Tuesday, December 14, 2021

🧘‍♂️సామాన్యుడు- జ్ఞాని-మృత్యువు🧘‍♀️

🧘‍♂️ఆచార్య సద్బోధన🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

మాయ లేకపోతే సృష్టి లేదు.

మాయను అధిగమించక పోతే మోక్షం రాదు.

ఇంద్రజాలంలో చేసే మాయలన్నీ ప్రేక్షకులకే గాని, మర్మం తెలిసిన వాడికి అదంతా కేవలం ఇంద్రజాలికుడి హస్త లాఘవ నైపుణ్యమే అని తెలుసు.

అలాగే మాయ అర్ధమైతే సృష్టిని నిజమైన దైవలీలగా చూడగలం.

నావలో పయనించే వ్యక్తి నదిలోనే ఉన్నా నీళ్ళలో మునుగకుండా దాన్ని దాటినట్లు, మన భావాలతో, అనుభవాలతో సహా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మాయా జనీతమేనన్న సత్యం తెలిస్తే, మాయలో పడకుండా జీవనం సాగిపోతుంది.

మాయ సృష్టి గమనం కోసమే గానీ, మన జీవనం కోసం కాదని అర్ధమైతే మాయలో మునగకుండా జీవితం దాటేస్తాం !

🕉️🌞🌏🌙🌟🚩🙏🙏🙏

🧘‍♂️సామాన్యుడు- జ్ఞాని-మృత్యువు🧘‍♀️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే |

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||

బాల్యంలో వ్యాకరణ సూత్రాలను వల్లె వేసి వాటి ద్వారా శాస్త్రాలను అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఆ శాస్త్రాలలో చెప్పబడిన విషయాలను గ్రహించి వాటిని జీవితంలో ఆచరించి మానవ జీవిత పరమలక్ష్యాన్ని అందుకొనుటకు ప్రయత్నించాలి.

భగవత్ సాక్షాత్కారానికి సాధన చేయాలి. కాని ఈ పండితుడు ఇంత వృద్ధాప్యంలో మరణకాలం సమీపించే ఈ సమయంలో కూడా ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ కూర్చున్నాడే.. జీవిత సార్థక్యత కొరకు ప్రయత్నించాలనే ధ్యాస లేకుండా ఉన్నాడే.. ఏమిటి ఈతని మూర్ఖత్వం.. అని శ్రీ ఆది శంకరుల ఆవేదన.

ఈ పండితుడు ఎలాగైతే మరణ కాలం సమీపించినప్పటికీ వ్యాకరణ సూత్రాలను పట్టుకుని కూర్చున్నాడో అలాగే సాధారణ మానవులంతా ధన సంపాదన, వస్తు సంపాదన, భోగాలను అనుభవించటం అనే లౌకిక విషయాలలోనే మునిగి తేలుతున్నారు. ఇలా పుట్టిన దగ్గర నుండి చచ్చే దాకా ఈ ప్రాపంచిక విషయాల లోను, భోగాల లోను మునిగిపోతే ఈ జీవితాన్ని సార్థకం చేసుకొనేందుకు ప్రయత్నించేదెప్పుడు..

మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చి పడిన తర్వాత ఎప్పుడో ఒక అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాడు. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు.

తాను సంపాదించిన ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి, ఇవి సంపాదించుటకు చేసిన కర్మల యొక్క ఫలాలను నెత్తిన బెట్టుకొని ఈ దేహాన్ని వదలి జీవుడు ఒంటరి ప్రయాణం చేయాలి.

ఆ ప్రయాణంలో తనకు సహకరించే వాటిని ఇప్పుడే.. శరీరంలో జీవించి ఉండగానే సంపాదించుకోవాలీ.. దేహేంద్రియాలు, మనోబుద్ధులు చక్కగా పనిచేసున్నప్పుడే జన్మ సార్థకతకి ప్రయత్నము చేసుకోవాలి..

అందుకే ఇక్కడ చిన్న హెచ్చరిక..

నీ మరణ కాలం సమీపించినప్పుడు ఈ ‘డుకృణ్ కరణే’ నిన్ను రక్షించదు.. అని. అంటే ఈ లౌకిక విషయ భోగాలు, ప్రాపంచిక వస్తువులు, ధనసంపదలు.. ఇవేమీ నిన్ను మృత్యువు నుండి రక్షించలేవు అని.


అయితే.. ఈ ధనసంపదలు, ప్రాపంచిక వస్తువులు ఏవీ అక్కరలేదా.. అంటే.. అవసరమే. వాటిని సంపాదించు కోవాలి, ఉపయోగించు కోవాలి, ఈ దేహాన్ని, కుటుంబాన్ని పోషించుకోవాలి. అంతవరకే వాటి అవసరం.

