Tuesday, January 21, 2025

 *🌹    కనువిప్పు కలిగించే ఒక చిట్టికథ    🌹*

              *విజయుడు అనే రాజు  "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు.*

               *అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా  "మీరేమంటారు మంత్రిగారూ?!" అని అడగడం మొదలుపెట్టాడు..*

                *మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు. ''ఎలాగైనా రాజు గారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే'' అనుకున్నాడు ఆయన.*

               *"మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ..! మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.*

                *దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ''ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను'' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు.* 

               *ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు ఆవుల్ని మేపుకుంటూ.*

             *"ముందు వీడిని ఓడిస్తాను... నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.*

               *"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-" అన్నాడు.*

            *పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు.*

             *"సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?" అడిగాడు విజయుడు.*

             *''గాలి''.... చెప్పాడు పశువుల కాపరి.*

             *అన్నింటికంటే ఉత్తమమైన జలం?*

                            *"గంగాజలం"* 

        *అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?*

          *" ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే"*

            *"భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.*

              *ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.*

             *"ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా.*

             *"తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ..." అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.*

              *"మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.*

              *"సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి..." చెప్పాడు పశువుల కాపరి.*

               *"అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.*

                *"ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే ''ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి'' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"*

            *విజయుడు నివ్వెరపోయాడు. "అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, ''అందరిలోకీ తెలివైనవాళ్ళు'' అంటూ అసలు ఎందుకుండాలి?"_ అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు.*

                *పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు!*

                *అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా " మంచి రాజు  అందరినీ ప్రోత్సహిస్తాడు"అని పేరు తెచ్చుకున్నాడు.*

*చదివి చదివి కొంత చదువంగ చదువంగ* 

 *చదువు చదివి యింక చదువు చదివి* 

 *చదువు మర్మములను చదువలేడయ్యెను* 

 *విశ్వదాభిరామ! వినురవేమ!* 

                *భావం:- ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!*

         *{మనమందరం.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు.. ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని మసలుకోవాలి.*

No comments:

Post a Comment