Sunday, November 12, 2023

జ్ఞానయోగం🌸 *ఇంద్రియాలు*

 🌸అమృతం గమయ - జ్ఞానయోగం🌸

 *ఇంద్రియాలు*

ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ।।

భగవద్గీత 3వ అధ్యాయం - 40వ శ్లోకం.

ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - ఇవి కోరికల మూల స్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది, వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది.

ఎందరెందరో మహా చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. సుదీర్ఘకాలం పాలన చేశారు. ఎన్నెన్నో విజయాలు సాధించారు. ఎన్నో సుఖాలు అనుభవించారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు. కానీ ఏ ఒక్క మహారాజు కూడా ‘కావాలనుకున్నదాన్ని అంతా పొందాను, మొత్తంగా అనుభవించాను’ అనే తృప్తితో గతించలేదు.
 
పలువిధాలైన దివ్యాస్త్రాలను దేవతలనుండి పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు చెబుతున్నాయి. వీళ్ళెంతటి గొప్పవారైనా బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతశ్శత్రువులను గెలవలేకపోయారు. కాగా ఈ మహావీరులెవ్వరూ మానసిక ఉన్నతికోసం దైవశక్తులను కోరలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి కనిపించదు. దివ్యాస్త్రాలు సైతం నిష్ఫలమైన సందర్భాలున్నాయి. గొప్పగొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది.

అర్జునుడు ఏ వరాల కోసమూ శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించలేదు. అందువల్లనే దివ్యజ్ఞానామృతాన్ని (భగవద్గీత) పొందగలిగాడు. కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుందే కానీ దైవబలం పెరగదని మనం గ్రహించాలి.

ఆనందాన్నీ, శాంతినీ, సంతృప్తినీ దేనివలన పొందగలమో తెలియక మనిషి ఇంద్రియాల చేతిలో  పలుమార్లు మోసపోతున్నాడు. వేటగాడు జింకను వేటాడినట్లే, వాంఛలు మనిషిని వేటాడుతున్నాయి. కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడకపోతే చేసిన, చేస్తున్న పుణ్యకార్యాలన్నీ “బూడిదలో పోసిన పన్నీరు వలె" వృథాయే కదా!
 
”విషయవాంఛలు” అనబడే శత్రుసేన ఈ శరీరాన్ని ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారం వాటికి సేనాపతి. ఇంద్రియాలు వాటి పతాకం. దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి. బుద్ధి అనే మంత్రిని చీకటి గదిలో బంధించాయి. మనసు అనే రాజును బానిసను చేశాయి.

ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు కాని, కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే ఇది సాధ్యమవుతుంది.

ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు విజ్ఞులు. అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల రహస్యం తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలం. ఇంద్రియాలు మనసునెలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి. చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు - వాటి వెనకాలే ఉన్న రక్తమాంసాల్ని కప్పి పుచ్చుతాయి. సుగంధాలను అందించే నాసిక - ఈ దుర్గంధ భరితమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే స్ఫురణను మరపిస్తుంది. రుచులను మనసుకు అలవరచే నాలుక - వాటి చాటున దాగి ఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక శ్రవణేంద్రియమైతే (చెవులు) మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.

మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం - ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలుంటాయి. సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్‌ సాంగత్యం- ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గాన్నవి చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి.

ఇంద్రియాలకు మనసును దూరంపెట్టి బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి (మనసు)కి, బృహస్పతి అనే బుద్ధి సద్గురువు హితబోధ చేస్తే “ఆనందమూ, శాంతీ, సంతృప్తీ ఎక్కడ లభిస్తాయో” మనిషి గ్రహించగలగడం అసాధ్యం కానేకాదు.

శుభం

No comments:

Post a Comment