*****
*దాగని నేరం*
==========
(నేర పరిశోధన కథ)
రచన::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
ఉదయమే స్టేషన్ కి వచ్చిన ఎస్సై ప్రతాప్, కార్మిక నగర్ లో తులసి అనే పాతికేళ్ల స్త్రీ, కత్తిపోట్లతో హత్యకు గురయ్యిందన్న సమాచారం తెలియడంతో తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి బయలుదేరాడు.
తదుపరి జరగవలసిన ఏర్పాట్లు గురించి, అలాగే ఏదైనా ఆధారాలు సాక్ష్యాలు లభ్యమవుతాయేమో చూడమని సిబ్బందికి పురమాయించి, మృతదేహం వద్ద రోదిస్తున్న ఓ యాభై ఏళ్ళ పెద్దాయన వద్దకు వెళ్లి
"చూడయ్యా! బాధపడకు. అసలు ఈ హత్య ఎలా జరిగింది? మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఎస్సై.
"అయ్యా! సంవత్సరం క్రితం వీళ్ళ అమ్మ పోయినప్పటినుంచీ అన్నీ నేనే అయ్యి దీనిని పెంచానయ్యా! నాకు ఈ హత్య విషయం ఉదయమే తెలిసిందయ్యా! ఇక, అనుమానం అంటే... నాకైతే దీని బావగారు రంగారావు మీద, వీళ్లాయన నీలకంఠం మీద, అలాగే నా మేనల్లుడు శంకర్ మీద అనుమానం ఉందయ్యా" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు యాదగిరి అనే ఆ పెద్దాయన.
"బాధపడకు పెద్దాయనా! అసలు వాళ్లమీద నీకు అనుమానం ఎందుకు వచ్చింది?" అడిగాడు ఎస్సై ప్రతాప్.
"బాబూ! మొదట్లో, ఈ తులసిని మా మేనల్లుడు శంకర్ కి ఇద్దామని అనుకున్నా బాబూ! కానీ వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతాడని ఈ నీలకంఠంతో ఎనిమిది నెలల క్రితం ఘనంగా పెళ్లి జరిపించా. కానీ, ఈ మధ్యన తన బావ రంగారావు తనని అదో రకంగా చూస్తున్నాడని బాధపడేది బాబూ. అలాగే తరచూ వీళ్లింటికి వచ్చే మా మేనల్లుడు శంకర్ మీద వీళ్ళ ఆయనకు అనుమానం వస్తోంది అని కూడా చెప్పేది. నాకు తెలిసి ఈ ముగ్గురిలో ఒకరు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని నా అనుమానం బాబూ!" మృతదేహం మీద ఈగలు వాలకుండా విసురుతూ బిగ్గరగా రోదిస్తూ చెప్పాడు యాదగిరి.
సిబ్బందికి కొన్ని సూచనలు చేసి, అక్కడ నుంచి బయలుదేరాడు ఎస్సై.
***** ***** ***** *****
మర్నాడు ఉదయానికల్లా ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం రిపోర్టులు వచ్చాయి. అందులో విషయాలు చదివిన ఎస్సై ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.
సాయంత్రానికల్లా, పక్క ఊరిలో బంధువుల ఇంట్లో ఉన్న అన్నదమ్ములు రంగారావు, నీలకంఠంలను, అలాగే ఓ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్న శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వారిని విడివిడిగా వేరే గదులలో ఉంచి, విచారించడం మొదలెట్టాడు ఎస్సై ప్రతాప్.
***** ***** ***** *****
"రంగారావ్, మీ మరదలు తులసిని హత్య చేసింది నువ్వే అని నిరూపించే సాక్ష్యాలు మాకు దొరికేయ్. ఎందుకంటే ఈ మధ్యనే నీ భార్య మరణించింది. అందుకే నీ కన్ను తులసి మీద పడింది. ఆమె తిరస్కరించదన్న కసితో ఈ హత్య చేసావు. నేరం ఒప్పకుంటే మంచిది. లేకపోతే ఎలా ఒప్పించాలో మాకు తెలుసు" గదమాయించాడు ఎస్సై.
"సార్, నన్ను నమ్మండి. ఈ హత్యకు నాకూ ఏ సంబంధం లేదు. అయితే, శంకర్ తరచూ మా తమ్ముడు ఇంటికి రావడం విషయంలో మాత్రం నేను మా మరదలను మందలించిన మాట వాస్తవం. ఎందుకంటే ఊర్లో మా పరువు పోతోందని! అంతే తప్ప తమ్ముడి భార్యను చెరిచేటంత దుర్మార్గుడను కాను సార్. అంతేకాదు, నాకు ఈ మధ్యనే వేరే సంబంధం కూడా నిశ్చయమయ్యింది సార్. ఇంకో విషయం చెప్పాలి మీకు.........." అంటూ భోరుమని ఏడుస్తూ చెప్పాడు రంగారావు.
***** ***** ***** *****
"చూడు, నీలకంఠం! నీ భార్య తులసి ఆ శంకర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందనీ, ఆ గర్భం కూడా అతని ద్వారానే వచ్చింది అన్న అనుమానంతో ఆధారాలు దొరక్కుండా హత్య చేసి ఏమీ ఎరగనట్టు పారిపోయావు. మర్యాదగా నేరం ఒప్పకో!" సూటిగా నీలకంఠాన్ని అడిగాడు ఎస్సై.
"సార్! నిజంగా నా భార్యకి నేనంటే ప్రాణం. ఇక నేనూ, అన్నయ్య కలిసి మా బంధువుల ఇంట్లో ఓ వేడుక ఉందంటే ఆ రాత్రి ఆ ఊరు వెళ్లాము. ఇంకో విషయం.......... " అంటూ అన్ని విషయాలూ రోదిస్తూ చెప్పాడు నీలకంఠం.
***** ***** ***** *****
"శంకర్! తులసి నీకు కాకుండా పోయింది అన్న దుగ్ధతో, నాలుగు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా మానభంగం చేసి, ఆ నేరం బయటపడకుండా ఉండడానికి అమానుషంగా కత్తితో పొడిచి హత్య చేసావు. ఇప్పటికైనా నేరం ఒప్పుకో. శిక్ష తగ్గించే ఏర్పాటు చేస్తా" నచ్చచెప్పాడు ఎస్సై.
"సార్! మా యాదగిరి మావయ్య చెప్పాడని, మీరు నన్నెందుకు అనుమానిస్తున్నారో అర్ధం కావడం లేదు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెబుతా" అంటూ చెప్పడం మొదలెట్టాడు శంకర్.
ముగ్గురి వాదనలు విన్న ఎస్సై, అక్కడ ఉన్న పోలీసులతో నెమ్మదిగా ఏదో చెప్పి, "ఈ ముగ్గురినీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించండి" అంటూ ఏసీపీ ఆఫీసుకు బయలుదేరాడు.
***** ***** ***** *****
హత్య జరిగిన మూడవ రోజు. సాయంత్రం ఆరు గంటలు. సనత్ నగర్ పోలీసు స్టేషన్. పత్రికా విలేఖరుల సమావేశం. చెప్పడం మొదలెట్టాడు ఎస్సై ప్రతాప్.
"సరిగ్గా సంవత్సరం క్రితం, మన స్టేషన్ పరిధిలో నమోదైన యాదమ్మ అనే మహిళ మిస్సింగ్ కేసు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అది మిస్సింగ్ కేసు కాదు. ఆ రోజునే ఆమె హత్య చేయబడింది. ఆ హంతకుడే ఈ తులసిని కూడా హత్య చేసాడు. ఇంకో విషయం ఆ యాదమ్మ కూతురే ఈ తులసి. ఈ ఇద్దరినీ హత్య చేసిన నిందితుడ్ని మీ ముందు ప్రవేశ పెడుతున్నాం" అంటూ తన సిబ్బందికి సైగ చేసాడు.
వెంటనే, కస్టడీలో ఉన్న ఆ హంతకుడిని తీసుకుని వచ్చారు పోలీసులు.
"ఆ!!!యాదగిరా!! తులసి తండ్రి! ఇతను హంతకుడా?" ఆశ్చర్యపోయారు అందరూ.
"ఆశ్చర్యపోకండి. మీరనుకున్నట్టు తులసి ఇతని సొంత కూతురు కాదు. నాకు హత్యా స్థలంలో ఒక్క సారి కూడా 'ఈమె నా బిడ్డ' అని సంభోధించని అతని మాటల్లోనే కొంచెం అనుమానం వచ్చింది. అందుకే, ఆ కోణంలో మా పరిశోధన సాగించాం. యాదగిరి మొదటి భార్య పదేళ్ల క్రితమే మరణించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి బోరబండ కల్లు కాంపౌండ్ లో పరిచయం అయ్యింది ఈ యాదమ్మ. భర్తను కోల్పోయి కూతురు తులసితో ఉంటున్న యాదమ్మ ఆస్తి మీద పడింది ఇతని కన్ను. తరువాత నెమ్మదిగా ఆమె ఇంటికి తన మకాం మార్చాడు. మొదటి రోజునే అతని చూపు తులసి మీద పడింది. ఈ విషయం గ్రహించిన యాదమ్మ ఇతడిని నిలదీసింది. తర్వాత ఏం జరిగింది అనేది శంకర్ చెబుతాడు" అంటూ కూర్చున్నాడు ఎస్సై ప్రతాప్.
"కల్లు కాంపౌండ్ లో అతిగా మద్యం తాగిన యాదమ్మ, ఆ మత్తులో ఎక్కడికో వెళ్లి పోయిందని తెలిసిన ఆ రోజు రాత్రి, నాకు బోరబండ శ్మశానం ప్రాంతంలో తచ్చాడుతున్న మా మావయ్య యాదగిరి కనబడ్డాడు. మర్నాడు అదే విషయం అడగ్గా 'మద్యం మత్తులో దోవ తెలియలేదురా' అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు చూసాను, మా అమ్మ ఎంతో ప్రేమతో మా మావయ్యకు ఇచ్చిన బ్రాస్లెట్ ఆయన చేతికి లేదని. అది అడిగితే దానికి ఏదో పొంతనలేని సమాధానం ఇచ్చాడు. తర్వాత నేను ఆ సంగతులే మరచిపోయాను. కానీ, ఈ విషయాలు అన్నీ నిన్న ఎస్సై గారికి చెప్పాను. ఇక, చిన్నతనంలోనే తండ్రిని, ఆ తరువాత తల్లిని కోల్పోయిన తులసి మీద నాకు జాలి తప్ప వేరే అభిప్రాయం లేదు" చెప్పడం ముగించాడు శంకర్. వెంటనే ఎస్సై లేచి,
"శంకర్ ఇచ్చిన సమాచారంతో ఈ ఉదయం యాదగిరిని అదుపులోకి తీసుకొని, మా పద్ధతిలో విచారించి, అతడిని తీసుకుని ఆ స్మశానం ఉన్న ప్రాంతానికి వెళ్లాము. అతను చూపించిన ప్రాంతంలో తవ్వగా యాదమ్మ అస్థిపంజరం, ఆ పక్కనే ఇదిగో ఈ బ్రాస్లెట్ దొరికాయి" అంటూ దానిని చూపించి తిరిగి చెప్పడం మొదలెట్టాడు. "ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో, యాదగిరి తనే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతే కాదు యాదమ్మను ఎప్పుడూ భార్యగా చూడలేదని చెప్పాడు. ఇక తులసిని ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో అతని మాటల్లోనే వినండి " అంటూ బుర్ర వంచుకుని వింటున్న యాదగిరి వైపు చూస్తూ చెప్పాడు ఎస్సై ప్రతాప్.
"తులసికి పెళ్లి అయినా కానీ, నేను ఆమె మీద వ్యామోహం చంపుకోలేక పోయాను. నీలకంఠం ఊర్లో లేని సమయాల్లో ఇంటికి వెళ్లిన ప్రతీ సారీ, ఆమెను భయపెట్టి, నా కోరిక తీర్చక పోతే నీలకంఠాన్ని చంపుతానని బెదిరించి లొంగదీసుకునేవాడను. నీలకంఠం ఊర్లో లేడని తెలిసి మొన్న రాత్రి మద్యం సేవించి వెళ్లి, దౌర్జన్యంగా ఆమెను ఆక్రమించుకున్న నాతో, 'తను ఇప్పుడు మూడు నెలల గర్భవతిననీ నా వల్లనే ఈ గర్భం వచ్చిందనీ, ఎందుకంటే తన భర్త నీలకంఠం సంసార జీవితానికి పనికిరాని నపుంసకుడు అనీ, ఇంక తనని వదిలివేయమని' బతిమాలింది. తులసి బతికుంటే, నాకు ఎప్పటికైనా ప్రమాదమని ఆవేశంతో అక్కడే ఉన్న కత్తితో పొడిచి, నా మీదికి అనుమానం వచ్చే ఆధారాలు ఏమీ లేకుండా జాగ్రత్తపడి, ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేసాను" సిగ్గుతో తలవంచుకుని చెప్పాడు యాదగిరి.
"సార్! మీకు తులసి హత్య కేసులో యాదగిరి మీద అనుమానం ఎలా వచ్చింది" అడిగాడు ఓ విలేఖరి.
"పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తులసి గర్భిణీ అనీ, హత్యకు ముందు అత్యాచారం జరిగిందని ఉంది. ఆ అనుమానంతో నీలకంఠాన్ని, రంగారావుని, శంకర్ నీ అనుమానించి ఆసుపత్రికి పరీక్షల కోసం పంపించాను. రిపోర్టులో అత్యాచారంలో వారి పాత్ర లేదని తెలిసింది. అంతే కాదు హత్య జరిగిన రాత్రి అన్నదమ్ములిద్దరూ వేరే ఊర్లోనూ, అలాగే శంకర్ ఏదో చిన్న కేసులో విచారణ నిమిత్తం బేగంపేట స్టేషన్ లోనూ ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు లభించాయి. ఇక నా విచారణలో నీలకంఠం సంసార జీవితం పట్ల తన అశక్తతను, శంకర్ చెప్పిన కొన్ని విషయాలు విన్న మీదట యాదగిరి మీద నా అనుమానం బలపడింది. మిగతా విషయాలు మీకు తెలిసినవే" చెప్పాడు ఎస్సై ప్రతాప్.
"వావివరుసలు మరచి, మద్యం మత్తులో నా భార్యను, ఆమె తల్లిని చంపిన ఈ కామాంధుడుకి ఉరిశిక్ష పడేలా చేయండి ఎస్సై గారూ!" అంటూ బాధగా వేడుకున్నాడు నీలకంఠం.
"తప్పకుండా! ఇంకో విషయం, ఈ దుర్మార్గుడే కనుక ఆ రోజు ఆమెను హత్య చేయకుండా ఉండి ఉంటే, తన వలన మీ కుటుంబం పరువు పోకూడదని, అదే రోజు రాత్రి తాను ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుంది తులసి. అంతే కాదు, "నా భర్త మరియు బావగారూ చాలా మంచి వ్యక్తులు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నా మరణానికి కారణం ఎవరూ కాదు, కేవలం ఆరోగ్య సమస్యలే" అని ఆమె రాసుకున్న లెటర్ ఇదిగో, ఆ ఇంట్లో దొరికింది" అంటూ ఆ లెటర్ చూపించాడు ఎస్సై.
"సార్, తను చనిపోయి, తన తల్లి చావుకు కారణమైన వాడిని చట్టానికి అప్పగించి మరీ వెళ్లింది మా తులసి. ఒకవేళ తను ఆత్మహత్య చేసుకుని ఉంటే, వీడి దుష్టబుద్ది గురించి బయటి ప్రపంచానికి ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు" బాధగా చెప్పాడు నీలకంఠం, యాదగిరి వైపు అసహ్యంగా చూస్తూ.
***** **సమాప్తం** *****
(నేను రాసిన ఈ క్రైమ్ కథ సాక్షి ఆదివారం అనుబంధం "ఫన్ డే" లో ది.26.12.2021న ప్రచురితమైనది)
No comments:
Post a Comment