Wednesday, May 26, 2021

ఈరోజు వైశాఖ పూర్ణిమ - బుద్ధపూర్ణిమ

ఈరోజు వైశాఖ పూర్ణిమ - బుద్ధపూర్ణిమ

గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువై, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. వైశాఖ పూర్ణిమను మహా వైశాఖి, బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. పరమగురు పరంపర కేంద్రాలు భూమి మీద అదనంగా ఆరు ఉన్నాయి. అవి జెనీవా, లండన్, న్యూయార్క్, టోక్యో, డార్జిలింగ్, ఆఫ్రికాలోని ఒక ప్రాంతం. ఈ కేంద్రంలో పరమగురు పరంపర ప్రస్తుత కాలపు ఆశ్రమాలుగా భావిస్తారు. భూగోళపు జీవుల గమ్యం ఈ కేంద్రం నుంచి బాధ్యతతో నిర్దేశింపబడుతుంది. వృషభ పూర్ణిమ సమయంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు పరమ గురువు, వారి శిష్యులు హిమాలయ శ్రేణులలోని వైశాఖ లోయలో కలుస్తారు. ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఉత్తములు సంవత్సర ప్రణాళికను అందుకుంటారు. వీరు ఆ ప్రణాళికను మిథున పూర్ణిమ సమయంలో ఈ కింది వారికి ప్రసారం చేస్తారు. ఆలోచనాపరులు, మానవ జాతి నాయకులు, జంతు జాలం, వృక్ష జాతి, ఖనిజ సంపద. ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖిగా, తదుపరి కాలంలో ఇది బుద్ధ పూర్ణిమగానూ ప్రసిద్ధిగాంచినది. యాదృచ్ఛికంగా జగద్గురు పీఠం అంతర్జాతీయ కేంద్రం అదే శబ్ద ఉచ్చారణతో ఉన్న విశాఖపట్నంలో ఉంది. విశాఖ సముద్ర మధ్యంలో వైశాఖేశ్వరుని ఆలయం కూడా ఉంది. అంతర్దృష్టి గలవారు వారి వారి భావ పవిత్రతను బట్టి ఈ అనురూప్యతను అర్థం చేసుకుంటారు.

పూర్ణిమ సమయంలో ధ్యానం మనసు, ఇంద్రియాలు, శరీరానికి ఎంతో ఉపయోగకరం. ఈ సమయంలో సహకారపు, అయస్కాంతపు శక్తుల ద్వారా ఆత్మ ఈ మూడు ఉపకరణాలను సులువుగా అనుసంధాన చేయగలదు. ఈ ధ్యానంపై ఆసక్తి ఉన్నవారు పూర్ణిమ ముందు రోజు నుంచి తేలికైన ఆహారం తీసుకోవాలని, భౌతిక వ్యవహారాలను కట్టుదిట్టం చేసుకోమని సూచించారు. ఎవరైతే తమ శరీరం, ఇంద్రియాలు, మనసును పవిత్రమైన ఆలోచన, చేతల ద్వారా సంధానపరుచుకుంటారో వారు పూర్ణిమ శక్తులను అనుభూతి చెందగలరు. సూక్ష్మ ప్రయాణం ద్వారా వైశాఖ లోయలో నిర్వహింపబడే జ్ఞానుల వార్షిక మహా సమావేశానికి అనుభూతి చెందగలిగే అవకాశం కూడా కలుగుతుంది. సిద్ధార్ధుని బుద్దునిగా మార్చిన బోధివృక్షం పూజా భజనకు నిలువైంది.

వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షానికి పూజచేసే ఆచారం బుద్దుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పువ్వులు తెచ్చారు. కాని ఆసమయంలో బుధుడు ఎక్కడికో వెళ్లి ఉన్నాడు. భక్తులు బుద్దుని దర్శనం కోసం చాలాసేపు వేచి చూశారు. ఎంతసేపటికి బుద్దుడు రాకపోవడంతో భక్తులు నిరుత్సాహం చెంది ఆ పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోతారు. దీనిని గమనించిన బేతవన విహారదాత అనంత పిండకుడు పూజకు తెచ్చిన పూవ్వులు నిరుపయోగం కావడం జీర్ణించుకోలేకపోయాడు. బుద్ధుడు రాగానే ఈ విషయం గురించి చెప్పిన పిండకుడు, మీరు లేనప్పడు కూడా పూజ కొనసాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లాలని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలు అంగీకరించని బుద్ధుడు, ఒక్క బోధివృక్షాన్ని మాత్రమే పూజకు అనుమతించాడు. తన జీవితకాలం, తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే సమ్మతమైందని చెప్పాడు. దీంతో బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన ఉద్యోగులతో, అనుచరులతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు వచ్చారు. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులలో ప్రబలింది. ఆ పూజ ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారమైంది. ఇప్పడు బౌద్దమతం ప్రబలి ఉన్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతూ ఉంది.

అందరికి బుద్ధపౌర్ణమి శుభాకాంక్షలు..

Source - Whatsapp Message

No comments:

Post a Comment