కాని అదే వ్యామోహంలో పడిపోయి నీ జీవిత పరమ లక్ష్యాన్ని మరచిపోకూడదు. వాటన్నింటిని ఉపయోగించు కుంటూ మానవుడుగా నీవెందుకు జన్మించావో ఆ పరమార్థాన్ని తెలుసుకొని దానిని సాధించుకోవాలి. అంతేగాని వాటినే పట్టుకొని కూర్చోకూడదు.

మనం నదిని దాటి ప్రక్క గ్రామానికి వెళ్ళాలంటే పడవ కావాలి. పడవ ఎక్కి ప్రయాణం చేస్తున్న మనం ఆ పడవ మీద వ్యామోహంతో అందులోనే కూర్చుని అదే పనిగా నదిలోనే తిరుగుతుంటే మనం చేరుకోవలసిన గమ్యస్థానాన్ని చేరుకోలేం. ఎప్పుడో ఓకసారి ఆ పడవ మునిగిపోతుంది. దానితో మానవుని ప్రాణాలు పోతాయి.

కనుక.. నీవెవరో.. ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకొని ఈ కష్టాలు, బాధలు, వ్యధలు మొదలైన వాటితో కూడిన ఈ జీవితాన్ని ఏ మార్గంలో మళ్ళించి వాటి నుండి విముక్తి చెందాలో.. నీవు ఎక్కడికి ప్రయాణించాలో తెలుసుకొని నీ గమ్య స్థానమైన సచ్చిదానంద స్వరూపం ఐన పరమాత్మను చేరుకోవాలి. శాశ్వతానందంలో ఉండిపోవాలి.


మరి అలాంటి వారికి మృత్యువు రాదా.. అంటే.. అందరికీ వస్తుంది. సామాన్యులూ మరణిస్తారు, జ్ఞానీ మరణిస్తాడు. సామాన్యులు మరణించి మళ్ళీ మళ్ళీ జన్మలను ఎత్తుతూ వుంటాడు.

ఈ జన్మలో ఎంతో కష్టపడి సంపాదించుకొన్న వాటిని అన్నింటిని వదలిపెట్టి, దీనుడిలా, హీనుడిలా, దిక్కులేని వాడిలా ఒంటరి ప్రయాణం చేసి, తన కర్మ ఫలాలకు, వాసనలకు అనుగుణంగా మరొక శరీరాన్ని ధరించి వస్తాడు. మళ్ళీ ఆ జన్మలోను అదే పని. ఇలా పుడుతూ చస్తూ జన్మలకు జన్మలెత్తుతూ ఉంటాడు. ఇదే మృత్యువు అంటే. మృత్యువుతో నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు సామాన్యుడు.

కానీ.. జ్ఞానీ.. అనేక జన్మలలో తాను సంపాదించిన సంపదలు గాని, తన వారనుకున్న వ్యక్తులు గాని తనకిప్పుడు లేరని, అలాగే ఇప్పుడున్న సంపదలు గాని, వ్యక్తులు గాని ఇక ముందు జన్మలలో తనవి కావని తెలుసుకొని, వాటిపై గల మమకారాన్ని విడిచిపెట్టి తాను పరమాత్మ స్వరూపుడనని ఆ పరమాత్మకు దూరమై జీవుడిగా బాధలు, దుఃఖాలు అనుభవిస్తున్నానని, ఈ బాధలు తొలగాలంటే మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవటమే తన పవిత్ర కర్తవ్యమని తెలుసుకొన్నవాడు.

అలా చేరుకొనుటకు కావలసిన జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా పొంది, జీవితంలో ఆచరించి, జ్ఞానియై ఈ జీవ భావాన్ని విడిచిపెట్టి పరమాత్మ భావంలో పరమానంద స్థితిలో నిల్చి శరీరాన్ని వదలి వేస్తాడు.

ఇదీ మృత్యువే.. కాని.. మృత్యువుతో ఆనందాన్ని పొందుతాడు జ్ఞాని. కనుక నిరంతరము లౌకిక విషయాలలో మునిగిపోయిన వాడు మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకొని దుఃఖాల పాలౌతున్నాడు.🙏🙏🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అలాగాక లౌకిక విషయాలను తృణప్రాయంగా త్యజించగల మహాత్ముడు జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆచరించి, జన్మరాహిత్యాన్ని పొంది శాశ్వత ఆనందంలో ఉండిపోతున్నాడు. ఇదే మృత్యువు నుండి రక్షించబడటం అంటే...

సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు!!

🕉🌞🌏🌙🌟🚩🙏🙏🙏

జగద్గురు:- ఉన్నది అంతా అనుభవించేందుకే!

పృచ్ఛకుడు:- 'ఉన్నదంతా' అంటే?

జగద్గురు:- 'ఉన్నదంతా' అంటే...
కలిమి గానీ, లేమి గానీ!
మానము కానీ, అవమానము కానీ!
జయము కానీ, అపజయము కానీ!
జరా కానీ, మరణము కానీ!!🙏🙏🙏

(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)

సేకరణ

No comments:

Post a Comment