Wednesday, March 31, 2021

సప్తపది, పెళ్లిలో..ఏడడుగుల అర్ధం..!పరమార్థం..!!

సప్తపది

పెళ్లిలో..ఏడడుగుల అర్ధం..!పరమార్థం..!!

ఇద్దరు వ్యక్తులను,
రెండు కుటుంబాలను
ఒకటిగా చేసేదే వివాహ బంధం.

హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటి చేస్తుంది వివాహం.

పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పూరోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి ,
తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు.

వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి ,
పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.
తలంబ్రాల కార్యక్రమం తర్వాత వధూవరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు.

ఇప్పుడు జరిగేది సప్తపది......💐

భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.
పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.

సప్తపది చట్టరీత్య కూడా ముఖ్యం .
దీని తరువాతే హిందూ వివాహo చట్టరీత్యా చెల్లినట్లు అవుతుంది .
ఈ సప్తపది తంతు ముగెసిన తరువాత భార్యకు ,
భర్త ఇంటి పేరు ,గోత్రం సంక్రమిస్తాయి.

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం.
పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా,
అగ్నిహోత్రుడి చుట్టూ,
పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు,
వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి,
ఏడు అడుగులు వేయిస్తారు.
దీనిని 'సప్తపది' అని అంటారు.

సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం.
సభాసప్తపదాభవ.

ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం.
అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.

మొదటి అడుగు.....💐
“ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు”
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని
ఒక్కటి చేయుగాక!”

రెండవ అడుగు.....💐
“ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు”
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక

మూడవ అడుగు....💐
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.

నాలుగవ అడుగు...💐
“చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.

ఐదవ అడుగు...💐
“పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.

ఆరవ అడుగు....💐
“షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు ”
ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.

ఏడవ అడుగు...💐
“సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు
గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక.

💐సప్తపది మంత్రార్ధం గురించి తెలుసుకుందాం....💐

“సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదా బభూవ! సఖ్యంతే గమేయం సత్యాత్, తేమాయోషం సఖ్యాన్నే మాయోష్మాః సమయావః సంప్రియౌ రోచిష్ణూ సుమన సుమానౌ! ఇష మూర్జం అభిసంపసానౌ సం నౌమనాంసి సంవ్రతా సమచిత్తాన్యాకరం”

“ఓ నా అర్ధాంగి! ఈ ఏడడుగులతో నీవు నా స్నేహితురాలవయ్యావు.
ఈ స్నేహాన్ని ఎన్నటికీ వీడకుండా నాతో సహవాసిగా ఉండిపో.
ఒకరినొకరు విభేదించక సమానమైన ఆలోచనలతో కలిసి ఉందాము.
మన బంధం శాశ్వతమైనది.
నీవు నన్ను ఎన్నటికీ విడిచిపోరాదు” అంటాడు వరుడు.

“సాత్వమసి అమూహం! అమూహమస్మి! సాత్వం ద్యౌః అహం పృధివీ! త్వమ్ రేతో అహంరేతో భృత్ ! త్వం మనో అహమస్మివాక్! సామాహమస్మి! ఋక్తం సా మాం అనువ్రతాభవ !”

” ఓ స్వామి! నీవు ఎప్పుడూ ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండుము.
నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో కలిసి మెలిసి ఉంటాను.
నీవు ఆకాశమైతే నేను ధరణిని.
నీవు శుక్రమైతే నేను శోణితాన్ని.
నీవు మనసైతే నేను వాక్కును.
నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋక్కువు. మనిద్దరిలో బేధం లేదు.
ఎప్పటికీ ఒక్కటే.
కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉందాము ” అని సమాధానమిస్తుంది పెళ్లి కూతురు.

ఎంత చక్కని సన్నివేశమిది..👌
భార్యను భర్త ఎలా ప్రేమించాలో, ఆదరించాలో ,
భర్తను భార్య ఎలా గౌరవించాలో వివాహ మంత్రాల్లొ స్పష్టంగా చెప్పబడింది.
కష్టసుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించడమే వివాహధర్మం.
ప్రతీ వివాహంలో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న కలతలు, కలహాలు సహజమే.
అర్ధం చేసుకుని జీవించడమే భార్యభర్తల అనుభందం.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, 'నాగవల్లి-సదశ్యం'.
ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం.
సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు,
వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది. నాగవల్లిలో పెండ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం,
గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు.
నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్ళు వేయించుతారు.
ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమిత్రుల కోలాహలం మధ్య "బంతి భోజనాల" హడావిడి ఉంటుంది.
వధూవరులిద్దరిని పక్కపక్కన కూచోబెట్టి,
వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి,
వరుసకు బావా-మరదళ్ళలాంటి వారి వేళాకోళాల మధ్య భోజనo చేయడం ఆరంభించుతారు అందరు.

మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో ఉంచడం,
పక్క వారందరూ తినమని బలవంతం చేయడం
అక్కడ జరిగే వేడుక.
ఇవన్నీ వధూవరుల మధ్య సాన్నిహిత్యాన్ని కలిగించడానికి చేసే వేడుకలు.
సనాతన ధర్ముము లోని సంప్రదాయాలు జీవిత పరమార్దము గురించి తెల్పుతాయి
ఇలాంటి వివాహ వ్యవస్థ ప్రపంచములో ఎక్కడ లేదు

ఆత్మల అనుసంధానం.💐
మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి,
తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది,
స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.

జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం.
పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది.
లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది,
పవిత్రమైనది.
పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం,
పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment