Friday, August 23, 2024

 చలాచల బోధ:--
శరీరాన్ని ధరించి యున్న వానిని శరీరి అని అంటారు.దేహమును ధరించిన వానిని దేహి అని అంటారు.
శరీరం అంటే పైకి కనబడే రూపంతో, ఆకారంతో రంగుతో కూడిన అవయవాలే కాదు.అది మూడు శరీరాలు కలిసి ఉండి,సంఘాతంగా పని చేసేది.బయటకు కనబడేది స్థూల శరీరం.లోపల ఉండి, స్కాన్ చేస్తే కనబడేటటువంటి అవయవాలు కూడా స్థూల శరీరమే.అనగా రక్త మాంసాలు, నాడులు, గ్రంధులు, ఎముకలు, మూలిగ, క్రొవ్వు, చర్మము, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, లివర్, కిడ్నీలు మొదలగునవి కూడా కలిపి స్థూల శరీరం అనబడుతుంది.ఈ స్థూల శరీరాన్ని నఖ శిఖ పర్యంతము శరీర కణముల లోపల బయట వ్యాపించి ఉండేది మరియు ఇంద్రియ గోచరము కాక సూక్ష్మముగా ఉండేదానిని సూక్ష్మ శరీరం అని అంటారు.ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని ఉపకరణముగా చేసుకొని పని చేస్తూ ఉంటుంది.ఇందులో 19 తత్వాలు ఉంటాయి.అవి అంతఃకరణ చతుష్టయము,పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు వెరసి 19 తత్వాలు.ఇవి మనకు కనబడక పోయినా, అవి చేస్తున్న పనులను బట్టి వాటి ఉనికిని మనం గుర్తిస్తున్నాము.అందువలన వీటిని సూక్ష్మ శరీరం అని అనడం జరిగింది.'శరీరం'అని అంటున్నామంటే,ఈ సూక్ష్మ శరీరం కూడా నశించేదే అని అర్థం.స్థూల శరీరం చస్తూ,పుడుతూ ఉంటుంది.సూక్ష్మ శరీరం చొక్కా విప్పి మరొక చొక్కా ధరించినట్లు స్థూల శరీరాలను మార్చుకుంటూ ఉంటుంది.అనగా చావు పుట్టుకలు స్థూల శరీరానికే కాని.సూక్ష్మ శరీరానికి కాదు.స్థూల శరీరాన్ని విడిచి పెట్టగానే ఈ సూక్ష్మ శరీరం ప్రేతాత్మ అని అనబడుతుంది.అది దాని అధిష్ఠాన దేవతలు ఉండే పితృ లోకాలకు వెళ్ళి,యే
తన ప్రారబ్దం నిర్ణయం కాగానే తిరిగి మానవ లోకంలోకి దిగి వస్తుంది.తన ఋణానుబంధాన్ని బట్టి తల్లి గర్భంలో నిర్మాణము అవుతూ ఉన్న పిండలో ప్రవేశిస్తుంది.ఆ పిండమే స్థూల శరీరంగా వృద్ధి చెందుతుంది.అయితే ఈ సూక్ష్మ శరీరం ఒకానొక సాధకుడు ముక్తుడైనప్పుడు ఆతని విడిచిపెట్టి లేకుండా పోతుంది, అనగా నశిస్తుంది.అందుకే సూక్ష్మ శరీరం అని దానికి పేరు వచ్చింది.బైబిల్ లో 'ఒకే జన్మ ఒకే మరణం 'అని చెప్పేది సూక్ష్మ శరీరానికే కాని స్థూల శరీరానికి కాదు.

No comments:

Post a Comment