ఆత్మ పరమాత్మ
ఆత్మ పరమాత్మలో ఏది ముందు, ఏది వెనుక..
ప్రకృతి, పురుషుడు ఎవరిది ముందడుగు, ఎవరిది వెనకడుగు... విత్తు, చెట్టు దేనిది తొలి రూపం దేనిది మలిరూపం...
వ్యక్తమయ్యేదే తొలి అంశనా..! వ్యక్తం కానిది మలి అంశనా..! వ్యక్తమయ్యేది ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం, వ్యక్తం కానిది ఎస్సెన్స్-స్తత్వం. అంటే ఎస్సెన్స్ లేనిదే ఎగ్జిస్టెన్స్ లేదు. స్తత్వం కాని అస్తిత్వం లేదు. స్థాయి భావం సాధ్యమైతే తప్ప రససిద్ధి కలగదు.
స్థాయి భావానికి సాంద్రరూపమే రసాస్వాదన అరూప సంపద నుండే రూప సంపద శూన్యం నుండే స్థితి అయితే స్థితి కూడా కాలగమనంలో శూన్యం కావలసిందే! రూపం అరూపం కావలసిందే!! ద్వైతం అద్వైతం కావలసిందే!! కారణం అద్వైతమే ద్వైతంగా పరిణమించింది కాబట్టి నాణెం ఒక్కటే బొమ్మా బొరుసులలో ఒకటి వ్యక్తం, మరొకటి అవ్యక్తం. మొత్తానికి వ్యక్త అవ్యక్తాల సంయోగమే నాణెం. ఆ ద్వైత అద్వైతమే యోగం ఆత్మయోగం కనిపించని అంతరంగ తత్వం నుండి అగమ్య గోచరమైన ఆకాశ తత్వంలోకి చొచ్చుకుపోవటమే ఆత్మయోగం ఇహం పరంగా పరిణమించటమే ఆత్మయోగం స్థితి నుండి శూన్యాన్ని తొలుచుకుంటూ పోవడమే ఆత్మయోగం. ఈ ఆత్మతత్వానికి సాకార రూపమే భగవద్గీతలోని కృష్ణుడు ....
'మహాత్మానస్తు మాం దైవీం ప్రకృతి మాశ్రీతాః
భజంత్య నన్య మనసో జ్ఞాత్వా భూతాది మ వ్యయమ్'
అని ఆ కృష్ణుడే స్వయంగా మహాత్ములు నిశ్చల స్వభావంతో దైవీ ప్రకృతితో విలసిల్లే తననే సకల ప్రాణుల స్థితికి మూలంగాను, అక్షర రూపంగాను పరిగణిస్తారంటాడు. ఇక్కడ ఆది స్థితి అంటే పరా ప్రకృతి పరమాత్మ. ఈ ఆది స్థితికి వ్యక్తరూపమే అపర ప్రకృతి... జీవాత్మ. ఎగ్జిస్టెన్స్ జీవాత్మ అయితే ఎస్సెన్స్ పరమాత్మ ఇంతకీ ఆత్మ, పరమాత్మలు రెండా, ప్రకృతి పురుషులు రెండా, రెండులా అనిపించే ఒక్కటా, ఏకత్వమే ద్వైతం కావటమా, నిజానికి పురుషత్వం లేని ప్రకృతి తత్వం ఉందా... ప్రకృతిలేని పురుష సాధ్యమా... ద్వైతం అద్వైతమా.. అద్వైతం ద్వైతమా, అసలు ఉండటం, ఉండకపోవటం ద్వైతాలు విరుద్ధాలు కాదు.
క్షరం, అక్షరం ద్వైతమే కానీ ఈ ద్వైతం నిజానికి అద్వైతం కారణం రెండింటి ఉనికి ఒకే సమయాన సాధ్యం కావటంలేదు. అంటే 'ఉంది' అనుకుంటున్నపుడు 'లేనిదానికి' ఉనికి లేదు. 'లేదు' అనుకుంటున్నపుడు 'ఉండటం' జరగటంలేదు. స్థితి వరకు ఒక్కటే సాధ్యం. ఆ ఒక్కటే అద్వైతం. ఒకటి రెండు కావటం, రెండు ఒక్కటి కావటం 'సృష్టి'.
ఇంతకీ ఆత్మ వర్తమానం. పరమాత్మ వాస్తవం జీవం వెంట పరుగులు తీస్తున్న ఆత్మ, పరిగెడుతున్నంత కాలం క్షరమే! పరిగెత్తటం ఇహం పరిగెత్తనిది పరం.
కాబట్టి పరుగెత్తని తత్వం పరమాత్మది. అది అక్షరం, శాశ్వతం.
వికారం, అజ్ఞానం, భ్రమ-లను ఎరుగనిది అక్షరం. పరమాత్మ ఆశ్రయంలోనైనా అంటే మరొక స్థితిని ఆశ్రయించిన ఉనికిలోనైనా వికారాలకు తావాలమైంది, అజ్ఞానానికి అవకాశమిచ్చింది, భ్రమాన్వితమైంది ఆత్మ జీవ లేదా దేహ రూపంలో వ్యక్తమైంది ఆత్మ ఏ రూపంలోనూ వ్యక్తం కానిది పరమాత్మ వ్యక్తమైంది నశించే తీరుతుంది కాబట్టి క్షరం అవ్యక్తానికి నశించే అవకాశం లేదు కాబట్టి అక్షరం. అందుకే ఇహంలోని ఆత్మను క్షరంగాను, పరంలోని ఆత్మను అక్షరంగాను చెప్పుకుంటుంటాం. ఈ 'ఆత్మ'ను భగవద్గీత 'పురుష' అంటుంది 'పురుషోత్తమ యోగ' అధ్యాయంలో 'ద్వాలి వౌ పురుషౌ లోకే క్షరాశ్చాక్షర ఏవ చ' అంటూ ఈ లోకంలో ఆత్మ ఉనికిని క్షరంగాను, అక్షరంగాను వింగడిస్తోంది.
'ద్వావి వౌ పురుషౌ' అంటూ, క్షర, అక్షర పురుషులుగా 'ఆత్మ'ను నిర్వచిస్తోంది. 'క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే' అంటూ సకల ప్రాణికోటిని క్షరంగాను, ఆ ప్రాణికోటిలోని ఆత్మను అక్షరంగాను చెప్తోంది. కాబట్టి విశ్వంలో ఆత్మ శాశ్వతం.. ఆత్మ తొడుక్కునే భౌతికం అశాశ్వతం. ఇక 'కూటస్థం' అంటే అనేకాలలో కొలువై ఉన్నది అంటే పాంచ భౌతికంగా ఉన్నా లేకున్నా శాశ్వతమే. ఆత్మ శాశ్వతమే అయినప్పటికీ దేహం మాత్రమే అశాశ్వతం!
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment