Thursday, January 27, 2022

ధర్మం - విధి

ఆపత్కాలే నాస్తి మర్యాద:

ధర్మం - విధి
➖➖➖✍️

ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.

అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు. అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు. వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు, అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకపోయింది. చివరి ప్రత్యామ్నాయంగా దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ! దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ", అని వేడుకున్నాడు.

వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.

ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.

అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు, దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు, మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.

అతను మూడవసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై, అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు. వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను. దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.

దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.

ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."

ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."

ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.

దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది. ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు." అని ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.

మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి , మార్గదర్శనం చేయాలి!

ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

లోకా సమస్తా సుఖినోభవన్తు!

సేకరణ

No comments:

Post a Comment