Thursday, October 2, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-161.
26d3;1.10e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣6️⃣1️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                *భగవద్గీత*
                ➖➖➖✍️.```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*15. వ శ్లోకము:*

*”యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ నియత మానసః ।*
*శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగఛ్చతి ॥ 15 ॥”*

“నిగహింపబడిన, నియమింపబడిన మనస్సు కల యోగి, తన మనస్సును ఎల్లప్పుడూ ధ్యానమునందే లగ్నం చేస్తాడు.    నా స్వరూపము, 
నా స్వభావము, మోక్షమునకు ప్రతిరూపము అయిన పరమ శాంతిని పొందుతాడు. అంటే ధ్యానంలో లభించేది పరమ శాంతి.
```
ఈ ప్రకారంగా ధ్యానం చేసే యోగికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే పరమ శాంతి కలుగుతుంది. మనందరికి లేనిది, మన మందరం వెతికేది ఆ శాంతి కోసమే కదా! శాంతి కోసం వెతుక్కుంటూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతుంటారు. ఎంతో ధనం వ్యయం చేస్తారు. వివిధములైన మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తుంటారు. కానీ అది తమ చిత్తంలోనే ఉందని ఎవరికీ తెలియదు. మనసును ఆత్మయందు నిలిపితే, శాంతి దానంతట అదే వస్తుంది. ఈ శాంతి స్వరూపుడే భగవానుడు. శాంతి ఎక్కడో లేదు. భగవంతుని యందు శాంతి ఉంది. 
బయట ప్రదేశములలో, ప్రపంచములో దొరికే వస్తువుల ద్వారా దొరికే శాంతి క్షణికము అశాశ్వతము.

కాబట్టి తెలిసిన వారు, వివేకులు, జ్ఞానులు శాంతి కొరకు బయట వెతకరు. అంతర్ముఖులు అవుతారు. అక్కడే వారికి శాంతి దొరుకుతుంది. ఆ   శాంతి కావాలంటే మనో నిగ్రహము, నిరంతర అభ్యాసము ఇవే మార్గములు. 
అందుకే ‘సదాయుజ్ఞన్’ అంటే ఎల్లప్పుడూ అభ్యాసం చేయాలి. ఒకరోజు చేస్తే రాదు అని అర్ధము. ప్రాపంచిక విషయముల మీద విముఖత, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రమైన మనసు, నిరంతర అభ్యాసము, మనసును అంతర్ముఖం చేయడం, మనసును ఆత్మలో నిలపడం ఇదే ధ్యానము. 
ఈ ధ్యానముతోనే పరమశాంతి లభిస్తుంది. కాబట్టి “ఈ జీవితానికి నాకు శాంతి లేదు భగవంతుడా!” అని దేవుడి ముందు ఏడవకుండా 
ఈ మార్గం అవలంబించాలి. అని భగవంతుడు వేల సంవత్సరాల కిందటనే చెప్పాడు. 

కాని దీనిని గురించి మనం తెలుసుకోడానికి ఎటువంటి ఆసక్తి చూపడం లేదు.```


*16. వ శ్లోకము:*

*నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।*
*న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ॥ 16 ॥*

“ఎక్కువగా అంటే కడుపునిండా తిన్నవాడికి, లేక అసలు తినకుండా ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకునేవాడికి, జాగారం పేరుతో నిద్రమేలుకొనే వాడికి, తినగానే గుర్రుపెట్టి నిద్రపోయేవాడికి ఈ ధ్యానయోగం చేయడం కుదరదు.
```
ఈ ధ్యాన యోగం అవలంభించే వాళ్లు   ఎప్పుడెప్పుడు  భోజనం చేయాలి అనే విషయం ఇక్కడ చెప్పాడు భగవానుడు. కాని ఈ శ్లోకంలో ‘యోగోఽస్తి’ అన్నాడు కాబట్టి యోగము అభ్యసించేవారికి అని అర్థం. 
ఏ యోగమును అభ్యసించినా ఈ ఆహార నియమాలు పాటించాలి.. 

ప్రతి మనిషి మూడు పనులతోనే తన పూర్తి జీవితం గడిపేస్తున్నాడు. అవి ఆహారము, నిద్ర, మైధునాలు (మైథునము అంటే స్త్రీ పురుషులు కలిస్తే కలిగే సుఖం). మొదటి రెండు తనకు తానుగా అనుభవించేవి. మూడవది రెండవ మనిషి సహకారంతో చేసేది. ఈ మూడు పనులు మానవులు చేస్తున్నారు. జంతువులు చేస్తున్నాయి. కాకపోతే జంతువులు ఒక నియమం ప్రకారం చేస్తున్నాయి. మానవులు ఏ నియమమూ పాటించకుండా ఆహార, నిద్ర, మైథునాలు అపరిమితంగా అనుభవిస్తున్నారు.

(వేళాపాళలేకుండా, అర్థరాత్రి దాకా తాగుతున్నాడు. తింటున్నాడు. నిద్రపోవాల్సిన సమయంలో మేల్కొని, పగలంతా నిద్రపోతున్నాడు. ఆఫీసులో నిద్రపోవడం ఇదే. ఇంక మైథునం సంగతి అందరికీ తెలిసిందే! ఒక నియమం లేదు. ఒక సమయం లేదు. అందుకే నిర్భయ చట్టం చేయాల్సి వచ్చింది.)

