Tuesday, December 28, 2021

నేటి జీవిత సత్యం. *💎సుగుణ భూషణం💥*

నేటి జీవిత సత్యం. 💎సుగుణ భూషణం💥

భౌతిక సంపదలకన్నా సుగుణ సంపద గొప్పది. ధన ధాన్య రాశులు ఎన్ని ఉన్నా పాప భీతి నశించిన భోగానుభవం ప్రమాదకరం.

రావణాసురుడు స్వర్ణ లంకను పరిపాలించాడు. కుబేరుణ్ని జయించి అంతులేని సంపదలు సమకూర్చుకున్నాడు. వేదాల్లో పాండిత్యం సంపాదించాడు. శాస్త్రజ్ఞానాన్ని ఎరుకపరచుకొని పంచభూతాలను తన నియంత్రణలోకి తెచ్చుకొన్నాడు. ఆయుర్వేదంలో ప్రజ్ఞ కలిగి రావణ సంహిత రచించాడు. గొప్ప శివ భక్తుడు. అయినా... ఒకే ఒక తప్పు... సీతాపహరణకు పాల్పడి- మానవుడి చేతిలో మరణించాడు.

సౌశీల్యం లోపించిన పుస్తక జ్ఞానం, మానవత్వాన్ని మరచిన శాస్త్ర విజ్ఞానం, సిద్ధాంతాలను విస్మరించిన పాలన మూలాన- సుగుణాల కారణంగా లభించే ఘన కీర్తిని ఎవరూ ఆస్వాదించలేరు. వినమ్రతను మించిన తపః సాధన లేదంటారు. సద్గుణాల కారణంగా లభించిన గౌరవానికి మించిన ఉత్కృష్టత లేదు. దయను మించిన సుగుణం ఉండదు.

మనకు శారీరక బలం ఉన్నప్పుడు ఎదుటివాడిని ఓడించడం సులువే. కానీ అతణ్ని గెలవడమే కష్టం. సుగుణశీలురు ఎన్నడూ ఇతరులను, శత్రువునైనా సరే- అణగదొక్కాలని అనుకోరు. పైకి తేవాలనే ప్రయత్నిస్తారు.

వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ని బ్రహ్మర్షిని చేశాడు. మొదట్లో తనతో యుద్ధం చేసిన విశ్వామిత్రుడి వెంట యాగ రక్షణ కోసం రామ లక్ష్మణులను పంపడంలో వశిష్ఠుడు కీలకపాత్ర వహించాడు.

సుగుణాలు గలవారికి అసూయా ద్వేషాలు ఉండవు. గుణవంతుల్లో ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం. లోకంలో ఇదే అత్యుత్తమ సన్మార్గం. గుణ హీనులు పక్కదోవ పట్టిస్తారు. సుగుణాల్లో అద్భుత దైవత్వం ఉంటుంది. అందుకే సామాన్యులు ఆ దైవత్వాన్ని వెతికి పట్టుకోవాలి. అందుకోసం గుణవంతులతో స్నేహం చేయాలి. విభజించి పాలించడం ఒక పరిపాలనా సూత్రం అయితే కావచ్చు.... కానీ అది గుణహీనుల సూత్రం. సద్గుణాలు గలవాడు ఒక్కడే అయినా నలుగురితో కలిసిమెలసి ముందుకు నడిపిస్తాడు. గాంధీజీ చేసింది ఇదే. అందుకే ఆ సుగుణం అంత మంచి ఫలితాలను ఇచ్చింది. జాతి భవితనే మార్చింది.

మంచి నడత, క్షమ, ధైర్యం, కృతజ్ఞత అనేవి సుగుణ రాశులు. ఇందులో కృతజ్ఞత విచిత్రమైంది. కృతజ్ఞతను చూపకపోవడం, కృతజ్ఞతను చూపమని అడగడం... రెండూ పొరపాటే. మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. కానీ ఇంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఇచ్చేటప్పుడు చూపాల్సిన కృతజ్ఞత. మనం చేసేది సహాయం కాదు, సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది.

సుగుణాలను సాధన చేయాలి. సుగుణ భూషణుడనిపించుకునేందుకు తహతహలాడాలి.

దుర్గుణాలు మనిషిని నీచస్థితికి దిగజారుస్తాయి. కామం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషంలాంటి భయానక స్థితి మరొకటి లేదు. మూర్ఖత్వం లాంటి బంధం ఇంకొకటి లేదు. దురాశ లోతు తెలియని వరద లాంటిది. అందుకే వీటికి దూరంగా ఉంటూ సుగుణాలన్నింటినీ పట్టుదలతో సాధన చేయాలి.

కోపం, అసహనం... మన పైనే మనం ప్రయోగించుకోవాలని బుద్ధుడు చెబుతాడు. ఎందుకంటే అవి గొప్ప సుగుణాలే అవుతాయి. సుగుణభూషణుడు తాను పొందిన కష్టాలను నీటిపై రాసుకోవాలి. తాను పొందిన కరుణను రాయిపై రాసుకొంటాడు.

దైవం మనకు ప్రసాదించిన వాటిపట్ల మనం కృతజ్ఞత చూపితే దైవం మనకు మరింతగా ప్రసాదిస్తాడు. ఎందుకంటే సుగుణభూషణుల పట్ల అంతర్యామి సదా అనురాగ హృదయుడై ఉంటాడు!

(ఈనాడు అంతర్యామి)

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment