విష్ణుమూర్తి యొక్క అనేక అవతారాల పరిసమాప్తి చేయించడం కోసం రుద్రుడు ధరించే రూపాలు ఎన్నో. మత్స్య సంహార మూర్తి, కూర్మ సంహార మూర్తి, వరాహ సంహారమూర్తి వంటివాటి తరువాత వచ్ఛేది ఈ అవతారము.
శరభావతారం యొక్క వృత్తాంతం శివ మహాపురాణంలోని శతరుద్ర సంహితలో
వర్ణింపబడినది. ఈ వర్ణన అక్కడి నుండి ఉన్నదున్నట్టు గ్రహించబడింది. దీనిలో స్వంత కథనమేమి లేదని దయచేసి పాఠకులు గ్రహించాలి. కేవలం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడము మాత్రమే లక్ష్యము తప్ప వీరే ఏ ఉద్దేశ్యము లేదు. ఎవరికైనా ఖేదము కల్గితే క్షమించమని ముందే ప్రార్థిస్తున్నాను.
మనిషికాక మృగముకాక నృసింహ రూపంలో ఆవిర్భవించిన శ్రీమహావిష్ణువును గుర్తించలేక భయంతో కంపించిపోయాడు హిరణ్య కశిపుడు. ఆ నారసింహుడు హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టుకొని, తన వజ్రసమాన నఖాలతో అతని ఉదరాన్ని చీల్చేసాడు. దేవతలు పూలవాన కురిపించారు. దుందుభులు మ్రోగించారు. అప్సరలు ఆడారు. గంధర్వులు పాడారు. సిద్ధ చారణ మహర్షులు విష్ణు సంకీర్తనం చేశారు. బ్రహ్మ అమరేంద్రాదులు హరిని ఎంతగానో స్తుతించారు.
అలా దేవతలందరిచే స్తుతింపబడ్డాడే కాని ప్రసన్నుడు మాత్రం కాలేదు ఆ నృసింహుడు. హిరణ్యకశిపుని పేగులను మెడపై ధరించాడు. అతని రక్తాన్ని ఎర్ర చందనము ధరించినట్లు వంటికి పూసుకున్నాడు. అతని రక్తం ఓడుతున్న కళేబరాన్ని తనపై వేసుకొని దుర్జరగర్జనారవాలతో విశ్వాన్ని మింగేసేంత నోరు చేసుకొని లోకంపై పడ్డాడు. కొండలతో గుహలలో సంచరిస్తూ ఎదుటికి వఛ్చిన వాటిని నాశనం చేస్తూ ఉగ్రరూపంతో అదుపు తప్పి తిరగసాగాడు.
ఆ నరసింహుని గర్జనకి మేఘాలు చెదిరిపోయాయి, పక్షులు గుండెలాగి రాలి పోయాయి, నక్షత్రాలు వణికాయి. గ్రహాలు గతులు తప్పిపోనారంభించాయి. సముద్రాలు పొంగాయి. సూర్యుడు తేజోవిహీనుడైపోసాగాడు. సిద్ధ చారాణ యక్ష విద్యాధరులు ఒక్కో దిక్కుకు పరిగెత్తారు. కులగిరులు కంపించాయి. అతని పాదఘాతాలకు భూమి గడగడ లాడసాగింది. ఏ విపాతము లేకుండానే మహావృక్షాలు నేల పడిపోయాయి.. మహామునుల తపస్సులు అంతరాయ భరితాలయ్యాయి. యోగుల ధ్యానాలు నిలకడ మానేసాయి. ఋషులు హాహాకారాలు చేశారు. దేవతలు తల్లడిల్లిపోయారు. సప్తఋషులు శాంతి ప్రవచనాలు మొదలుబెట్టారు. అయినా నరసింహ స్వామిలో ఉగ్రత్వం చల్లారలేదు.
భగవంతుడు భక్తసులభుడని, భక్తులైన ప్రహ్లాద నారదాదు
లు, వైకుంఠంలో నిత్యసేవకులు, విష్ణు పార్శ్వాదులు, చివరకు లక్ష్మీదేవి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని తీవ్రత్వాన్ని నిలువరించలేకపోయా
రు. బ్రహ్మదేవుడంతటి వానికి ఎంచేయాలో పాలుపోలేదు. అందరు వెళ్లి శివున్ని వేడుకున్నారు. శివుడు అభయం ఇచ్చి వీరభద్రున్ని నరసింహ స్వామి వద్దకు
అతని నిలువరించడానికి పంపించాడు.
నరసింహుని వద్దకు వెళ్ళాడు వీరభద్రుడు. అతనితో మృదువుగా మాట్లాడాడు. ఉగ్రత్వాన్ని చల్లార్చుకొమ్మన్నాడు. వినలేదా నరసింహుడు. పైగా "నువ్వెవరు నాకు చెప్పడానికి. నేను తలచుకుంటే ఈ చరాచర జగత్తును నశింపజేస్తాన్నని " వాదించాడు. పైగా తానే పరబ్రహ్మ స్వరూపాన్నని, మృత్యుంజయుడనని డాంబికాలు పలికాడు.
"నువ్వెలా పరబ్రహ్మవవుతావు, పరబ్రహ్మము కేవలం శివుడే" అని సోదాహరణంగా, ప్రామాణ్యములతో తర్కించాడు వీ
రభద్రుడు. కానీ నరసింహుని ఉగ్రహంకారాలతో ఉన్న చెవికెక్కలేదు వీరభద్రుని ప్రవచనాలు. ఇక లాభంలేదనుకున్నాడు వీరభద్రుడు. తక్షణమే పరమేశ్వరుణ్ణి స్మరించి మహాద్భుతమైన రూపాన్ని ధరించాడు.
ఆ రూపంతో సర్వాకాశాన్ని కమ్మేసాడు వీరభద్రుడు. బంగారు వర్ణంతో వెలిగి పోతున్నాడు. సమస్తమైన తేజస్సులు ఆ రూపంలో లీనమైపోతున్నాయి. వేయి చేతులతో, జడధారియై, చంద్రరేఖాజూటుడై, సువిశాలమైన రెండు రెక్కలతో, పొడవైన ముక్కుతో, పెద్ద పెద్ద కోరలతో, వజ్రభాలైన గోళ్ళతో, నీలకంఠంతో, నాలుగు కాళ్లతో, మూడు కళ్ళతో, హుంకారాలు చేస్తూ విజృంభించాడు. అటువంటి శరభ రూపాన్ని కనబడగానే తన బల సామర్థ్యాలను కోల్పోయాడు నరసింహుడు. అతని శక్తులన్నీ లాగేసాడు. శరభవతారుడైన ఆ వీరభద్రుడు ఆ నరసింహుని చేతులు పట్టుకున్నాడు. రెక్కలతో అతని నాభిని, పాదాలను తాడిస్తూ, పుచ్ఛంతో అతనిని బంధించాడు.
నరసింహునిచే భీతావహులైన వారందరు ఆతని పరాక్రమానికి అబ్బురపడుతూ చేతులు జోడించి "అశ్శరభ శరభ .. అల్లల్ల వీరా!!" అంటూ పాడుతూ ఆడుతుంటే, వీరభద్రుడు నరసింహుని రొమ్ములో దెబ్బలు కొడుతూనే, గరుత్మంతుడు పాముని ఎత్తుకెళ్లినట్లు, తన్నుకొని ఎగిరిపోయాడు. కైలాసానికి చేరి అతని ముండాన్ని, తలని విడదీసాడు. శివునికి సమర్పించాడు. సూక్ష్మరూపం శివునిలో కలిసిపోయింది. విష్ణువుకి అవతార పరిసమాప్తి కలిగింది. స్థూలరూపంలోని శిరస్సును ముండమాలికలోని తరళ స్థానంలో అలంకరించుకున్నాడు శివుడు. చర్మాన్ని కట్టుకున్నాడు. వీరభద్రుని ఆశీర్వదించాడు శివుడు.వీరభద్రుని అవతారాన్ని ఉపసంహరింపజేసాడు. విష్ణ్వాది దేవతలు ఎంతో సంతసించారు. వీరభద్రుని కీర్తించారు.
దేవతలు అదుపుతప్పి వ్యవహరిస్తే వారిని నిగ్రహించే దైవము వీరభద్రుడు. వాయుపురాణములో హయగ్రీవావతారముచే తెలుపబడిన వీరభద్రుని అష్టోత్తర శతనామావళిలో 50వ నామము "ఓం మహాఘోరనృసింహజితే నమః".
ఇంతటి మహోత్కృష్టమైన నరసింహ స్వామి, మరియు వీరభద్రుల వృత్తాంతాన్ని తలచుకునేలా చేసిన, ప్రశ్న అడిగిన మహోదయునికి నమస్సుమాంజలి!!
No comments:
Post a Comment