Saturday, January 28, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 41 భగవాన్ రమణ మహర్షి అవతారం ముగించుట తరువాయి భాగం

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 41
భగవాన్ రమణ మహర్షి అవతారం ముగించుట తరువాయి భాగం 

      ఏప్రిల్ 14 , 1950 వ సం || ము రానే వచ్చింది . ఆ రోజు భగవాన్ తమ అవతారము ముగించే రోజు . ముఖ్యమైన భక్తులు ఆ రోజు భగవాన్ కడకువచ్చి వారి ఆశీర్వచనము తీసుకుని కన్నీళ్ళు కార్చి వెళ్ళినారు . వైద్యులు కూడా అదే రోజున మళ్ళీ పరీక్షించి ఆశ వదులుకున్నారు . భగవాన్ నీరుతాగే పరిస్థితిలో కూడా లేరు కాని డాక్టరుగారి భార్య నారింజ రసం భగవాను ఇవ్వాలని కోరిక ఉండుటచే భగవాన్ భక్తుల కోర్కెను తీర్చుటకై నారింజ రసమును ఇవ్వమని అడిగినారు . *ఆ రోజు కృష్ణ పక్ష త్రయోదశి శుక్రవారం . ఆ సాయంత్రం 4 గంటల నుండే భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది . భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేరని గ్రహించి వారి గదికి ఒక తెరను అడ్డుగా వేశారు* . కాని కరుణామయుడైన భగవాన్ ఆ తెరను తొలగించమని సాయంత్రం 6 గంటల వరకు దర్శనము ఇస్తూనే ఉన్నారు . రాత్రి 8 గంటలు అయిన తరువాత భగవానకు ఇష్టమైన ' అక్షర మణిమాల ' భక్తులు గానం చేయుచుండగా *ఆనాటి రాత్రి 8 గంటల 47 నిమిషములకు ఒక దివ్యకాంతితో గల జ్యోతి భగవాన్ ఉన్న గదిగోడనానుకుని పయనిస్తూ అరుణాచల గిరివైపు సాగినది . భగవాన్ తమ అవతారమును చాలించినారు* . ఆ జ్యోతి విషయము మరునాడు వార్తాపత్రికలలో వచ్చినది . ఆ జ్యోతి ఉత్తర దిక్కుగా పయనిస్తున్న ఒక నక్షత్రాన్ని గతరాత్రి 8 గంటల 47 ని || ములకు అనేక ప్రాంతాలలో జనులు దర్శించారని చివరకు ఆ జ్యోతి అరుణాచలం పర్వతాగ్రము చేరినదని ప్రచురించారు . రమణాశ్రమములోని భక్తులందరు ఎంతో రోదిచారు . ఇక భగవాన్ లేరని అనుకున్నారు భగవాన్ భౌతికకాయాన్ని వారు ఎల్లప్పుడు కూర్చునే హాలులో కూర్చుండబెట్టి దర్శనార్ధమునకై ఉంచారు . మర్నాడు ఉదయం భగవాన్ దేహానికి అభిషేకము చేసి మాతృ భూతేశ్వరాలయానికి ఉత్తరాన ఒక గుంటను త్రవ్వి భగవాన్ శరీరాన్ని కూర్చుండబెట్టి కర్పూరముతో , సుగంధ ద్రవ్యములతో నింపి సమాధి చేశారు . *భగవాన్ 1-9-1896 నుండి 14-4-1950 వరకు అరుణాచలంలోనే ఉన్నారు . భగవాన్ ఎక్కడికి పోలేదు . వారు సర్వాంతర్యామి* . భగవాన్ సజీవముగా ఉన్నప్పుడే భగవాన్ శ్రీరమణమహర్షుల నల్లరాతి విగ్రహాన్ని కూర్చున్ని వున్నట్లుగా ఉన్న ఆ విగ్రహాన్ని తయారుచేసి భగవాను చూపినారు . అది ఆశ్రమములో భక్తులు చూడవచ్చు . వారిని నమ్ముకున్న వారికి ఇప్పటికి కూడా ఏ లోటూ లేదు . ఆ శక్తి ఎక్కడికి పోలేదు . ఇప్పటికి కూడా ఎంతో మంది భక్తులు తిరువణామలైకి వెళ్ళి రమణాశ్రమంలో వారి సమాధిని దర్శించి ఎనలేని అనుభూతులను పొందుచున్నారు . భగవాన్ సమాధిపై కూడా లింగాన్ని స్థాపించినారు . ఇప్పటికీ కూడా యధావిధముగా భగవాన్ ఉన్న ప్పుడు ఏ విధముగా కార్యక్రమములు జరుగుతున్నవో ఇప్పుడు కూడా అవి జరుగుతూనే ఉన్నవి . నేటికి ప్రతిరోజు తెల్లవారు ఝామునే భగవాన్ సమాధిపై స్థాపించిన లింగానికి మరియు మాతృ భూతేశ్వర లింగానికి పూజలు , వేద పఠనములు , నైవేద్యములు , అన్నదానములు , పారాయణములు జరుగుతూనే ఉన్నవి . భగవానుని పరిపూర్ణముగా నమ్ముకున్న భక్తులకు భగవాన్ వారితో మాట్లాడుతూనేయున్నారు . వారి ఆశీస్సులు వారిని నమ్ముకున్న భక్తులకు ఇస్తూనే ఉన్నారు . సముద్రము కంటెను లోతైన స్వామి మహిమలను వారి జ్ఞానమును చెప్పటానికి లేదా రాయటానికి అంతటి సముద్రములో ఒక నీటి బొట్టు మాత్రమైన నేను ( రచయిత ) వారిని గురించి రాయటమంటే అది నేను అనే ఈ శరీరము లేదా వేరు గల జడమైన దేహము లోనున్న సత్యమైన నేను ద్వారా వ్రాసినదే . అది కూడా ఆశీస్సుల వల్ల పైకి కన్పించే నేను కాదని తెలుసుకొనుట వలన ఒక నీటి బొట్టునైన నేను అంతటి సముద్రమంత , ఆకాశమంత , అనంతమైన కొలువలేని జ్ఞానిని గూర్చి సేకరించి వ్రాయటం ఊహించలేనిది . అది కేవలం ఆ అరుణాచలం దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసి భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వామి వారి గురించి ఎన్నో పుస్తకాలు చదివి ఆ భగవానను శరణు వేడిన పిదప వారి ఆశీస్సులుచే కొన్ని విషయాలు మాత్రమే చెప్పబడినది . ఆ అనంతుని గురించి నా బోటి వాడు ఎంత చెప్పగలడు ! ఈ చెప్పిన వాటిల్లో కూడా తప్పు ఒప్పులున్న మన్నించమని భగవాన్ ని వేడుతూ ఈ రచనలో నా ప్రమేయము ఏమీ లేకుండా భగవాన్ చెప్పినదే వారు నా నోటినుండి పలికించినదే తప్ప సొంతము జ్ఞానము ఏమీ లేదని గ్రహించవలసినది . ఈ నా శరణాగతి మరింత బలమై ఏ మాత్రం అహంకారంకాని మెప్పులకు పొంగిపోవుటకాని తప్పులకు కృంగిపోవుటకాని రాకూడదని భగవాన్ ని శరణువేడుతూ భగవాన్ నీవే మాకు శరణాగతి .
 అరుణాచల శివ 
కోటంరాజు శ్రీనివాసరావు 
1-9-129 / 16 / 1 / B / 3 , 
రాంనగర్ , హైద్రాబాద్ , 
 సెల్ : 9346823570 9848438884
ద్వారా రాసినది రమణ సమూహం లో చేర దలచినవారు ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9490860693 నేటితో నిత్య పారాయణ పూర్తి అయినది

No comments:

Post a Comment