Thursday, February 17, 2022

కైలాస పర్వతం - వైజ్ఞానిక విశ్లేషణ -

 కైలాస పర్వతం -  వైజ్ఞానిక విశ్లేషణ - 1:


సంకలనం : భట్టాచార్య


   సాగరతలానికి 6718 మీటర్ల ఎత్తు గల కైలాస శిఖరం కేవలం హిందువులకే కాక బౌద్ధులకీ, జైనులకీ కూడా పరమ పవిత్రమైన ప్రాంతం.దాదాపు హిందువుల ఆలయాలు సమస్తం మూలవిరాట్, గర్భగృహం, విమానశిఖరం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఆవరణ, ప్రాకారం, రాజగోపురం అనే అంశాలతో కూడి ఉంటాయి.ఇందులోని ప్రతి అంశానికి సంబంధించి పొడుగు, వెడల్పు, ఎత్తు, అలంకరణ వంటి విషయాలలో ఎంతో శ్రద్ధని కనబరుస్తారు ,స్థపతులూ శిల్పులూ. కాని ఇక్కడ అవన్నీ ఒక పర్వతశిఖరంలోనే ఇమిడిపోయాయి!మానససరోవరం అనే పుష్కరిణి కూడా అమరిపోయింది - పూజారులూ, మంత్రోచ్చాటనలూ, కానుకలూ, ప్రసాదాలూ అనే తంతులు ఏవీ లేని మనలో ఉన్న నిజమైన భక్తిని ప్రదర్శించడమే పూజావిధానమైన ఆలయం ఇది ఒక్కటే!


     హేతువాదులు కూడా నమ్మి తీరాల్సిన హేతువుకి అందని విషయాలు ఎన్నో కైలాసశిఖరం చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి.వాటిలో ఒకటి ఎంత గొప్ప పర్వతారోహకుడైనా శిఖరం వరకు ఎక్కలేకపోవటం.ఇప్పుడు దీని చుట్టూ మూడు మతాల వారిలో ఉన్న నమ్మకాలను గమనించి చైనా ప్రభుత్వం అనుమతి నిషేధించింది గానీ అంతకుముందు ఎక్కాలనుకుని కూడా ఎక్కలేక వెనుదిరిగినవాళ్ళు సామాన్యులు కారు - ఒక పర్వతారోహకుడు పంతం పట్టి శపథాలతో కూడిన ప్రకటనలు కూడా ఇచ్చి మధ్యలోనే విరమించుకుని వచ్చేశాడు!అంత భీకరమైన పట్టుదలతో వెళ్ళినవాడివి ఎందుకు తిరిగొచ్చావయ్యా? అంటే నాకే తెలియని ఏదో కారణం నన్ను ముందుకి వెళ్ళనివ్వడం లేదు,భయానికి అతీతమైన వ్యతిరేకత పుట్టింది నా మనస్సులో అని చెప్పాడు. రష్యన్ పర్వతారోహకులు చాలామంది ఈ శిఖరాన్ని ఎక్కడానికి వెళ్ళి తిరిగి రాలేదు అంటారు - ఇది నమోదైన చారిత్రక యదార్ధం.


     వీటన్నింటి కన్న హేతువాదులు జవాబు చెప్పలేని అసలైన విచిత్రం దేహపు పెరుగుదల వేగం పెరుగుతుంది - సాక్ష్యం ఏమిటంటే అక్కడ పన్నెండు గంటలు గడిపితే బయట రెండు వారాలు గడిపితే పెరిగిన పరిమాణంలో గోళ్ళూ వెంట్రుకలూ పెరిగడాన్ని అక్కడికి వెళ్ళి కొలిచి చూసుకోవచ్చు!ఒక అబిసీనియన్ పర్వతారోహక బృందానికి సంబంధించిన వ్యక్తి మరీ చిత్రమైన విషయాన్ని చెప్పాడు.బృందంలా ఏర్పడి ఎక్కుతూ ఒకానొక ఎత్తుకి చేరగానే ముందు వెళ్తున్న ఇతని బృందంలోని వారికి ఒక్కసారి కొన్ని దశాబ్దాల వయస్సు పెరిగిపోయిందట!అది అంతటితో అయిపోలేదు, అతని కధనం ప్రకారం వారందరూ వెనక్కి తిరిగి వచ్చిన సంవత్సరం లోపు శతవృద్ధులకి వచ్చే వ్యాధులతో అలమటిస్తూ మరణించారు.


     భారతీయ చలనచిత్ర ప్రప్రథమ నాయిక దేవికారాణి భర్త అయిన Nicholas Roerich అనే రష్యన్ పరిశోధకుడు ఈ శిఖరం మీద ఎన్నో పరిశోధనలు చేశాడు.ఇతని విశ్లేషణలలో దోష రహితులైన మానవులు మాత్రమే చూడగలిగిన శంబల నగరం కైలాసశిఖరానికి దాపులనో, లోపలనో ఉన్నది. కలియుగాంతంలో ధర్మస్థాపన చెయ్యడానికి అవతరించే కల్కి జన్మస్థానం ఈ శంబలయే అని చెబుతారు. హిందువుల పౌరాణిక సాహిత్యంలోనే కాదు...బౌద్ధ, జైన సాహిత్యాలలో కూడా శంబల నగరం గురించిన ప్రస్తావన ఉంది!ఇతని మరొక ముఖ్యమైన విశ్లేషణ ప్రకారం, ఈ శిఖరం స్వయంభువు కాదు, మానవ నిర్మితమైనదే!


     రేఖాగణితంలో శంఖువు(pyramid) ఆకారానికి ఒక ప్రత్యేకత ఉంది.నాలుగు ఒకే కొలత గల త్రికోణాలను ఒక్కో త్రికోణం ఒక్కో దిక్కును చూసేటట్టు నిలబెట్టి వాటి మధ్యన ఖాళీలు లేకుండా ఒకదానినొకటి ఆనుకుని ఉండేటట్టు అమర్చితే శంఖువు అవుతుంది.అప్పుడు నాలుగు వైపుల నుంచి ఈ ఫలకాల మీద ప్రసరించే కాంతి,ధ్వని మొదలైన అయస్కాంత తరంగాలు లోపలి వైపున వక్రీభవనం చెందడం వల్ల కేంద్రం దగ్గర భూమిని తాకేచోట శక్తిపాతం వూహించడానికి శక్యం కాని స్థాయికి పెరుగుతుంది.


     హిందువుల ఆలయపు విమానశిఖరాలు, పగోడాలు అని పిలిచే బౌద్ధుల ప్రార్ధనామందిరాలు,  అన్నీ ఒకే రకమైన నిర్మాణం కలిగివుండి వాటి నిర్మాణంలో శంఖువు ప్రత్యేకమైన అమరికతో ఇమిడి ఉండటానికి కారణం దీని గురించి తెలిసినవారు చేసిన తప్పనిసరి ఏర్పాటు తప్ప అనుకోకుండా ఏదో ఒక ఆకారాన్ని ఎంచుకుని కట్టేస్తున్నట్టు జరగడం లేదు ......


     "నికోలాస్ రోరిచ్" అంచనా ప్రకారం ఈ శిఖరాన్ని నిర్మించినవారు చుట్టుపక్కల మరిన్ని,అంటే వంద వరకు చిన్న చిన్న శంఖువులను నిర్మించారు.  అన్నింటి యొక్క లబ్ధ ఫలితం ఈ క్షేత్రం నుంచి మొదలుపెట్టి ఇక్కడ అధికమై దూరం జరిగే కొద్దీ, బలహీన పడుతూ ఏదో ఒక స్థాయిలో భూమి మీద ఉన్న ప్రతి అడుగునీ కైలాసశిఖరం యొక్క ప్రభావం తాకుతూనే ఉన్నది!


     క్రీ.శ 1999లో geology, physics వంటి అనేక శాఖలలో నిష్ణాతులైన ఒక పరిశోధక బృందానికి నాయకత్వం వహించి ఎన్నో పరిశోధనలు చేసి Where Do We Come From?  గ్రంధాన్ని రచించిన Ernst Muldashev కూడా ఇది మానవనిర్మితమే అంటున్నాడు - కానీ నమ్మడం కష్టంగా ఉంది!అయితే ఇతర స్వయంవ్యక్తమైన అరుణాచలం, కేదారనాధ, తిరుమల గిరుల కన్న విశిష్టమైన కైలాసశిఖరపు నిర్మాణమూ పద్మ దళాల వలె చుట్టూ అమరిన ఆరు పర్వత శిఖరాల అమరికా వాటంతటవి భూమినుంచి పొడుచుకొచ్చి ఏర్పడినాయని నమ్మడం కూడా సాధ్యం కావడం లేదు!


     కేదారనాధ క్షేత్రంలో భక్తులు స్వహస్తాలతో స్పృశించి పులకిస్తున్న శిఖరపు కొన ఇక్కడ ప్రదక్షిణ చేసి తరించడానికే తప్ప కాలుమోపి పైకి చేరుకుని దగ్గిర నుంచి చూడడానికి సాధ్యం కాని కైలాసశిఖరాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది.ఇవన్నీ వాటంతట ఏర్పడి ఉంటే వాటి మధ్యన ఉన్నది ప్రకృతి సహజగణితం అయితే ఆ సంబంధాలని కనుక్కోగలిగిన జ్ఞానం కూడా గొప్పదే కదా!


     “In Tibetan texts..... it is written that Shambhala is a spiritual country that is located in the north-west of Kailash,” Mulsashev wrote. “It is hard for me to discuss this topic from a scientific point of view. But I can quite positively say that Kailash complex is directly related to life on Earth, and when we did a schematic map of the ‘City of the Gods,’ consisting of pyramids and stone mirrors, we were very surprised – the scheme was similar to the spatial structure of DNA molecules.”


     Muldashev believes that the pyramids were built by ancient and advanced people who knew about the laws of subtle energy. He wrote that the mountain is the most important part of a system of ancient monumental structures and is directly connected with the main pyramids of the earth such as the pyramids of Giza and Teotihuacan.


     కైలాసశిఖరం వరకు చేరుకోవడం ఒక యెత్తు,ఆ శిఖరానికి ప్రదక్షిణ చెయ్యడం ఒక యెత్తు!అలవాటు చొప్పున సవ్యదిశలో ప్రదక్షిణ చేసే బౌద్ధులకీ అపసవ్య దిశలో ప్రదక్షిణ చేసే Bon సంప్రదాయస్థులకీ మూడు రోజులు పడుతుంది.కొందరు హఠయోగ సాధకులు ఒక రోజులో పూర్తి చెయ్యగలుగుతున్నారు. కొందరు సాష్టాంగ పరిక్రమ కూడా చేస్తారు - వారికి మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది. భక్తులు 108 ప్రదక్షిణలు చెయ్యగలిగితే ఇక  జన్మ అంటూ లేని మోక్షం తధ్యం అని నమ్ముతారు.


     అంతే కాదు - సింధు, బ్రహ్మపుత్ర, శతద్రు(Sutlej), కమలి అనే నాలుగు పవిత్ర నదులు శివుని జటాజూటం వలె కనిపిస్తున్న ఈ గిరిశిఖరం నుండే తమ జలధారలను స్వీకరిస్తున్నాయి - అభిషేక ప్రియుడైన శివునికి  చేసిన మస్తకాభిషేక జలము ఈ నదులు పారినంత మేర జీవధాతువులను వికసింపజేసి వీటికి జీవనదులనే ఉగ్గడింపును తెస్తున్నది!కైలాసశిఖరానికి దగ్గిర్లోనే ఓంకారశిఖరం కూడా ఉంటుంది.మంచుతో కప్పబడిన ఈ శిఖరాన్ని ఆకాశం నుంచి చూస్తే ఓంకారం కనబడుతునంది. ఇక్కడ నిజానికి రెండు సరస్సులు ఉన్నాయి.అందరికీ తెలిసినది మానస సరోవరమే కానీ రాక్షస సరోవరం కూడా ఉన్నది.రెండింటిలో ఎత్తున ఉన్న మానససరోవరం మంచినీటితో నిండి సూర్యబింబం వలె భాసిస్తూ అమర విభూతిని ప్రదర్శిస్తుంటే దిగువన ఉన్న రాక్షస సరోవరం ఉప్పునీటితో నిండి చంద్రవంక వలె భాసిస్తూ అసుర విభూతిని ప్రదర్శిస్తున్నది. అంటే, అమరాసుర విభూతులు రెండింటినీ సమన్వయించిన ఏకత్వాన్ని ప్రదర్శించడమే గిరియే హరుడై హరియై గౌరియై సాక్షాత్కరించే కైలాసశిఖర సౌందర్యరహస్యం!


     కైలాసశిఖరం గురించి పరిశోధనలు చేసిన చాలామంది శాస్త్రవేత్తలు ఇది మానవనిర్మితం అని చెబుతున్నప్పటికీ నాకు నమ్మాలని అనిపించడం లేదు, అలాగని ఇంత ఖచ్చితమైన అమరికతో చుట్టూ ఆరు పర్వతాల మధ్యన ఈ శిఖరం ఇంతటి అద్భుతమైన సౌందర్యం విలసిల్లుతూ స్వయంవ్యక్తమై ఆవిర్భవించడం అనేది కూడా నమ్మాలని అనిపించడం లేదు - ఇది పూర్తి మనవ మేధో శ్రమ జనితమే అయినా, ఇది పూర్తి దైవ సంకల్పఫలితమే అయినా ఒకటి మాత్రం  నిజం. భూమి మీద దీనిని మించిన అద్బుతమైన సౌందర్యం మరొకటి లేదు!


     ప్రస్తుతానికి కైలాసశిఖరం మానవనిర్మితం అనడానికి తిరుగులేని ఆధారం యేదీ దొరకలేదు గాబట్టి శాస్త్ర ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంది గానీ అది రుజువైతే ప్రపంచంలోని అన్ని దేశాల చరిత్రల్నీ తిరగరాయాల్సి వస్తుంది!ఎందుకంటే, భూమి మీద ఈ శిఖరం గనక మానవనిర్మితమైనది అయితే గిజా పిరమిడ్ కన్న యెత్తైనది అవుతుంది మరి!ఇది మానవనిర్మితమా,దైవసృష్టియా అనేదానితో సంబంధం లేకుండానే ప్రపంచంలోని అనేక ప్రాచీన కాలపు నిర్మాణాలకూ ఈ శిఖరానికీ విడదీయరాని సంబంధం ఏర్పడిపోయింది ఇప్పటికే! 


     ప్రస్తుతం భూమి మీద చెల్లా చెదురుగా ఉండి ఏ సంబంధమూ కనిపించని Easter Island, Stonehenge, Egyptian pyramids, Mexican pyramids, Bermuda Triangle వంటివి కైలాసశిఖరం నుంచి వాటి దూరాల్ని కొలిచి చూస్తే అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక వేసుకుని కట్టిన దృశ్యం కళ్లముందు కనబడి వీటిని ఎలా కట్టారో అర్ధమే చేసుకోలేనివాళ్ళు, ఆధునికులం అని జబ్బలు చరుచుకోవడం చూస్తుంటే జాలి వేస్తుంది! సనాతన ధార్మిక సాహిత్యం నిర్ధారించి చెప్పిన దాని ప్రకారం అనంతకోటి విశ్వాలలో ఒకటైన మన విశ్వాండం యొక్క అక్షం భూగోళం యొక్క అక్షంతో కలిసి పైకి సాగుతూ వూర్ధ్వలోకాలకు వేసిన నిచ్చెన వలె పొడుచుకుని వచ్చిన ఆకారమే కైలాసశిఖరం!కైలాసశిఖరం ఉన్న చోటు నుంచి కిందకి meridian line గీస్తే భూమికి రెండవ వైపున Easter Island ఉంటుంది.


     అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు,ఈ ప్రాంతాలని గుర్తు పట్టగలిగిన సైజు గ్లోబు గనక మీ దగ్గర ఉంటే ఇప్పటికిప్పుడు కొలిచి చూసుకోవచ్చు - Mount Kailash నుంచి Egyptian pyramids వరకు ఒక సరళరేఖ గీస్తే అది Easter Island వైపు చూస్తుంది, ఆ రెంటినీ కలపండి.ఇప్పుడు కొలిస్తే Mount Kailash నుంచి Egyptian Pyramids మధ్య ఉన్న దూరం Mount Kailash నుంచి Easter Island మధ్య దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాదు, Easter Island నుంచి Mexican Pyramids వార్కు ఒక సరళరేఖ గీస్తే అది Mount Kailash వైపుకు సాగుతుంది,ఆ రెండింటిని కూడా కలపండి.ఇప్పుడు Easter Island నుంచి Mexican Pyramids మధ్య దూరం కూడా Mount Kailash నుంచి Easter Island మధ్య ఉన్న దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంటే, Egyptian Pyramids నుంచి Mount kailash మధ్య ఉన్న దూరమూ Mexican Pyramids నుంచి Easter Island మధ్య ఉన్న దూరమూ సమానం అన్నమాట!


     ఈ లెక్క ఇంతటితో అయిపోలేదు, Mount Kailsh నుంచి Stonehenge Monument వరకు ఒక సరళరేఖ గీస్తే అది కూడా Easter Island వైపుకే సాగుతుంది.మళ్ళీ Mount Kailash నుంచి Stonehenge వరకు గల దూరం Mount Kailash నుంచి Easter Island వరకు గల భూమి వ్యాసంలో నాలుగోవంతు ఉంటుంది.ఈ Mount Kailash నుంచి Stonehenge మీదుగా Easter Island వరకు సాగుతున్న రేఖ మీద Easter Island వైపునుంచి మూడోవంతు దూరం దగ్గిర చుక్క పెడితే - అక్కడ Bermuda Triangle ఉంది!Bermuda Triangle రహస్యం గురించి పరిశోధనలు చేస్తున్నవారిలో కొందరు అప్పుడే ఈ అమరికను బట్టి కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు.వారి విశ్లేషణల ప్రకారం ఈ వలయంలోని ఆ ప్రాంతంలో ఉన్న ఒక నిర్మాణం భూమిలోనికి కుంచించుకుపోయి ఉండవచ్చు.అది ఈ వలయం/శ్రీ చక్రబహుభుజి/సహస్రారచక్రం వంటి నిర్మాణంలో ఉండాల్సిన చోట ఉండకపోవటం వల్ల ఐన్స్టీన్ విశ్వంలో కాంతి వంగుతుందన్నట్టు తన ప్రభావం తీవంగా ఉన్నంతమేర స్థల కాలద్రవ్యశక్తి తత్వాలను వంచుతున్నది!


     ఈ దూరాల లెక్కలో ఉన్న అసలైన విశేషాన్ని గమనించండి - MOunt Kailash నుంచి Stonehenge Monument వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Stonehenge Monument నుంచి Bermuda Triangle వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Bermuda Triangle నుంచి Easter Island వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, North Pole  నుంచి Mont Kailash వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు కాగా Mount Kailash ఎత్తు 6714 మీటర్లు!


     ఒక కొలత మాత్రం మీటర్లలో ఉండి మిగిలినవి కిలోమీటర్లలో ఉండడం కూడా గణిత శాస్త్రంలోని ఒక శాఖ అయిన fractal mathematics ప్రకారం చూస్తే అది అనుకోని పొరపాటు వల్ల జరిగినట్టు కాక ఈ నిర్మాణాలను ఇంత ప్రణాళికతో నిర్మించినవారు గణితశాస్త్రంలోని ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదనేటందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.ప్రస్తుతం ఈ అన్ని నిర్మాణాలను గురించి విడివిడి పరిశోధనలు చేస్తున్న వారిలో కొందరు ఇవి మానవనిర్మితాలనీ కొందరు గ్రహాంతరవాసుల చేత నిర్మించబడినాయనీ రెండుగా చీలిపోయి ఉన్నారు. నాకైతే ఈ రెండూ కాక పరమేశ్వరుడు భూమి మీద తన ఉనికిని సర్వులకూ చాటి చెప్పడానికి దివ్యపురుషులను నియోగించి నిర్మింపజేశాడని అనిపిస్తున్నది!ఇతర దేశాల వారికి అయితే మానవులూ లేకుంటే గ్రహాంతరవాసులూ అనటం తప్ప ఇంకేమీ తెలియదు.మనకు అలా కాదు.ప్రాచీన భారతీయ విజ్ఞానుల విశ్వనిర్మాణ సిద్ధాంతం ప్రకారం భూలోకానికి పైన ఏడు వూర్ధ్వలోకాలూ కింద ఆరు అధోజగత్తులూ ఉన్నాయి.ఈ ప్రతి లోకంలోనూ జీవజాతులు ఉంటాయి,ఉంటారు.మన భూమి ఉన్న లోకానికి ఈ పదమూడు లోకాల వారూ రాకపోకలు సాగించగలరు.అధోజగత్తు అన్నందువల్ల మనకన్న అధములు అనుకోనక్కర లేదు,ఈ పదమూడు లోకాల లోనివారు అందరూ మనకన్న అధికులే = వారిలో ఎవరో ఒక లోకం వారు నిర్మించి ఉండవచ్చు!


     ఆధునిక విజ్ఞానశాస్త్రం సృష్టిలోని అనేకమైన కొలతలలో 11 కొలతలను (dimensions) మాత్రమే నిర్వచించగలిగింది.మనం మూడవ కొలతలో ఉన్నాం, (3rd dimension)..అంటే పొడవు,వెడల్పు,ఎత్తు,కాలం అనే ఈ మూడు కొలతలలోనే మన ఇంద్రియాలు పని చేస్తాయి. కాలం కూడా కలిపితే 4th dimension అవుతుంది. మనకు కొద్ది దూరంలో ఉన్న వస్తువుని కదల్చాలంటే మనం అక్కడికి వెళ్ళి స్పర్శ ద్వారా మాత్రమే కదిలించగలం - అయితే అయిదవ కొలతలోకి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళకుండానే ఆ వస్తువుని కదిలించగలం.అలాంటి దివ్యపురుషులు నిర్మించడం వల్లనే ఎల్లోరా కైలాసనాథ స్వామి ఆలయంలో తొలచిన రాళ్ళ జాడ కనబడటం లేదు, మానవులు తొలిస్తే గనక అన్ని టన్నుల రాళ్ళని ఆనవాళ్ళు లేకుండా మాయం చెయ్యడం కుదరదు. కొంతమంది సిద్ధాంతీకరించిన మానవుడి ఆధిక్యతను సవాలు చేస్తున్న ఈ దివ్య నిర్మాణాలను చూసి కూడా  సనాతన ధర్మమే అన్నిటికన్న ఉన్నతమైనదని ఒప్పుకోలేనివారిని కాలమే సమాధాన పరుస్తుంది - అది ఎంతో దూరం కూడా లేదు!


     ఈ పరిశోధనలు చేస్తున్నవారు గానీ ఈ సూత్రీకరణలను చేస్తున్నవారు గానీ పొరపాటున హిందువులై ఉంటే  ఈ దేశంలోని వారే వారిని కుళ్ళబొడిచి ఉండేవారు - మన అదృష్టం బాగుండి వాళ్ళు విదేశీయులు అయ్యారు!ఇన్నాళ్ళూ వైదిక సంస్కృతికి పుట్టినిల్లు అయిన హరప్పా  పాకిస్తానుకి పోయిందని బాధగా ఉండేది, ఇవ్వాళ కైలాసశిఖరం యొక్క గొప్పదనం తెలిశాక మనస్సు చల్లగాలికి చిన్న చిన్న అలల్ని పుట్టిస్తూ తుళ్ళింతలై నవ్వుతున్న సరస్సులా తయారైంది!


     దేహదారుఢ్యం అవసరమైన కైలాస శిఖర దర్శన యాత్రని రిటైరయ్యాక చూద్దాం... లెమ్మనుకోకుండా యాభైకి లోపు ఒక్కసారైనా చూడాలనుకోవడం, వీలు చేసుకుని వెళ్ళడం, చూసి తరించడం ఉత్తమం.కొన్ని చోట్లకి మనం ఒక్కసారి వెళ్ళాలని అనుకోగానే సాధ్యపడకపోవచ్చు, దైవం నడిపిస్తే తప్ప కొన్ని చోట్లకి వెళ్ళలేకపోవడం చాలామందికి అనుభవమే - అయినా మనకంటూ మనసులో కోరిక ఉండాలి కదా!


     రంగులు మారుస్తుంది, ఏ రెండు సార్లు చూసినా ఒక్కలా కనిపించదు, ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు, మాయలు చూపిస్తూ మాయను పోగొడుతుంది - లయకారకుడైన శివుడు తానై వెలిగే ఈ హిమదీపం అహాన్ని చంపేస్తుందనేది తిరుగు లేని పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

No comments:

Post a Comment