Friday, April 16, 2021

కాలం ఒక ప్రవాహం, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది..

కాలం ఒక ప్రవాహం, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.. ఎన్నో లోయలు, వంపులు, మలుపులు. అన్నీ అధిగమిచ్చి నిరంతరం తనకు తాను ముందుకు సాగుతూనే ఉంటుంది.. ప్రవహించిన నీరు వెనక్కు రాదు.. అదే విధంగా చేజేతులా జారవిడుచుకున్న క్షణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోలేం. బాల్యం లో, యవ్వనం లో ఎన్నెన్నో క్షణాలను వృధా చేసుకుంటాం. వయసు పై పడిన తరువాత ఒక్క సారి వెనక్కు చూసుకుంటే. అదేదో విచిత్రమైన అనుభూతి.. అలా చేసి ఉండక పోవలసిందని.. అలాగే చేయడం మంచిదైందని అనుకుంటాం. అందుకే ప్రతిసారి మన అనుభవాలను, కష్టాలను, సుఖాలను గుర్తుచేసుకుంటూ.. ముందుకు సాగాలి.. అవే మనకు పాఠాలు, గుణపాఠాలు..
ఓరోజు ఓ ధనవంతుడు ఓ అడవిగుండా పోతున్నాడు. ఉన్నట్టుండి ముగ్గురు దొంగలు ఆయనను చుట్టుముట్టి బెదిరించారు. ఆయన దగ్గరున్నదంతా దోచుకున్నారు. అయితే దొంగలలో ఒకడు “ఇతని దగ్గరున్నదంతా దోచేసుకున్నాం. కనుక ఇతనుండి లాభమేంటీ... అతనుంటే మనకు ప్రమాదం కూడా. చంపేస్తేనే మనం బయటపడగలం” అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలతో ఆగలేదు. తన దగ్గరున్న కత్తిని తీసి అతనిపై దాడికి దిగాడు. ఇంతలో రెండో దొంగ అడ్డుపడి “అతనిని చంపడం వల్ల మనకేమీ లాభం లేదు...అతనిని కట్టపడేసి ఇక్కడే వదిలేద్దాం. అతను తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు చెప్పలేడు” అన్నాడు. అతను చెప్పిన మాట బాగుందనుకుని దొంగలు అతనిని తాళ్ళతో కట్టి నడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. కాస్సేపు తర్వాత మూడో దొంగ ఒక్కడూ అతని దగ్గరకు వచ్చాడు. “నిన్ను మా వాళ్ళు బాగా వేధించారు కదూ. కొట్టారు. గాయపరిచారు కదూ...క్షమించు....నాకు నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నేను నిన్ను విడిచిపెడతాను.... ” అంటూ మూడో దొంగ కట్లన్నీ విప్పి అతనిని విడిచిపెట్టాడు. అంతేకాదు, అడవి నుంచి అతనిని తనతోపాటు బయటకు తీసుకువచ్చాడు. “నా వెంటే రా....నువ్వు ఏ అవాంతరం లేకుండా సులభంగా మీ ఇంటికి చేరుకోగలవు...” అన్నాడు. దొంగ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ “సరేగానీ నువ్వు నాతోపాటు మా ఇంటికి రావా”లన్నాడు. “నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీలోనూ ఎంతో కొంత మానవత్వం ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. నీకు కృతజ్ఞతలు” అన్నాడు ఆ ధనవంతుడు. “నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబసభ్యులను పరిచయం చేస్తాను. నన్ను కాపాడింది నువ్వేనని వారికి చెప్తాను, వారెంతో సంతోషిస్తారు.... ” అన్నాడు. కానీ దొంగ తనను క్షమించమని, తాను వాళ్ళింటికి రాలేనని అంటాడు. అక్కడికి వచ్చినట్లు తెలిస్తే నన్ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ చెప్పి ఆ ధనవంతుడికి దగ్గర దారి చూపించి వెళ్ళిపోతాడు. ఈ కథతో తెలుసుకోవలసినవి మూడు గుణాలు. అవి, ఒక దొంగేమో ఆ ధనవంతుడు ఉండి లాభమేంటీ...అతనిని చంపేస్తేనే మంచిదని అన్నాడు. ఇది తమోగుణం. ఇక రెండో దొంగ ఏం చెప్పాడు....అతనిని చంపడంవల్ల మనకెలాంటి లాభమూ లేదు. అతనిని తాళ్ళతో కట్టిపడేసి వెళ్ళిపోదాం అన్నాడు. ఇది రజో గుణం. ఇక ఇంకొక దొంగ వైఖరిని సత్వ గుణంగా చెప్పుకోవచ్చు. సత్వగుణం దైవాన్ని చేరుకునే మార్గం చూపుతుంది. మొదటి ఇద్దరు దొంగలకన్నా అతను మేలు. అతను దొంగే అయినప్పటికీ అతనిలో మిగిలిన ఇద్దరిలోనూ లేని మంచి గుణం ఎంతో కొంత ఉంది. కనుకనే అతను ఆ ధనవంతుడికి ఇంటికి చేరుకునే మార్గాన్ని చూపించాడు.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment