Thursday, January 27, 2022

నేటి జీవిత సత్యం. *జిజ్ఞాస*

నేటి జీవిత సత్యం. జిజ్ఞాస

కొందరు తమకున్న పరిమిత జ్ఞానంతో- అంతా తెలిసినట్లుగా అహంభావంతో వ్యవహరిస్తుంటారు. మరికొందరు తమకెంత జ్ఞానం ఉన్నా- తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది కొండంతగా భావిస్తుంటారు. అలా తెలుసుకోవాలనే జిజ్ఞాస మనలో ఉంటే, జ్ఞాన సముపార్జనకు కొత్తమార్గాలు అన్వేషిస్తాం. ఆ క్రమంలో మన మేధ మరింత వికసిస్తుంది. ఆ మనోవికాసం మనల్ని సన్మార్గం వైపు పయనింపజేస్తూ, సామాజిక శ్రేయానికి మనమూ దోహదపడేలా, ఉడతా భక్తిగా ఉపయోగపడేలా చేస్తుంది.

ఇది ఒకప్పటి మాట. సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్న ఓ బాలుడికి- ఒక పెద్ద చెట్టుకొమ్మ తీరానికి చేరుకోవడం కనిపించింది. ఆ దృశ్యం ఆ కుర్రాడిలో పలు రకాల ఆలోచనలను రేకెత్తించింది. ఎదుట అంతా సముద్రమే ఉండగా, ఈ చెట్టుకొమ్మ ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుంది, అసలు ఈ కడలికి అవతల ఏముంది? అక్కడ అడవులు ఉంటాయా? మనుషులు ఉండరా; ఉంటే, వాళ్లెలా ఉంటారు? ఇలాంటి ఆలోచనలు అతడి మస్తిష్కంలో తలెత్తాయి. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనే కుతూహలం అతడితోపాటు పెరిగి పెద్దదైంది. చివరికి ఆ యువకుడు- పట్టుదలతో పెద్దల అనుమతి సంపాదించి, తనతోపాటు తోడుగా బలగాన్ని సమకూర్చుకుని, సముద్రంపై కొన్ని వేల మైళ్లు ప్రయాణం చేస్తూ ఎన్నో కష్టాలకు ఎదురీది- అమెరికాను కనుగొని ప్రపంచానికి మహో పకారం చేశాడు. అతడే క్రిస్టఫర్‌ కొలంబస్‌!

మరో కుర్రాడు ఓ గుడ్డిదీపం వెలుగులో చదువుకుంటూ ఉండగా, గట్టిగా గాలి వీచినప్పుడల్లా ఆ దీపం ఆరిపోతూ ఉంటే, అతడికి విసుగొచ్చింది. ‘ఓ ఆరిపోని దీపాన్ని కనుగొంటే ఈ సమస్య ఉండదు కదా... కానీ ఎలా కనిపెట్టడం?’ అనే జిజ్ఞాసతో రకరకాలుగా ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. చివరికి ఎలక్ట్రిక్‌ బల్బ్‌ కనిపెట్టి లోకాన్ని కొత్త వెలుగులతో నింపాడు. అతడే థామస్‌ ఆల్వా ఎడిసన్‌! ఇలా ఎంతోమంది జిజ్ఞాస, అన్వేషణల నుంచి అనాదిగా సమాజానికి మేలు జరుగుతూనే ఉంది.
ప్రశ్నించే నైజం, జిజ్ఞాస కేవలం ఐహిక ప్రయోజనాలు, ప్రయోగాలకే పరిమితం కాలేదు. శుద్ధోధన మహారాజు కుమారుడైన గౌతముడు- వివాహానంతరం ఒకరోజు నగర వీధుల్లో పర్యటిస్తూ ఉండగా చూసిన విషాద దృశ్యాలు అతడిలో పలు ప్రశ్నలను రగుల్కొలిపాయి. మూడు కాళ్ల ముదుసలి ఆవేదనను, రోగగ్రస్తుడైన యువకుడి ఆక్రోశాన్ని, శ్మశానానికి తరలిస్తున్న విగత జీవుణ్ని, భిక్షాటన చేస్తున్న బక్కచిక్కిన సన్యాసిని చూసిన గౌతముడికి అసలు మానవ జీవితానికి అర్థమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. సత్యాన్వేషణ మొదలైంది. ఆ జిజ్ఞాసే అతణ్ని బుద్ధుడిగా మార్చి, విశ్వ ప్రజానీకానికి మానవ ధర్మాలను ప్రబోధింపజేసింది!

తెలుసుకోవాలనే ఈ కుతూహలమనేది మనిషిని ఎప్పుడూ కొత్త బాటల వైపు అడుగు వేయిస్తుంది. ‘నిన్ను నీవే బాగుచేసుకోవాలి. ఎవరి కోసమో ఎదురు చూడటం వల్ల ఏ ప్రయోజనం లేదు’ అని భగవద్గీత చెప్పడంలోని ఉద్దేశం- జిజ్ఞాసతో కూడిన జ్ఞాన సముపార్జన వల్లే సత్ఫలితాలు లభిస్తాయని బోధించడం!

బమ్మెర పోతనామాత్యులు ‘మహాభాగవతం’లో చెప్పిన ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల నుండు లీనమై’ అని లేవనెత్తిన ప్రశ్నలు... ఆ సర్వాత్ముణ్ని అవగతం చేసుకొమ్మని సూచిస్తాయి.

అందువల్ల ఎవరైనా చిత్తశుద్ధితో, నిజాయతీగా ఏమైనా ప్రశ్నిస్తే, ఆ జిజ్ఞాసను అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి. విజ్ఞులైనవారు తమకున్న పరిజ్ఞానంతో అటువంటివారికి సందేహ నివృత్తి చేస్తూ వారి హృదయాల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి ప్రయత్నించాలి.శాశ్వత సత్యాన్వేషణే జీవితం’ అంటుంది యజుర్వేదం. ఆ సత్యాన్వేషణ నాడూ నేడూ అనే కాదు... నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment