Thursday, January 27, 2022

ఆధ్యాత్మిక జీవనం

🍁ఆధ్యాత్మిక జీవనం🌻


బుద్ధి వికసిస్తేనే మనిషి మనసు ఆధ్యాత్మికత వైపు మరలుతుంది. అప్పుడే మనిషి అజ్ఞానమనే చీకటి నుంచి వెలుగు అనే జ్ఞానం వైపు ప్రయాణిస్తాడు.

నిజమైన ఆధ్యాత్మికత- మనసును నిగ్రహపరచి, దృష్టిని అంతర్ముఖం చేసి ఆత్మసాక్షాత్కారం పొందడంలోనే ఉంది. అందుకే ఆధ్యాత్మిక జీవనంలో మనిషి తనను తాను గమనించుకుంటూ ఆత్మదృష్టిని అలవరచుకోవాలి. ఆత్మబోధనలోనే సత్యదర్శనమవుతుంది. మనిషిలోని తమోగుణాన్ని నిరోధించి, రజోగుణాన్ని అణచివేసి, మనిషిని సత్వగుణ సంపన్నుడిగా చేస్తుంది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఎల్లప్పుడూ సత్యజీవనానికి కట్టుబడి ఉంటారు.

కొండ శిఖరంమీద కూర్చున్న వ్యక్తి కిందికి చూస్తే, అంతా సమతులంగా అనిపిస్తుంది. అలాగే, ఆధ్యాత్మిక శిఖరం చేరుకున్నవారికి తరతమ భేదాలు, ఆధిక్యతా భావాలు ఉండవు. వారు అందరినీ సమానంగా చూస్తారు. గగనంలా గంభీరంగా, సముద్రంలా గాఢంగా, ప్రకృతిలా పవిత్రంగా, చంద్రుడిలా ఆత్మీయంగా ఉంటారు.


ఆధ్యాత్మిక జీవనానికి పునాది నిస్వార్థత అంటారు స్వామి వివేకానంద. అందుకే ఆధ్యాత్మిక జీవనంలో ప్రతి వ్యక్తీ కర్మలన్నింటినీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. సాధ్యమైనంత వరకూ ఇతరులకు ఉపకారం చేయాలి. స్వచ్ఛమైన ప్రేమ, దయ, కరుణ, కృతజ్ఞత, పవిత్రత వంటి దైవీగుణాలు అలవరచుకోవాలి.

పర్వతం ఎక్కినవారు బరువులన్నీ ఒక్కొక్కటీ వదిలించుకుంటారు. లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. అలాగే, ఆధ్యాత్మిక జీవనంలో బహుకాలం ఆశ్రయించి ఉన్న ప్రాపంచిక బంధాలను, భావాలను వదిలేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే మనిషి ఆధ్యాత్మికత శిఖర స్థాయికి చేరుకుంటాడు. సిద్ధార్థుడు రాజకుమారుడిగా ఉన్నప్పుడు ఎన్నో భోగాలు అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని ఆధ్మాత్మిక సాధన ద్వారా బుద్ధుడు అయ్యాడు. అమృతత్వాన్ని పొంది అమరుడయ్యాడు.

ఆధ్యాత్మిక జీవనం అంటే పూజలు, జపాలు, భజనలు చేయడం కాదు. ఇవన్నీ సత్కర్మలు. ఆధ్యాత్మికత అంటే మనిషి తనలోని పశుత్వాన్ని జయించడం. పశుత్వ గుణాలైన అహంకారం, దురాశ, కోపం, మదమాత్సర్యాలు, ఈర్ష్యాద్వేషాలు తొలగించుకోవాలి. మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి.

ఆధ్యాత్మిక జీవనంలో మనిషికి అతిగా ఆశలు, ఆశయాలు, కోరికలు వంటివి ఉండవు. రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. తాత్విక చింతన, స్థితప్రజ్ఞత కలిగిన ఆ మనిషి విమర్శలను, వ్యతిరేకతలను ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానాలుగా ఉపయోగించుకుంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయడు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించిన మనిషి ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడడు. ఆధ్యాత్మిక జ్ఞానసంపద మనిషికి మంచి జీవన విధానాన్ని నేర్పుతుంది. పరమార్థాన్ని బోధించి మనిషిని స్థితప్రజ్ఞుడిగా మారుస్తుంది.

ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగినట్లయితే, అతడి జీవన విధానంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. దృష్టిలో పవిత్రత, సేవలో నమ్రత, స్నేహంలో ఆత్మీయత, సంస్కారంలో శ్రేష్ఠత, మాటల్లో మాధుర్యం వంటి గుణాలను అతడు అలవరచుకుంటాడు. జన్మను సార్థకం చేసుకుంటాడు.

భగవంతుడు చాలా శక్తిమంతుడు. భక్తుల పాలిట కల్పవృక్షం. కష్టమైనా, సుఖమైనా అంతా భగవంతుడు ఇచ్చినవే అని భావించాలి. అనుకున్నది జరగకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ భగవద్భక్తిని విడవకూడదు. భగవంతుడికి అన్ని విధాలా శరణాగతుడై సాధకుడు ముందుకు సాగాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment