Wednesday, February 16, 2022

నేటి జీవిత సత్యం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ తప్పొప్పులు ఉండనే ఉంటాయి.

నేటి జీవిత సత్యం.

ప్రతి వ్యక్తి జీవితంలోనూ తప్పొప్పులు ఉండనే ఉంటాయి. అయితే, తాము చేసిన తప్పులేమిటో గుర్తించి, వాటిని సరిదిద్దుకునే లక్షణం సహృదయులైన కొందరిలోనే ఉంటుంది. మరికొందరైతే తమ తప్పులను తెలుసుకోకుండా ఇతరులలోని దోషాలను ఎత్తిచూపుతూ, వారిని పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు. పైగా, ‘ఎదుటివారు తప్పులు చేస్తున్నారు కాబట్టే వారిని మందలిస్తున్నాం. తప్పును చూపకపోతే, సరిదిద్దుకునేది ఎట్లా?’ అని తమ వాదాన్ని సమర్థించుకుంటారు. ఇంకొందరు ఎదుటివారిలో లోపాల్లేకున్నా, వారి గుణాలను, అభివృద్ధిని చూసి ఓర్వలేక దోషారోపణం చేస్తుంటారు. వీరందరికన్నా భిన్నంగా ఉండేదే సత్పురుషుల జీవనశైలి. వారు ఇతరుల దోషాలను తమ మీద వేసుకుంటారు.

పూర్వం శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఏర్పాట్లను చూసి సహించలేని మంథర తన మాటలతో కైకేయి మనసును మార్చివేసింది. దశరథ మహారాజు ఇచ్చిన రెండు వరాల సంగతిని గుర్తుచేసింది. శ్రీరాముడికి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం కోరేలా కైకేయిని ప్రేరేపించింది. పుత్ర వ్యామోహానికి లోనై దశరథుడిని నిస్సహాయ స్థితిలో పడవేసింది కైకేయి. శ్రీరాముడి ఎడబాటు వల్ల కలిగిన దుఃఖంతో సంభవించిన దశరథ మరణానికి పరోక్షంగా కారకురాలైంది. దశరథుడు భార్యకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాముడిని అడవుల పాలు చేశాడు. పితృవాక్య పరిపాలన కోసం రాముడు సీత, లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు వెళ్లాడు.
దశరథుడి మరణం తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి మేనమామ ఇంటి నుంచి రాజ్యానికి వచ్చాడు భరతుడు. తాను రాజ్యంలో లేని సమయంలో జరిగిన అనర్థాలన్నిటికీ తానే కారణం అని తనపై దోషారోపణ చేసుకున్నాడు ‘మంథరది తప్పు కాదు. నా తల్లి కైకేయీ ఏ దోషం చేయలేదు. దశరథ మహారాజు నిర్ణయం తప్పు కాదు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన చేయడం కూడా కారణం కానే కాదు.
నా పాపమే శ్రీరామచంద్రుణ్ని అడవులపాలు చేసింది’ అని భరతుడు తనపై దోషారోపణ చేసుకున్నాడు. రాజ్యంలో ఏ పొరపాటు జరిగినా తానే బాధ్యత వహించే ధార్మికుడైన, ఆదర్శవంతమైన ప్రభువులా ప్రవర్తించిన భరతుడి స్వభావం అందరికీ కనువిప్పు.
రాజేంద్రపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని శివభక్తుడైన కులోత్తుంగ చోళుడు (క్రిమికంఠుడు) పరిపాలన చేస్తున్నాడు. తన రాజ్యంలో ఉండే ప్రజలంతా ‘శివుడే పరమదైవం’ అని అంగీకరిస్తూ సంతకం చేయాలని ఆజ్ఞాపించాడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రధాన ఆచార్యులైన భగవత్‌ రామానుజులను కూడా బలవంతంగా రాజసభకు రప్పించి, సంతకం చేయించాలనుకున్నాడు. రామానుజుల శిష్యులలో ప్రథముడు, ప్రధానుడు అయిన కూరేశులు, రామానుజులు ధరించే కాషాయాలను తాను ధరించి, గురువును సురక్షితంగా కర్ణాటక ప్రాంతం చేరుకునేట్లుగా ఒప్పించాడు. తగిన ప్రణాళిక ఏర్పర్చి రాజసభకు చేరుకున్నాడు.

సభలో వేదశాస్త్ర, పురాణేతిహాసాల్లోని వృత్తాంతాలను, ప్రమాణ వాక్యాలను ఉదహరిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేస్తూ, అద్భుతంగా వాదిస్తున్న కూరేశుల నైపుణ్యాన్ని సహించలేని రాజు దురాగ్రహంతో ‘వారి నేత్రాలను పెకలించి వేయండి’ అని భటులను ఆదేశించాడు. విశిష్టాద్వైత సిద్ధాంతం పరిరక్షణ కోసం తన నేత్రాలను కోల్పోయిన కూరేశులు మాత్రం, తన నేత్రాలు పోవడానికి వేరెవరినీ తప్పు పట్టలేదు. ‘ఇదివరలో తాను ఏ భక్తజనుల బొట్టును చూసో, వారి పడికట్టును చూసో విమర్శలు చేసి ఉండవచ్చు. ఆ కారణంగానే (చేసిన తప్పునకు శిక్షగానే) నేత్రాలను కోల్పోయాన’ని చేయని నేరానికి సంబంధించిన దోషారోపణను తనపై వేసుకున్నాడు.

నంబిైళ్లె అనే ఆచార్యులను, వారి వాక్‌ వైభవాన్ని ఒక పండితుడు సహించలేక అందరిలో ఘోరంగా నిందించాడు. తనను నిందించిన పండితుడికి క్షమాపణ చెప్పడానికి సిద్ధపడ్డాడట నంబిైళ్లె. ఈ విధంగా మన పూర్వీకులే కాకుండా, సమకాలీనులైన కొందరు మహానుభావులు సమాజంలోని అలజడుల గురించి, విభిన్న ప్రాంతాలలో ఉత్పన్నమయ్యే ఎన్నో సమస్యల గురించి తాము స్పందిస్తూ, బాధ్యత వహిస్తూ తమ మీదనే దోషారోపణం చేసుకుంటూ, ఔదార్యంతో నివారణ చర్యలకు నడుం బిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి అందరికీ ఆదర్శప్రాయమైన చర్యలే.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment