మానవ జన్మ
మానవ జన్మ విశిష్టత, దాని ప్రాముఖ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎందుకంటే ఒక మనిషి పుట్టుక ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడికి వెళుతుంది, ఏమి చేస్తుంది, ఏ విధంగా ఉంటుంది , చివరికి ఏమి అవుతుంది అనేది ఎవ్వరికీ అంతు పట్టని విషయాలు. అప్పుడే పుట్టిన పసి బిడ్డను చూస్తే అనిపిస్తుంది తన పిడికిలి బిగించి ఏదో సాధించాలని ఈ లోకంలో కి వచ్చింది అని, అంటే ఈ భూమిపై జన్మ తీసుకొనే ప్రతి జీవి ఏదో కార్యార్థమై ఇక్కడికి వచ్చినట్టు వస్తారు, వారి ఉనికిని సృష్టించుకొంటారు, వారి పని పూర్తి కాగానే ఎవరికి చెప్పకుండా తన వెంట ఏదీ తీసుకుపోలేదు అన్నట్టు రిక్త హస్తాలతో వెళ్లి పోతారు. ఏ జీవి అయినా తన వెంట తీసుకుని వచ్చేది తన కర్మ ఫలం మాత్రమే. అది మంచి అయినా, చెడు అయినా ఎవరిది వారు అనుభవించ వలసినదే. ప్రతి జీవి తన జీవితానికి ఒక సార్థకతను పొందగలగాలి అంటే నిరంతర సాధన ద్వారా , సద్గురువులు చూపిన మార్గం లో నడిచి సంపాదించుకోవాలి...
*దీపం జ్యోతి పరబ్రహ్మ*
దీపం అంటే ఏమిటి ? అందరికీ తెలుసు దీపం అంటే
చీకటిని దూరం చేసి వెలుగును పంచుతుంది అని. దీపంను పరబ్రహ్మ గా భావించి, సర్వపాపాలు పోగొడుతుంది అని ,దాని వలన సర్వ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని భగవంతుడిని ప్రార్థన చేసి వెలిగిస్తారు.ఒక ప్రమిదలో వత్తిని వేసి, నేతిని పోసి వెలిగించిన దీపం తన చుట్టూ ఉండే చీకటిని పోగొడుతుంది,
"దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం " అంటారు పెద్దలు . గోరంత దీపం కొండంత వెలుగు , నిజానికి బయటి ప్రపంచం లోని చీకటిని దూరం చేయటానికే కాదు , ప్రతి మనిషి తన లో దాగి ఉన్న అరిషడ్వర్గాలు అనబడే చెడు లక్షణాలను దూరం చేయటానికి కూడా అంతరంగం లో దీపం వెలిగించుకావాలి. ప్రతి మనిషి తన మనసును ప్రమిదగా చేసి, జ్ఞానం అనే నేతిని వేసి , ధ్యాన సాధనతో దానిని వెలిగిస్తే ఆత్మ దర్శనం దొరుకుతుంది. ఆ వెలుగులో నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. దీపం అన్నది ఆడంబరాల కోసం కాదు అంతఃకరణ శుద్ధి కోసం వెలిగించాలి. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్రా ప్రసరింప జేసే పరమాత్మ స్వరూపమే దీపం.....
నిన్ను అర్ధం చేసుకొనేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నీ అంతరాత్మ తప్ప.🪷
No comments:
Post a Comment