*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(18 వ భాగము)*
*వేదమూర్తులు తమ స్తుతులను కొనసాగించారు: “దేవా! నీవు సచ్చిదానంద విగ్రహుడవు. జీవులు నీ అంశలు కనుక నిన్ను గురించిన పూర్తి ఎరుకయే వారి సహజస్థితి అవుతుంది. ఈ భౌతికజగత్తులో అట్టి కృష్ణభక్తిభావనను పెంపొందించు కొనిన వ్యక్తి లౌకికజీవనరీతిలో ఏమాత్రము అభిరుచిని చూపడు. ఇంద్రియభోగానికి కొంత అనుమతి లభించే సాంసారిక జీవనము పట్ల అతడు విముఖుడౌతాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే అతడు ఇంద్రియభోగంలో అభిరుచిని కోల్పోతాడు. మానవజన్మ పరిపూర్ణత జ్ఞాన వైరాగ్యాలపై ఆధారపడి ఉంటుంది. కాని సాంసారిక జీవనములో ఉన్నప్పుడు జ్ఞానవైరాగ్యస్థితికి చేరే యత్నము అత్యంత కఠినమౌతుంది. అందుకే భక్తులు విశుద్ధభక్తుల సాంగత్యాన్ని లేదా తీర్థక్షేత్రాలను ఆశ్రయిస్తారు. అట్టి వ్యక్తులు పరమాత్మునికి, జీవులకు గల సంబంధాన్ని ఎరిగియుండి సర్వదా దేహాత్మబుద్ధి నుండి విడివడి ఉంటారు.* *తమ హృదయాలలో వారు నిన్ను సర్వదా మోసెడి కారణంగా పవిత్రులై యుండి ఎచటకేగినను ఆ స్థానాన్ని తీర్థస్థానముగా మార్చివేస్తారు. వారి పాదప్రక్షాళనజలము భౌతికజగత్తులో తిరుగాడే పాపజనులను ఉద్ధరించగలదు.*
*నేర్చుకున్నట్టి ఏదో ఒక మంచివిషయాన్ని చెప్పమని హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుని అడిగినపుడు అతడు తన నాస్తికతండ్రికి సమాధానము చెబుతూ "తాత్కాలికము సాపేక్షమునైన సత్యాలతో తగుల్కొనిన కారణంగా సదా చింతలతో నిండియుండెడి లౌకికునికి సంసారమనే అంధకూపాన్ని విడిచి, వనానికి వెళ్ళి భగవంతుని ఆశ్రయించడము ఒక్కటే ఉత్తమోత్తమమైన ఉపాయము" అని అన్నాడు. నిజంగా విశుద్ధభక్తులైనవారు మహాత్ములని, అంటే జ్ఞానపూర్ణులగు మహనీయులని పిలువబడతారు. వారు సర్వదా భగవంతుని, భగవత్పాదపద్మాలను తలచే కారణంగా సహజంగానే ముక్తులై ఉంటారు. అట్టి స్థితిలో సదా నెలకొని యుండే భక్తులు భగవంతుని అచింత్యశక్తులచే ఉత్తేజితులై యుండి తమ అనుయాయులకు ముక్తికారణులై ఉంటారు. కనుక కృష్ణభక్తుడు ఆధ్యాత్మికముగా సంపూర్ణ ఉత్తేజితుడై ఉంటాడు. కనుక అటువంటి విశుద్ధభక్తుని ఎవరైనా ఆశ్రయిస్తే, స్పర్శిస్తే వారు కూడ అదేరీతిగా ఆధ్యాత్మికశక్తులతో నిండిపోతారు. అటువంటి భక్తులు ఏనాడును భౌతికసంపత్తులతో విర్రవీగరు. ఉత్తమజన్మము, విద్య, సౌందర్యము, ధనము అనేవి సాధారణంగా భౌతిక విభూతులుగా పరిగణించ బడతాయి. కాని భగవద్భక్తుడు నాలుగురకాల సంపత్తులను కలిగి ఉన్నప్పటికిని వాటిని చూసికొని ఎన్నడును గర్వితుడు కాడు. పరమభక్తులు ఒక తీర్థస్థానము నుండి వేరొక తీర్థస్థానానికి వెళుతూ ప్రపంచ పర్యటన చేస్తారు. మార్గమధ్యములో వారు పలువురు బద్ధజీవులను కలిసికొని తమ సాంగత్యముచే, దివ్య జ్ఞానబోధచే వారిని ఉద్ధరిస్తారు. వారు సాధారణంగా బృందావనము, మథుర, ద్వారక, జగన్నాథ పూరీ, నవద్వీపము వంటి క్షేత్రాలలో వసిస్తారు. ఎందుకంటే కేవలము భక్తులే ఆ ప్రాంతాలలో నివసిస్తారు. ఈ ప్రకారంగా వారు పరస్పరము సాధుసాంగత్యము నెరపుతూ భక్తిలో పురోగమిస్తారు. ఈ రకంగా ప్రతీజీవుడు కృష్ణభక్తుల సాంగత్యం వలన లాభాన్ని పొందగలుగుతారు. కృష్ణభక్తులందరు సమకూడే విధంగా అట్టి మహాభక్తులు ఆశ్రమాలను, పెద్ద మందిరాలను నిర్మిస్తారు. అట్టి సాంగత్యము ద్వారా జనులు కృష్ణభక్తిభావనను మరింతగా పెంపొందించుకోగలుగుతారు.*
*కృష్ణభక్తి రహితమైన సామాన్యసాంసారిక జీవనములో అటువంటి ప్రగతి అసాధ్యము. వేదమూర్తుల స్తుతులు కొనసాగాయి : "దేవా! నిరాకారవాదులు, సాకార వాదులనే రెండు రకాల ఆధ్యాత్మికవాదులు ఉన్నారు. భౌతికజగత్తు మిథ్యయని, పరతత్త్వమొక్కటే యథార్థమని నిరాకారవాదులు అభిప్రాయపడతారు. అయినా సాకారవాదుల దృష్టి ఏమిటంటే ఈ భౌతికజగత్తు లౌకికమైనా యథార్థమే గాని మిథ్య కాదు. తమ సిద్ధాంతాలను నిరూపించడానికి అట్టి ఆధ్యాత్మికవాదుల చెంత వివిధ వాదనలు ఉంటాయి. నిజానికి ఈ భౌతికజగత్తు ఏకకాలంలో సత్యము, అసత్యము అయి ఉంది. సమస్తము పరతత్వము యొక్క విస్తారమే కనుక అది. సత్యము; భౌతికజగత్తు ఉనికి తాత్కాలికము కనుక అది అసత్యము కూడ అయి ఉన్నది. అది సృజించబడుతుంది, నశింపునకు గురియౌతుంది. విభిన్న స్థితుల కారణంగానే జగత్తునకు స్థిరమైన స్థితి లేదని తెలుస్తున్నది." జగత్తును మాయగా అంగీకరించేవారు సాధారణంగా "బ్రహ్మ సత్యం జగన్మిథ్య" అనే మహావాక్యంతో తెలియబడతారు.*
*ఈ భౌతిక జగత్తులోని సర్వస్వము జడపదార్ధము నుండే ఉత్పన్నమైనదని వారంటారు. ఉదాహరణకు మట్టి నుండి కుండలు, పాత్రలు, గిన్నెలు తయారౌతాయి. పగిలిపోగానే అవన్నీ ఇతర వస్తువులుగా మారిపోవచ్చును.. మట్టిపాత్ర పగిలిపోయినపుడు పాత్రగానో, గిన్నెగానో మారుతుంది. కాని గిన్నెలో గాని, పాత్రలోగాని లేదా కూజాలో గాని ఉన్నది మట్టియే. కనుక నీళ్ళకూజా, పాత్ర లేదా గిన్నె రూపాలన్నీ మిథ్యయే గాని మట్టిగా వాటి అస్తిత్వము నిజమేయై ఉన్నదని నిరాకారవాదుల వివరణము, ఈ జగత్తు నిక్కముగా పరతత్త్వము నుండి ఉత్పన్నమైనదయ్యును దాని అస్తిత్వము తాత్కాలికమైనందున మిథ్యయై ఉన్నది. శాశ్వతముగా ఉండెడి పరతత్త్వమే సత్యమని నిరాకారవాదుల అవగాహనము, కాని ఇతర ఆధ్యాత్మికవాదుల అభిప్రాయమేమంటే పరతత్త్వము. నుండి పుట్టినదై ఈ భౌతిక జగత్తు కూడ సత్యమే. ఒకప్పుడు జడపదార్థము ఆత్మ నుండి ఉత్పన్న మైనట్లు, మరొకమారు ఆత్మ జడపదార్ధము నుండి ఉత్పన్నమైనట్లు కనిపించే కారణంగా ఇది నమ్మరానిదని నిరాకారవాదులు వాదిస్తారు. ఆవుపేడ నిర్జీవపదార్ధమే అయినా ఒకప్పుడు దానిలో నుండి తేలు బయటకు రావడము కనిపిస్తుంది కదా యని అట్టి తత్త్వవాదులు తమ వాదాన్ని వినిపిస్తారు. అదేవిధంగా గోళ్ళు, జుట్లు వంటి నిర్జీవ పదార్థములు సజీవదేహము నుండి పుడుతుంటాయి.*
*కనుక ఒకదాని నుండి ఉత్పన్న మైన వస్తువులు దాని గుణమునే కలిగియుండవలసిన అవసరము లేదు. ఈ వాదము ఆధారంగా మాయావాద తత్త్వవేత్తలు నిరూపించడానికి యత్నించేదేమంటే భౌతికజగత్తు పరతత్త్వము నుండి ఉద్భవించినదేయైనా దాని యందు తప్పనిసరిగా సత్యము ఉండనవసరము లేదు. ఈ అభిప్రాయము ననుసరించి పరతత్త్వమును సత్యముగా అంగీకరించినప్పటికిని దాని నుండి వచ్చినదేయైనా జగత్తును సత్యముగా అంగీకరించలేము.*
*అయినా మాయావాద తత్త్వవేత్తల అభిప్రాయము భగవద్గీతలో అసురుల లేదా దానవుల అభిప్రాయమని చెప్పబడింది. దీనిని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు : "అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరమ్ / అపరస్పర సమ్భూతం కిమన్యత్ కామహేతుకం" సమస్త సృష్టి మిథ్య యన్నదే జగత్తును గురించి అసురుల అభిప్రాయము. జడపదార్థముల పరస్పర క్రియ చేతనే సృష్టి ఏర్పడినదని, దీనికి నియామకుడెవ్వడు లేడని, భగవంతుడు లేనేలేడని వారు ఊహిస్తారు. కాని నిజానికి ఇది యథార్థము కాదు, పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనే ఐదు స్థూల తత్త్వాలు, మనస్సు బుద్ధి అహంకారమనే మూడు సూక్ష్మతత్త్వాలు భగవంతుని ఎనిమిది విభిన్నశక్తులని భగవద్గీతలోని ఏడవ అధ్యాయములో చెప్పబడింది. ఈ న్యూనమైన భౌతికశక్తికి పరంగా ఆధ్యాత్మికశక్తి ఒకటున్నది. అవే జీవులు. జీవులు భగవంతుని ఉన్నతశక్తిగా భావించబడినారు. ఈ న్యూన ఉన్నతశక్తుల కలయికయే సమస్త జగత్తు; భగవంతుడు ఈ శక్తులకు మూలము. భగవంతుడు నానావిధాలైన శక్తులను కలిగిఉంటాడు. ఇది వేదాలలో "పరాస్యశక్తిర్వవిధైవ శ్రూయతే - భగవంతుని శక్తులు వైవిధ్యపూర్ణములు" అని చెప్పబడింది. అటువంటి వివిధశక్తులు భగవంతుని నుండి యే ఉద్భవించాయి కనుక మిథ్య కాజాలవు. భగవంతుడు నిత్యుడు, ఆతని శక్తులు నిత్యమైనవి. కొన్ని శక్తులు ఒకప్పుడు గోచరించి మరొక్కప్పుడు అగోచరముగా ఉండవచ్చును. కాని దాని అర్థము అది మిథ్యయని కానేకాదు. దీనికి ఒక ఉదాహరణాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చును. మనిషికి కోపం వచ్చినపుడు సాధారణస్థితికి భిన్నమైన రీతిలో వ్యవహరిస్తాడు. కాని కోపము వచ్చిపోయేది అంటే అది మిథ్య యని కాదు. అందుకే జగత్తు మిథ్య అనే మాయావాద తత్త్వవేత్తల వాదాన్ని వైష్ణవ తత్త్వవేత్తలు అంగీకరించరు. జగత్తుకు పరమకారణము లేనే లేదని, భగవంతుడు లేడని జడపదార్థముల అంతఃప్రక్రియ వలననే సమస్తము ఏర్పడినదని చెప్పడము అసురభావమని స్వయముగా దేవదేవుడే ధ్రువపరిచాడు.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment