Friday, April 12, 2024

ఇంటింటా భారతం!

 *"ఇంటింటా భారతం!”*
                 
*వృద్ధాప్యంలో  ఎక్కువగా బాధ పెట్టేది  కుటుంబంలో తన వారి, సూటి పోటి మాటలు.*

 *శరీర పటుత్వం  లేదు కనుక , పరాధీనత వలన ఎదురించి ఏమీ అనలేరు, సహించుతూ ఉండలేరు.*

*బాధతో కుములుతూ, ఎవరికీ చెప్పలేక అనుభవించ లేక, మలిదశ లో ఉండాల్సిన శాంతి, తృప్తి ఆనందాన్ని కోల్పోతూ, నిరాశ నిస్పృహలతో  బ్రతుకు ఈడుస్తూ ఉంటారు.*

*మహాభారతంలో భీష్ముని పట్ల  జరిగిన అన్యాయం అదే !*

*అతని మాట వినరు. సలహా అడగరు!  మహా పరాక్రమశాలి! పెద్దవాడు, విజ్ఞుడు  ధర్మం తెలిసినవాడు అన్న గౌరవం ఇవ్వరు ఆ దుర్యోధనుడు.* 

*గ్రుడ్డి రాజు…!*

*పాపం అధర్మం అని తెలిసి కూడా వారికి  దూరం ఉండలేడు, కూడదు అని చెప్పలేడు, చెప్పినా ఆ మూర్ఖులు దుర్మార్గులు వినరు  కదా !*

 *వినాశ కాలే విపరీత బుద్ధిః!

 *ఈ రోజుల్లో పెద్దవారు పడే ఇబ్బంది, ఆనాడు  భీష్మాచార్యుడు కూడా  నరక యాతన పడుతూ మనో వేదన అనుభవించాడు.*

*కుఱు సింహాసనం రక్షిస్తూ ఉంటానన్న ఒకే ఒక మాట కోసం తీరని ఘోర అవమానాలను భరించాడు ఆయన పాపం.*

*కళ్ళ ముందు ద్రౌపది కాంత కు జరిగిన పరాభవాన్ని  చూస్తూ కళ్ళ నీరు పెట్టాడే కానీ, అదేమిటని నిలదీయలేని  నిస్సహాయ దుస్తితిలో పడిపోయాడు. యుద్ధరంగంలో కూడా దుర్యోధనుడు ఆయనను గద్దించి, అవహేళన చేస్తూ ఉన్నా, నోరు మెదపలేని నిస్సహాయ స్థితి పగవాడికి కూడా రావద్దు.*

*’పదిరోజుల యుద్ధంలో పాండవులలో ఒక్కడిని కూడా చంపలేక పోయావు! ఎందుకు నీ పరాక్రమం? చిల్లర సైన్యాన్ని మేము చంప లేమా? నీకు పాండవులపై అంతగా ప్రేమ ఉంటే వెళ్లి వారితో చేరు! ఈ నాటకం ఎందుకు? తప్పుకో ప్రక్కకు, మా కర్ణుడు చూసు కుంటాడు వారి సంగతి!’ అంటూ ఎద్దేవా చేశాడు దుర్యోధనుడు.*

*ఎంత బాధ పడ్డాడో కుఱు పితామహుడు.*

*”ధర్మరాజా ఇక నేను జీవించి లాభం లేదు, నాయనా!  దయ ఉంచి ఆ శిఖండిని అడ్డం పెట్టుకొని నన్ను పడగొట్ట మని మీ తమ్ముడు అర్జునుడి తో చెప్పు!” అంటూ దీనంగా తన చావుకోసం  తానే దారి చెప్పుకోవాల్సి వచ్చింది.*

*భీష్ముడి మరణం కోసంఇదొక కారణం అయితే, మరి కొన్ని కూడా చెప్పుకోవచ్చు.*
 
*అష్ట వసువులలో ఒకడు భీష్ముడు!శాపవశాత్తూ మానవ శరీరం ధరించాల్సి వచ్చింది భీష్ముడు.*

*ఏడుగురు వసువులు దిగి వచ్చి  భీష్మునితో… .”నీవు వచ్చిన పని పూర్తి అయింది, శాప విముక్తి సమయం వచ్చింది ,ఇక జీవితం చాలించు _!”అంటూ కోరారు.*

*అతడికి తండ్రి  చేత ఇవ్వబడిన ‘స్వచ్ఛంద మరణం’ అనే వరం అతడి పాలిట శాపం అయ్యింది. ‘నీవుచావవు, పాండవులను చంపవు నీ ఆసరా చూసుకొని యుద్దం తలపెట్టాను, మోసం చేస్తున్నావు నన్ను!’ అన్న సూటిపోటి మాటలతో  విషాదం నెలకొంది ఆయనలో.*

*శిఖండి తనను హతమార్చడానికే జన్మించాడని అతనికి తెలుసు! చావును  ఆహ్వానించడం తప్ప అతడికి మరో దారి లేకుండ పోయింది!*

*శ్రీకృష్ణుడు వారి చెంత ఉండగా   పాండవులకు చావు లేదు అని తెలుసు. కానీ, దుర్యోధనుడు  వారిని చంపాలి  అని అడిగాడు.*
*అది తన చేతిలో లేదు _!*

*కారణాలు ఎన్ని ఉన్నా , కుఱు పితామహుడు అన్న గౌరవ మర్యాదలు కౌరవులు, దృతరాష్ట్రుడు ఇవ్వలేదు_!అంతటి మహానుభావుడు.* 

*ఎవరికి తాను కాపలాదారుగా ఉంటూ సంరక్షణ బాధ్యత వహించాలి అనుకొని శ్రమించాడో  వారంతా హతం కావడం,   చూస్తూ ఆయన  పడిన బాధను మనం  ఊహించలేము _!*
 
   *ఇలాంటి భారతం ఇప్పుడు ఇంటింటా వెలిసింది!*

*శక్తి ,ఆస్తి , ఉన్నంతవరకు ఇచ్చిన గౌరవం వృద్దులయ్యాక  ఇవ్వడం లేదు కదా _!*

*స్వార్థ ప్రయోజనాల కోసం, పెద్దవారి పట్ల  కనీస  ప్రేమానురాగాలు   మరచి నిర్లక్ష్యం చేస్తూ ఉండడం అపరాధం మాత్రమే కాదు, మహా పాపం కూడా ! పెద్దవారి సంరక్షణ చూడటం  వారి పిల్లల బాధ్యత, ధర్మం! అత్యావశ్యకం.*

 *మలి వయసులో, వారికి కూడా  గౌరవ మర్యాదలు  దక్కాలనుకుంటే విధిగా ఇపుడు తమ వృద్ధులైన  తల్లి తండ్రులను మనః పూర్వకంగా శ్రద్దా భక్తులతో  సేవించు కోవాలి _!*

 *మనిషి ప్రకృతిలో ఒక భాగం కదా_!కోపమైనా, ద్వేషమైనా, ప్రేమ, ఆదరణ లైనా ప్రకృతికి లేదా ఇతరులకు ఏది ఎంత గొప్పగా  ఇస్తుంటామో అదే తిరిగి మనం పొందుతూ ఉంటాం కదా _!*

🙏

No comments:

Post a Comment