అందుకే ఈ శ్లోకంలో మొదటి రెండు అయిన ఆహారము, నిద్ర గురించి వివరించాడు. ‘న అతి అశ్నతస్తు’ అంటే ఎక్కువగా మితిమీరి తినకూడదు. అంటే మితంగా తినాలి. కడుపు నిండా భోజనం చేసి ధ్యానమునకు కూర్చోకూడదు అనికూడా అర్ధం. 
గొంతుదాకా మెక్కినచో  తిండి లోపల ఊరుకోదు కదా. దాని పని అది చేస్తుంది. కడుపులో గడబిడ, వికారము, లేక తేపులు. ఇలాగా, వీటితో సతమతమౌతుంటే ఇంక ధ్యానం ఏం కుదురుతుంది. కాబట్టి అధికంగా తినకూడదు. ధ్యానానికే కాదు ఆరోగ్యరీత్యా కూడా మితంగా తినాలి. మితాహారము తింటే శరీరం తేలికగా ఉంటుంది. అదేవిధంగా 
‘న చ ఏకాన్తమ్ అనశ్వతః’ అంటే అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. అంటే కటిక ఉపవాసం ఉన్నాకూడా శరీరంలో శక్తి ఉండదు. ధ్యానం కుదరదు. శరీరము లోని అవయవములు అన్నీ సక్రమంగా పని చేయడానికి మితాహారము అవసరము. ఆహారం లేకపోతే అవయవములు క్షీణించిపోతాయి. ఆహారము, మితంగా ఉంటేనే మంచిది.

ఇక్కడ మనం ఒక ఆహార సూత్రం గురించి చెప్పుకుందాము. ఆహారం ఎలా తినాలి. అంటే, మనం కడుపును నాలుగు భాగాలుగా, ఊహామాత్రంగా విభజించుకోవాలి. అందులో రెండు భాగాలను ఆహారంతో నింపాలి. ఒక భాగం నీటితో నింపాలి. నాలుగవ భాగం ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారం, నీరు కలిసి, చిలకడానికి, జీర్ణం కావడానికి కాస్త స్థలం కావాలి కదా. అందుకని నాలుగవ వంతు ఖాళీగా ఉంచాలి. అంతే కానీ, ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి కదా అని గొంతు దాకా దట్టించకూడదు. 
కాబట్టి ఎక్కువ ఆహారం తినడం కానీ అసలు తినకపోవడం కాని ధ్యానయోగమునకు మంచిది కాదు.

ఇంక నిద్ర విషయానికి వస్తే అతి నిద్ర అసలే మంచిది కాదు. సోమరితనమును కలుగజేస్తుంది. సాధకుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. పగలంతా పని చేసిన తరువాత శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. అది అవసరం. (కానీ అదేపనిగా ఉదయం తొమ్మిది గంటలదాకా ముసుగుతన్ని పడుకోవడం సోమరితనం కలుగచేస్తుంది. చురుకుదనమును దూరం చేస్తుంది)

ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. తిండికి, నిద్రకు అవినాభావ సంబంధం ఉoది. అతిగా తింటే నిద్రవచ్చే ప్రమాదం ఉంది. కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటే ఇంక ధ్యానం ఏం చేస్తాడు. ‘న చ అతి స్వప్నశీలస్య’ అన్నాడు. అంటే అతిగా నిద్రపోయేవాడు. ఆ నిద్రలో కలలు కనేవాడు. వీడికి కళ్లుమూసుకోగానే నిద్రలోకి జారుకొని ఆ నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటుంటే ఇంక ధ్యానము ఏం నిలుస్తుంది. కలలలో తేలియాడుతుంటాడు. అలాగని అస్సలు నిద్రపోకుండా ఉంటే కూడా కళ్లు మూసుకోగానే నిద్ర ఆవహిస్తుంది. అంటే పుణ్యం వస్తుందని అతిగా ఉపవాసాలు చేయడం, (ఉపవాసం పేరుతో అతిగా తినడం), జాగారం చేయడం (ఒకే టిక్కట్టు మీద మూడు సినిమాలు చూడటం, రాత్రంతా టివికి అతుక్కుపోవడం) కూడా పనికి రాదు.

కాబట్టి ధ్యానం చేయడానికి గానీ, ఏ యోగమును అవలంబించడానికి కానీ, మితాహారము, మితమైన నిద్ర అవసరము. ఏదీ అతిగా ఉండకూడదు.

ఈ శ్లోకంలో అంతర్లీనంగా చెప్పబడిన ఒక విషయం మనం గమనించాలి. ‘అతి సర్వత్రవర్ణయేత్’ అంటే ఏదీ అతిగా ఉండకూడదు. మితంగా ఉండాలి. 
ఈ శ్లోకంలో కేవలం ఆహారము నిద్ర గురించి చెప్పాడు కానీ మనం దానికి మానవుల మూడో లక్షణమైన మైథునానికి కూడా అన్వయించుకోవచ్చు. ఆమాటకొస్తే ప్రతి విషయానికీ ఈ సూత్రం వర్తిస్తుంది. అతిగా ప్రవర్తించే వారికి ధ్యానం ఆమడ దూరంలో ఉంటుంది. ఏవి చేయకూడదో చెప్పిన వరమాత్మ, ధ్యానం చేయడానికి ఏవేవి అవసరమో తరువాతి శ్లోకంలో వివరించారు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment