ఎదిగితే గీతామాత చెప్పిన కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అన్న విషయం బోధపడుతుంది. అందుకు భావాతీత ధ్యానమార్గంలో పయనించాలి. జీవితమే ఒక యోగంగా జీవించాలి!

🌹🌹🌹🌹🌹🌹🌺🌺

Source - Whatsapp Message

No comments:

Post a Comment