Monday, April 12, 2021

లోకంలో ఏ ఉత్సాహమూ కనిపించనప్పుడు, మనిషి తనలోంచి ఉత్సాహాన్ని తోడిపొయ్యాలి.

గాలివాన చెట్టును ఎంతగా ఊపితే, దాని వేళ్లు అంతగా గట్టిపడతాయి. అలాగే జీవితంలో కష్టాలు, ఆటుపోట్లు ఎంత ఎక్కువైతే మనిషిలో అంత సహనం, పట్టుదల పెరుగుతాయి. మొక్క దృఢంగా ఎదిగిందంటే, అది ఎన్నో గాలివానల్ని తట్టుకుందని అర్థం. అలాగే మనిషి మహావిజేతగా నిలిచాడంటే అతడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడన్నది నిజం. ప్రకృతి ప్రతికూలతలు కల్పిస్తున్న ప్రతీసారి, ప్రతిఘటించేందుకు మాను తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నిలదొక్కుకునేందుకు నేలను తన్ని మరీ ఆకాశంవైపు చూపు సారిస్తూనే ఉంటుంది. అలాగే లక్ష్యసాధకుడు కాలం తన సంకల్పానికి సవాళ్లు విసిరినకొద్దీ స్థిరచిత్తుడై ముందుకు సాగిపోతూనే ఉంటాడు.

కాంక్షలు కార్యరూపం దాల్చనప్పుడు కలతపడటం, మనసు చిన్నబుచ్చుకోవడం మనోదౌర్బల్య లక్షణాలు. ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తిలో రెండు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి కూటస్థ బుద్ధి, రెండోది దృఢ దీక్ష. ప్రాపంచిక జీవనంలోనైనా, పారమార్థిక సాధనలోనైనా ఈ సుగుణాలే సంపూర్ణ సత్ఫలితాలనిస్తాయి. కూటస్థం అంటే కమ్మరి దాగలి. కమ్మరి దాగలిలా నిర్వికారంగా ఉండటమే కూటస్థ బుద్ధి. దాగలి మీద ఎన్నో సమ్మెటపోట్లు పడతాయి! అయినా అది ఎలాంటి మార్పు చెందదు. అలాగే పారమార్థికతలో పురోగమిస్తున్న వ్యక్తి ఎన్ని కష్టనష్టాలనైనా నిబ్బరంగా భరిస్తాడు. రెండో లక్షణం దృఢదీక్ష. పెట్టుకున్న లక్ష్యంపై నుంచి దృష్టిని మరల్చని, సాధించేవరకు విశ్రమించని లక్ష్యశుద్ధి అది.

వివేకానంద ప్రపంచ సర్వమత సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లినప్పుడు, పరిస్థితులు ఎర్రతివాచీ పరచి ఏమీ ఆయనను స్వాగతించలేదు. పరాభవాలను, ప్రతికూలతలనూ తట్టుకొని ఆయన ఆత్మవిశ్వాసంతో, పరమాత్మపై విశ్వాసంతో ముందుకు సాగిపోయారు. ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా తన ప్రసంగాలతో పాశ్చాత్యులను ప్రకంపింపజేశారు.

మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని, ప్రేమస్వభావాన్ని కాలం ఎన్నటికీ లాగేసుకోలేదు. ఆ లక్షణాలన్నీ కేవలం మనకు మనం పెంపొందించుకోవలసినవి. ఇలా వివిధ వైరుధ్యాల మధ్య మన జీవనయానాన్ని విషాదాంతం చేసుకుంటామా, ప్రమోదాంతంగా మలచుకుంటామా అన్నది మనపై ఆధారపడి ఉంటుంది.

పువ్వుకుండే కోమలత్వం, పిడుగుకుండే శక్తి- వీటి సంయోజనమే అసలైన ఆధ్మాత్మిక ప్రయాణికుడి ఆనవాలు. పైగా అతడివి బాహ్యపరిస్థితులపై ఆధారపడని ఆంతరంగిక సుఖశాంతులు. అలాంటివారు కష్టాన్నీ కూడా తమకు ఆ పరమాత్మ పంపిన ప్రసాదంగానే భావిస్తారు. అందుకే ‘క్లేశం తరవాత క్లేశంలో అతడి అడుగులే నా గుండెపైన బరువుగా ఆనేది. నా ఆనందాన్ని ప్రకాశింపజేసేది అతడి చరణాల స్వర్ణస్పర్శే’ అంటారు రవీంద్రనాథ్‌ టాగూర్‌ తమ ‘గీతాంజలి’లో. వచ్చిన ప్రతి కష్టమూ జీవితానికొక కొత్త కిటికీ తలుపు తెరిచిందనుకునే ఆశావహులు ఎన్నడూ కుంగిపోరు. తమ గది తలుపులు మూసుకొని కకావికలురై కన్నీరు పెట్టుకోరు.

లోకంలో ఏ ఉత్సాహమూ కనిపించనప్పుడు, మనిషి తనలోంచి ఉత్సాహాన్ని తోడిపొయ్యాలి. ప్రతీ క్షణాన్ని లలితంగా దిద్దుకొని తామరాకుపై నీటిబొట్టులా తళతళలాడాలి. నిజానికి అనివార్యాలను ఆహ్వానిస్తూ, వాటికి మనల్ని మనం అనుకూలపరచుకోవడం అభ్యాసం చేసుకోకపోతే అభ్యుదయంవైపు సాగిపోలేం. సంఘర్షణ, సంక్షోభం జాడలేని జీవితాలే కనిపించవు. అవి మన పురోగమనానికి దీపస్తంభాల్లాంటివి. అవి మనలో నిబిడీకృతమైన శక్తుల్ని మేల్కొలుపుతాయి. అంతర్ముఖులమై ఆలోచిస్తే సుఖదుఃఖాల వెలుగునీడల క్రీడే జీవితం. వెలుగును మాత్రమే వాంఛిస్తూ, చీకటిని నిరాకరిస్తే ఆటను ఎలా సంపూర్ణంగా ఆస్వాదించినవారమవుతాం, కీర్తికిరీటాలకు ఎలా అర్హులమవుతాం

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment