🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏
🙏 *నారాయణ నారాయణ*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఒక అవ్వ ఎప్పుడూ, కూర్చుని ఉన్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా
*"నారాయణ, నారాయణ"*
అంటూండేది.
ఆమె మనవడు విష్ణు ఒకసారి
*"ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు"*
అని అడిగాడు.
"నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడురా నాయనా!"
అని చెప్పింది అవ్వ.
"అదేంటవ్వా? దేవుడు ఉన్నాడు అంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!"
అని చెప్పి పడుకున్నాడు వాడు.
మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు.
నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు.
అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" అన్నాడు.
ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ! నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి, పదిమందికీ ఉపయోగపడాల్సిన ఆ చెరువు, ప్రతి సంవత్సరమూ తెగిపోయి, నిరుపయోగమయి పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేంచేస్తే బాగౌతుందో నారాయణుణ్ని అడిగి తెలుసుకురా"
అని చెప్పాడు.
"సరే" అని విష్ణు ముందుకు సాగిపోయాడు.
అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది.
"బాబూ! నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా?"
అని అడిగింది.
"ఓ! సరేలే! దానిదేముంది? తప్పకుండా కనుక్కుని వస్తాను"
అని ముందుకు సాగాడు విష్ణు.
అలా చాలా దూరం నడిచిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకొని, విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడిచెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్లు!
'ఒక్క పండు తిందాం' అనుకొని విష్ణు ఒక పండుని కోసి, రుచిచూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది!
మరో పండును కోసి చూస్తే, అది కూడా చేదే!
"ఏమిటిది! మామిడిపళ్ళు చేదుగా ఉంటాయా?" అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు.
అప్పుడు ఆ మామిడిచెట్టు మాట్లాడింది:
"చూడు బాబూ! నువ్వు 'నారాయణ స్వామి' దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకో సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరమూ నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటంలేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబూ!"
అన్నదది.
'సరే' అని విష్ణు ముందుకు సాగాడు.
ఇంకొంత ముందుకు పోయాక, అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది.
'ఎంత అందంగా ఉన్నది, ఈ మల్లెచెట్టు!'
అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు.
అంతలో ఆ మల్లెచెట్టు అన్నది:
"బాబూ! నేను ఇన్ని పూలు పూస్తాను కదా! ఎవ్వరూ నా పూలకోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది. ఏం చేస్తే నా యీ బాధ దూరమౌతుందో కాస్త ఆ నారాయణున్ని అడిగి కనుక్కుని రావా?" అని.
విష్ణు అందుకు ఒప్పుకుని ముందుకు నడిచాడు.
ఆ తరువాత అతను
*"నారాయణ, నారాయణ"*
అనుకుంటూ ముందుకు సాగాడు.
ఎంతో అలసిపోయాడు-
కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. వెనకడుగు వేయలేదు.
అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి
"బాబూ! నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా!"
అని అడిగాడు.
'సరే' అని విష్ణు నీళ్లకోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్లగుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదే ? కొంచెం ఆలోచించిన మీదట, విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి, తాత దగ్గరికి తీసుకెళ్ళి,
"తాతా! దీన్ని పిండు. నీళ్ళు వస్తాయి"
అని చెప్పాడు.
విష్ణు తెలివితేటలను మెచ్చుకొన్న తాత
"మనవడా!నువ్వెవరు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగాడు.
"నారాయణుని చూసేందుకు" అన్నాడు విష్ణు
"నారాయణుణ్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు?"
అని అడిగాడు తాత.
"మా అవ్వ ఎప్పుడూ *'నారాయణ, నారాయణ'*
అంటూ ఉంటుంది.
కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను"
అని చెప్పాడు విష్ణు.
ఆపైన తను దారిలో కలిసిన వాళ్లందరి సమస్యల గురించి కూడా చెప్పాడు.
తాత అన్నాడు:
"నారాయణుని గురించైతే నేనేమీ చెప్పలేను; కానీ మిగిలినవాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను.
గత జన్మలో ఆ మల్లెచెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలనూ, పూతీగలనూ కాళ్లతో అదేపనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది" అని.
"మరి, దానికి ఏమీ పరిష్కారం లేదా, తాతా?"
అని అడిగాడు విష్ణు.
"లేకేమి? ఉంది! ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే, ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు" అన్నాడు తాత.
తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు.
ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే, ఆ మామిడి కాయలు తియ్యగా పండుతాయి"
అన్నాడు తాత.
'సరే'నని పాము గురించి అడిగాడు విష్ణు.
"ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే, ఆ పాముకు పుండు మేలవుతుంది"
అని చెప్పాడు తాత.
ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు.
"రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి, ఇంట్లో పెట్టుకొని, చదివించి, రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి"
అని చెప్పాడు తాత.
తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకూ పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు.
తొలుత ఎదురైన మల్లెచెట్టుతో, దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు.
అప్పుడా మల్లెచెట్టు "వేరే ఎవరో ఎందుకుగాని, నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదూ?" అన్నది.
"సరే"నని, కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ, ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు.
అప్పుడా మామిడిచెట్టు "వేరే ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తీసుకో, ఆ బిందెడు బంగారాన్నీ!" అన్నది.
"సరే"నని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు.
ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు.
ఆ పాము తన పుట్టలో పడిఉన్న రత్నాలహారాన్ని తెచ్చి, విష్ణుకే ఇచ్చింది.
చివరకు రాజుని కలిసి అతని సమస్యకూ పరిష్కారం చెప్పాడు విష్ణు.
"ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునే దెందుకు? నువ్వే ఉండు!"
అని, రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి, విష్ణును, అవ్వనూ తనతోబాటే ఉంచుకున్నారు.
అంతలోనే విష్ణుకు తను నారాయణుని కలుసుకోలేదని గుర్తుకువచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది:
"దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు - ఎక్కడైనా ఉంటాడు విష్ణూ! కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుణ్ని చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు.
నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు?
ఇంకా అర్ధంకాలేదా?
ఆ నారాయణుడే!" అని.
*🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*🙏సర్వేజనాః సుఖినో భవంతు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment