Sunday, October 13, 2024

 *అహంకారం.....*

*మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది నీళ్లు ఇవ్వండి".. అని అడిగాడు. గుడిసె లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి  ‘మీరెవరు.. ఎక్కడ నుండి వస్తున్నారు..' అని అడిగింది.*

*కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి.. నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని సమాదానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి.. 'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’ అంది. కాళిదాసు కాసేపు ఆలోచించి" నాకు తెలియదు గొంతు ఎండి పోతుంది ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకున్నాడు. "ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు.. "అని మళ్ళీ అడిగింది ముసలావిడ.*

*ఈసారి ‘నేను బాటసారిని' అన్నాడు కాళిదాసు. అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిచింది ఆ ముసలావిడ. తెల్ల ముఖం పెట్టి మాతా.. "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడ్డాడు కాళీదాసు. వాళ్ళు 'సూర్యచంద్రులు’ అని తెలిపి.. "మరి మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను".. అంది ముసలావిడ. కాళిదాసు దీనంగా "నేను అతిథిని".. అని బదులిచ్చాడు.*

*"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే. ఒకటి ధనం, రెండోది యవ్వనం. అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు" అంది ముసలావిడ. కాళిదాసు "నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి".. అని వేడుకున్నాడు. "ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో శెలవివ్వ గలరా" అంటూ.. బిక్కమొహం వేసిన కాళీదాసుతో.. "ఒకటి భూమి, రెండోది వృక్షం" అని భోద పరచి.. "ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు..." అని మళ్ళీ అడిగింది ఆ ముసలావిడ.*

*ఓపిక నశించిన కాళిదాసు "నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి".. అని సాగిల పడ్డాడు. ఆ అవ్వ నవ్వుతూ.. "ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు వెనుక వుండి మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పేవాడు" అని అంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు.*

*ఆ అవ్వ సరస్వతీ దేవిగా సాక్షాత్కరించి ‘నాయనా.. విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు. కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీర్చింది.*

*మానవునికి విద్య, అధికారం, ధన బలము తో ఎప్పుడూ అహంకారం పెరగకుండా చూసుకోవాలి...*

    *🪷|| ఓం శ్రీ మాత్రే నమః ||🪷*
🙏🙏🙏 👣🙇‍♂️👣 🙏🙏🙏

No comments:

Post a Comment