శ్రీ రమణ కథామృతం-3
గూటికి చేరిన పక్షి
‘‘తిరువణ్ణామలై వెళ్లాలంటే.. ఇంకా 20 మైళ్లు వెళ్లాలి. ఈ ప్రయాణానికి ఖర్చులెవరు ఇస్తారు’’ అనుకున్నాడు వెంకటరామన్. వెంటనే తన చెవులకు ఉన్న రాళ్లు పొదిగిన దుద్దులు జ్ఞప్తికి వచ్చాయి. ఆ ఇంటాయన (ముత్తుకృష్ణ భాగవతార్) దగ్గర కుదువ పెడితే బాగుంటుందనిపించింది. అటువంటి లావాదేవీల్లో ప్రవేశం లేకపోయినా.. భాగవతార్తో తన సామాను ప్రయాణంలో పోయిందనీ, ఇంకా ప్రయాణం కొనసాగించడానికి డబ్బు కావాలనీ చెప్పి కొంత పైకం అప్పు తీసుకున్నాడు. దానికి కావలసిన ప్రామిసరీ నోట్ కూడా తీసుకున్నాడు.
గోకులాష్టమి నాడు తమ ఇంటికి అతిథిగా వచ్చిన అబ్బాయికి భోజనం పెట్టడమే కాక.. భాగవతార్ సోదరి అతనికి కొన్ని భక్ష్యాలను పొట్లం కట్టి ఇచ్చింది. డబ్బునూ, ఆ భక్ష్యాలనూ తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు రమణుడు.
తొలుత అరయనినల్లూర్ దాకా నడిచి వెళ్లాడు. మర్నాడు ఉదయం తిరువణ్ణామలైకి వెళ్లే రైలు ఎక్కాడు. రైలు ఎక్కినప్పటి నుంచీ అరుణాచలానికి ఎప్పుడెప్పుడు చేరుతానో అనే తొందరే ఆ యువకునికి! ఆ కొండ శిఖరం ఎప్పుడు కనబడుతుందా అని రైలులో నుంచి చూస్తూ ఉన్నాడు. కాసేపటికి గిరి శిఖరం, గిరి పాదం, ఆ పక్కనే ఉన్న అరుణాచలేశ్వర ఆలయ గోపురం ఒకదాని తర్వాత ఒకటి కనిపించాయి. రైలు తిరువణ్ణామలై చేరుకుంది.
ఏవో మరమ్మతులు జరుగుతుండటం వల్ల ఆలయాన్ని కాస్త ఆలస్యంగా తెరుస్తుండేవారు. కానీ, ఆశ్చర్యమేమంటే.. వెంకటరామన్ తిరువణ్ణామలై రైల్వేస్టేషన్ నుంచి కొండపైకి వెళ్లేసరికి.. ఆలయ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఎవ్వరూ అడ్డుచెప్పక పోవడంతో.. రమణుడు ఆలయంలో కొలువుదీరిన అరుణాచలేశ్వరుణ్ణి సమీపించి.. ‘‘తండ్రీ! నీ ఆజ్ఞమేరకు వచ్చేశాను. ఇంక నన్నేమి చేసినా నీ ఇష్టం’’ అని ప్రణామాలు సమర్పించి, ఇవతలికి వచ్చేశాడు. అంతటితో కొన్ని నెలలుగా దహించి వేస్తున్న తాపం తీరిపోయింది. పక్షి గూటికి చేరింది!
ఇంతటితో రమణుల వ్యక్తిగత జీవిత చరిత్ర ముగిసినట్లే! అప్పటికి ఆయన వయస్సు పదిహేడేళ్లు మాత్రమే!
………………………….
శ్రీ రమణ కథామృతం
అతుల్యనాథేశ్వర ఆలయంలోకి పూజారితో పాటు వెళ్లిన వెంకటరామన్ ఒక మూలన కూర్చున్నాడు. కానీ, కొద్దిసేపటిలో ఆలయంలో కాంతిపుంజం వెలిసింది. ఆ కాంతి గర్భగుడి నుంచి వస్తోందేమోనని వెళ్లి చూశాడు. అక్కణ్ణుంచి కాదని గ్రహించి తన స్థానంలోకి వెళ్లి, మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు.
ఇంతలో పూజారి తన పూజని ముగించుకొని ఆలయ ద్వారాన్ని మూయబోతూ కేక వేశాడు. ‘‘ఎవరక్కడ! ఆలయాన్ని మూసివేయాలి బయటకు వచ్చేయండి’’ అని. అప్పటికే వెంకటరామన్కి బాగా ఆకలి వేస్తోందేమో! తనకి కాస్త ప్రసాదం ఇవ్వమని పూజారిని కోరాడు. పూజారి మాత్రం చాలా కటువుగా ‘‘అదేం కుదరదు’’ అన్నాడు. సమీపంలోని (కీలూర్లో) ఉన్న విరాటేశ్వరాలయంలో కూడా దీపారాధన చేయాల్సిన తొందరలో ఉన్నాడు ఆ పూజారి. అతడి వెంట వెంకటరామన్ కూడా వెళ్లాడు.
విరాటేశ్వరాలయంలోనూ పూజారి వరుస మారలేదు. రామన్ ప్రసాదం అడగడం.. ఆయన కాదనడం! రమణుని చూస్తున్న ఆలయ వాద్యకారుడు కల్పించుకుని ‘‘అయ్యా! నాకిచ్చే ప్రసాదంలో కొంత భాగం ఆ పిల్లవాడికి ఇవ్వండి’’ అని పూజారితో అన్నాడు. ప్రసాదం రమణుని చేతిలో పడింది. ఆ వాద్యగాడు సమీపంలోనే ఉన్న బ్రాహ్మణులుండే వీధిలోకి రమణుని తీసుకెళ్లాడు. మంచినీళ్లు అవసరం ఉంటుంది కదా అని! ఆ మంచినీళ్లు వచ్చేలోగా రమణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ప్రసాదమంతా నేలపాలైంది. ఇంతలో ఎవరో నీళ్లు తెచ్చారు. మట్టిలో కలిసిపోయిన ఆ మెతుకులనే ఏరుకుని తిన్నాడు రమణుడు. తర్వాత పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై మైమరచి పడుకున్నాడు.
తెల్లవారింది. మళ్లీ ఆకలి! ఎవరైనా భోజనం పెడతారేమోనని.. అటూ ఇటూ తిరిగాడు. ఒక ఇంటి తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆ ఇంటి యజమానిని అడుగగా.. ‘‘కాసేపు ఉండు మా సోదరి వస్తుంది’’ అన్నాడు. ఆనాడు గోకులాష్టమి. ఆ యజమాని సోదరి నదిలో స్నానం చేసి వచ్చింది. జ్యోతిర్మయనేత్రుడైన ఈ నవయుకుని చూసి శ్రీకృష్ణుడే తమ ఇంటికి వచ్చాడని భావించిందామె. సంతోషంతో త్వరగా వంట చేసింది. పిండి వంటలు కూడా చేసింది. ఈలోగా రమణునికి ఒక సందేహం పట్టుకుంది.
(సశేషం)
- పింగళి సూర్య సుందరం
No comments:
Post a Comment