Sunday, October 29, 2023

సమస్యల తోరణం

 🪔🪔అంతర్యామి 🪔🪔

#సమస్యల తోరణం#

🍁సృష్టిలోని జీవుల్లో సమస్యలతో సతమతమయ్యేది మానవుడు మాత్రమేననిపిస్తుంది. సమస్యల తోరణం కనపడని ఇల్లు అరుదుగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల దాకా ఎన్నో. మనిషిని వేదనకు గురిచేస్తాయి. కరవుకాటకాలు, తుపాను బీభత్సాల వంటి ప్రకృతి సృష్టించే సమస్యల వల్ల ఒక ప్రాంతమో, ఒక నగరమో ప్రభావితమవుతాయి. వేల ఎకరాల్లో పంట -నష్టమై ఆహార కొరత ఏర్పడుతుంది. వేలమంది నిరాశ్రయులై జీవనోపాధిని కోల్పోతారు. ప్రకృతి విపత్తులను నిరోధించడం మానవులకు సాధ్యం కాదు. ప్రకృతి శాంతించాక ఒకరికొకరు సహాయపడుతూ జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే చర్యలు చేపట్టాల్సిందే.

🍁చాలా సమస్యలు మనిషి స్వయంకృతాపరాదాలు. కొందరు తమకుతామే సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా ఇతరులను ఆ వలయంలోకి లాగుతారు. మాటల మంటలు రేపి మనశ్శాంతిని దూరం చేస్తారు. ఆలుమగల మధ్య ఆలకలు సర్వసామాన్యం. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు. సంయమనం పాటించినప్పుడు సమస్యలు సమసిపోతాయి. 
కుటుంబ సభ్యుల మధ్య రగిలి కలతలు ప్రేమానుబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి.

🍁మానవ స్వభావం విచిత్రంగా ఉంటుంది. ఇతరులతో
పోల్చుకుంటూ అసూయతో మనిషి కుంగిపోతాడు. 
🍁దురాశతో లోభిగా మారి వ్యధ చెందుతాడు. 
🍁అహంకారంతో ఆత్మీయులతో విరోధం పెంచుకుని చివరి దశలో ఒంటరివాడై విలపిస్తాడు. 
🍁అసత్యాలతో విజయం సాధిద్దామనుకుని భంగపడతాడు. 
🍁సంతోషమే సగం బలమని గ్రహించలేక అపార్థాలతో సమస్యలు సృష్టించుకుంటాడు. 
🍁సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ కష్టాలు. కొనితెచ్చుకుని తన గొయ్యి తానే తవ్వుకుంటాడు.

🍁 పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడేందుకు, సత్యవ్రతాన్ని ఆచరించేందుకు సమస్యల వలయంలో చిక్కుకున్న ధర్మాత్ములు భగవంతుడి కృపతో కష్టాల కడలిని దాటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నేటికాలంలో అందుకు భిన్నంగా అధర్మవర్తనులైనవారు సమస్యల వలయంలో చిక్కుకుని కాలగర్భంలో కలిసిపోతున్నారు.

🍁అనేక సమస్యలకు మూలం అంతులేని కోరికలు.
🍁 మనసు కోరికలకు నిలయం, 'ధర్మమార్గం నుంచి తప్పిన మనసుకన్నా శత్రువులుండరు. 
🍁మనసును వశం చేసుకున్న వారే విజ్ఞులు. 
🍁చిత్తానికి చిత్తం 'చిత్తం అంటూ దాస్యం చేయకూడదు.
🍁 మనసుకు ప్రియమైన మాటలు కాకుండా హితమైన మాటలు 'వినాలి' అని భాగవతం ఉద్బోధిస్తోంది. 

🍁జీవుల 'సమస్త విపత్తులు 'కృష్ణ' అనే కంటక వృక్షం నుంచి బయలుచేరుతున్నాయి. దేహమనే చెట్టుపై హృదయమనే గూటిలో జీవుడనే పక్షి ప్రవేశించి కిలకిలారావాలు చేస్తూ ప్రశాంతంగా ఉంటుంది. 
తృష్టున అనే వల కింద ఇంద్రియ విషయాలనే ధాన్యపు గింజలు జల్లి మాయ అనే వేటగాడు చాటుగా చూస్తాడు. ఈ జీవుడు అమాయకంగా ఆ వలపై వాలుతున్నాడు. మాయ అనే వేటగాడు మెడవంచి ఆ జీవుల్లో అనేకమందిని దుఃఖపరంపరలనే బుట్టలో కుకీ ఉంచుతున్నాడని యోగవాసిష్టం చెబుతోంది.

🍁 నిత్యం ఆమాయాద్వేషాలు, పగ, ప్రతీకారాలతో రగిలే మానవులకు చివరకు దుఃఖమే మిగులుతుంది. ఎల్లప్పుడూ తీయగా మాట్లాడేవారు, ఇతరుల సంపదను చూసి ఈర్ష్యపడనివారు, క్రోధాన్ని నిగ్రహించుకోగల శక్తి కలవారు, ప్రాణులందరికీ అధీశ్వరుడైన నారాయణుడిని శరణువేడిన సత్పురుషులు దుఃఖాల నుంచి విముక్తులు కాగలరని భారతం ఉద్బోధిస్తోంది. 
🍁మాట తీరును సంస్కరించుకుని ఓర్పు, సహనం అలవరచుకున్న దృఢచిత్తులకు సమస్యల చింత ఉండదు. 
🍁ఆధ్యాత్మిక చింతన సానుకూల ఆలోచనలకు ప్రేరణనిస్తుంది.. 
🍁అనుకూల ఆలోచనలతో నిండిన మనసులో వేదనకు తావుండదు.🙏


No comments:

Post a Comment