Thursday, January 26, 2023

*దేని కోసం ఇదంతా!* ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం.

 *దేని కోసం ఇదంతా!* ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం.
                           
అడవికి రాజైన సింహం దగ్గర ఒక ఉడుత సేవకుడిలా ఉండేది. ఏ పని చెప్పినా చిటికలో  చేసేసి రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. ఉడుత పనికి మెచ్చుకుని, సింహం ఒక మంచి బహుమానం ఇస్తానని ప్రకటించింది. "ఏమిటా బహుమానం. మహారాజా?" అని ఆత్రుతగా అడిగింది ఉడుత. "నువ్వు పదవీ విరమణ చేసే సమయానికి నీకు ఓ బండెడు బాదం గింజలు ఇప్పిస్తాను. అదే బహుమానం" అంది సింహం.

బహుమానం తెలుసుకుని ఉడుత మహా సంబరపడిపోయింది. అందరూ ఆహారం కోసం కష్ట పడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చుని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది. తనంత అదృష్టం ఇంకెవరికి రాదని, మిగతా ఉడుతలు జీవితాంతం కష్టపడినా అన్ని బాదం పప్పులు కూడబెట్ట లేవని అది చాలా సంతోషించింది. రోజూ తనకు పట్టిన అదృష్టాన్నే తలచుకుంటూ కాలం గడిపేది. అలా అలా కాలం గడిచి, ఉడుత ముసలిది అయింది. ఇక పదవీ విరమణ చేసే సమయం వచ్చింది.

పదవీ విరమణ చేసే రోజున సింహం తనమాట ప్రకారం ఒక బండెడు బాదం గింజలను ఉడుతకు ఇచ్చింది. ఆనందంగా బండి నిండా ఆహారాన్ని పెట్టుకుని ఇంటికెళ్ళిన ఉడతకు మిగతా ఉడుతలన్నీ స్వాగతం పలికాయి.

స్నానపాదులన్నీ పూర్తి చేసి, ఇక బాదం పప్పులు తిందాం అనే సమయానికి తనకు ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయన్న విషయం గుర్తుకొచ్చింది. బాదం గింజలపై ఎంతో కాలంగా ఆశ పెంచుకున్న అవి ఇప్పుడు నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధ పడింది..

బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

*ఏందుకు ఇలా జరుగుతున్నది అనేందుకు బహుచక్కని ఉదాహరణ చెపుతాను వినండి*
ఒక అడవిలో ఒక కుందేలు, ఒక సారి కొబ్బరి కాయల  చెట్టు కింద నిద్ర పోతూన్నప్పుడు చెట్టుపైనుండి ఒక టెంకాయ తెగి ’దబ్బు’మని క్రింద పడింది. 

కుందేలు ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూడగా ఏమీ కనబడలేదు. "ఏమీటో లే’ అని అట్లాగే మళ్లీ పడుకున్నది.

 కొంచెం సేపు అయ్యిందో లేదో మళ్లీ ’దబ్బు’ మని శబ్దం వచ్చింది. 

కుందేలు కళ్లు తెరిచి చుట్టూ వెతికింది. 

పైన ఆకాశం నీలంగా కనబడుతున్నది. ’అమ్మో ఆకాశం విరిగి మీద పడుతున్నది’ అనుకున్నది కుందేలు. 

మరుక్షణంలో అది పరుగుతీయటం మొదలు పెట్టింది.

అంతలో దానికి ఓ జింక ఎదురయ్యింది. ’ఆగాగు! ఎందుకు పరుగెత్తుతున్నావు, కుందేలూ’ అని అడిగింది అది.

 అయ్యో, ఆకాశం విరిగిపడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అని ఉరుకెత్తింది కుందేలు. జింక దాని వెనకనే పరుగు పెట్టింది. 

అలా పరిగెడుతున్న కుందేలు, జింకలకు పులి ఎదురైంది. 

పులి అడిగింది ’జింకా, కుందేలూ ఎందుకు పరుగెడుతున్నారు?’ అని. ’అయ్యో, ఆకాశం విరిగిమీద పడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అన్నై జింకా, కుందేలూ. పులి కూడా వాటితో పాటు కలిసి పరిగెత్తటం మొదలు పెట్టింది.

అంతలో వాటికి ఓ ఏనుగు ఎదురయ్యింది. "ఏమర్రా, ఆగండి ఆగండి. ఎందుకు పరుగెత్తుతున్నారు?’ అంటే అవి ’ఆకాశం విరిగిపడుతోంది నువ్వూ పరుగెత్తు పరుగెత్తు త్వరగా’ అని అవన్నీ ఉరుకెత్తాయి అటూ ఇటూ చూడకుండా. ఇక ఏనుగుకూ వాటి వెనక పరుగెత్తక తప్పలేదు.

ఇలా ఇవన్నీ పరుగెత్తుతుంటే వాటికి ఓ సింహం ఎదురైంది.వాటిని ’ఎందుకు పరుగెత్తుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది. ఏనుగు చెప్పింది రొప్పుతూ- ’ఆకాశం విరిగిపడుతున్నది. అందుకే పరుగెత్తుతున్నాం’ అని. కానీ సింహానికి ఇది విచిత్రంగా తోచింది. ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని అది ఏనుగును అడిగింది. ’నేను చూడలేదు. నాకు పులి చెప్పింది’ అని అంది ఏనుగు.

’ఏం పులీ, ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూశావా?’ అని సింహం పులిని నిలబెట్టి అడిగింది. ’లేదు, నాకు జింక చెప్పింది’ అన్నది పులి......
అప్పుడు సింహం జింకను నిలదీసింది: ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని. ’లేదు, నాకు కుందేలు చెప్పింది’ అంది జింక. ’సరే’ అని సింహం కుందేలును అడిగింది. ’నేను కొబ్బరి కాయల చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమని శబ్దం వినిపించింది. ఆకాశం విరిగిపడింది’ అంది కుందేలు.

 ’ఆ టెంకాయ చెట్టు కిందకు వెళ్లి చూద్దాం అంది సింహం. అన్నీ కలిసి టెంకాయ చెట్టుకిందికి వెళ్లి చూశాయి. అక్కడ నేలమీద ఒక పెద్ద టెంకాయ కనిపించింది. అంతలో దబ్బుమని మళ్ళీ ఒక టెంకాయ పడింది. వెంటనే కుందేలు ’అదిగో, ఆకాశం విరిగిపడుతోంది, పరుగెత్తండి!’ అంది. సింహం అప్పుడు వెళ్ళి క్రిందపడిన టెంకాయను చూపిస్తూ ’ఇదేనా, నీ ఆకాశపు ముక్క?’ అని అడిగింది. కుందేలుకు సంగతి అర్థమై సిగ్గుపడింది. మిగిలిన జంతువులన్నీ నవ్వాయి.

గమనించారా బ్రమ తో కూడిన భయం జంతువులను ఎలా పరిగులు పెట్టించినదో అదే విధంగా సంపద లేకపోతే బ్రతకలేం అనే భయం తో మనం కూడా జంతువుల వలె పరుగు మొదలుపెట్టాం.

ఆ పరిగెడుతున్న కుందేలు 
మన పూర్వీకులు, ఆ జింక మన తల్లిదండ్రులు, ఇంకా ఆ
ఏనుగు మన గురువులు, మరి ఆ పులి మన సహోదరులు, చివరి గా అందరిని నిలువరిస్తూన్న  
ఆ సింహం మనమే.

పూర్వం వస్తుమార్పిడి పద్దతి ఉండేది అది కొంచెం కష్టతరం కావడంతో, వస్తూ మారకం కొరకు డబ్బులు సృష్టించడం జరిగింది.
 
దీన్ని సృష్టించిన తరువాత వ్యవహారాలు సులభతరం అయ్యాయి. దీనితో డబ్బు ఎవరు ఎక్కువగా దాచుకుంటే వారిని ధనవంతుడు అని పిలవడం మొదలు పెట్టారు. ఇక దీనితో డబ్బు అనే జబ్బు బాగా ముదిరిపోయింది, ఇప్పటివరకు దీనికి మందు లేదు. అందరిని తన వశం చేసుకుంది.

దీని మాయలో పడి తన మన అనే తారతమ్యం లేకుండా అందరినీ మోసం చేస్తూ చివరకు మనం మోసపోతున్నాం. యవ్వనంలో కష్టపడి సంపాదించుకుంటే వృద్ధాప్యంలో హాయిగా తిని ఉండొచ్చు అనుకుంటున్నాం. దీనితో దైవ నామ స్మరణ కూడా మరచి, తీరికగా 
వృద్ధాప్యంలో చేసుకోవచ్చు అనుకుంటున్నాం. అది సాధ్యం కాదు అనడానికి  ఉడుత బహుమతి  గా పొందిన 
బండేడు బాదం గింజలు మంచి ఉదాహరణ. 
శరీరం సహకారించని స్థితిలో స్థితప్రజ్ఞ కొరకు ప్రకులాడటం చూసువారికి నవ్వులాటగా ఉంటుంది.  ముక్తి కోసం కాక భుక్తి కోసం బ్రతుకు సాగిస్తున్నాం. ఇంకా ఈ కర్మ నుండి మనలని ఆ దేవదేవుడే రక్షించాలి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment