Wednesday, October 1, 2025

 *స్వామి వారి జీవితం లో జరిగిన ఒక అద్భుత లీల.*
*పుణ్య జలస్నానం ముదుసలికి ముక్తిని ప్రసాదించడం* 

*ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తిరుత్తల యాత్రలో ఉన్నప్పుడు, వళువత్తూరు అనే గ్రామంలో తన భక్తుడు రామస్వామి ఇంట్లో బస చేశారు.*

*ఒక రోజు సాయంత్రం, దర్శనాలన్నీ పూర్తయ్యాక, మహాస్వామి వారు రామస్వామిని పిలిచి,*

*“పశువుల పాక లోఉన్న పాత్ర తీసుకుని దానిలో సగం నీళ్లు పోసి, అందులో రెండు చేతులనిండా సరిపడ ఉప్పు వేసి తీసుకురా!” అని ఆజ్ఞాపించారు.*

*రామస్వామి చెప్పినట్టు చేసి తీసుకొచ్చాడు. మహాస్వామి వారు కాస్త ఎత్తైన తిన్నె మీద కూర్చుని, తన రెండు కాళ్లను ఆ ఉప్పు నీటిలో ఉంచారు.*

*వింతగా అనిపించడంతో స్వామి వారి చుట్టూ జనాలు గుమిగూడి ఉన్నారు.*

*అప్పుడు స్వామి వారు* 
*“ఈరోజు చాలాసేపు కదలకుండా కూర్చున్నాను అందుకే కాళ్లు బాగా గట్టిపడి ఉన్నాయి .అందుకే ఇలా చేస్తున్నాను!” అని చెప్పారు.*

*కొద్ది సేపటికి తరువాత స్వామి వారు ఆ పాత్ర నుండి తన కాళ్లను బయటకు తీసుకున్నారు. జనాలు వెంటనే ఆ నీటిని తీర్థంగా తీసుకుని తలపై చల్లుకున్నారు.*

*అప్పుడు మహాపెరియవా ఒక్కసారి ఇలా అన్నారు:*
*“ఆ నీరంతా ముగించకండి ఒక చెంబులో కొంచెం తీసుకుని ఉంచండి.”*

*అందరికీ ఆశ్చర్యం వేసింది, కానీ ఎవ్వరూ ఎందుకు అనలేదు. చెంబులో కొంత నీరు తీసి పెట్టారు.*

*అరాత్రి సమయం దగ్గర పడుతోంది. ఒక వృద్ధ ముసలామె అక్కడికి వచ్చి, పరమాచార్యుల ఎదుట నిలబడి ఏమీ మాట్లాడకుండా కళ్ళలో కన్నీరు పెట్టుకుంది.*

*కాస్త నిశ్శబ్దంగా ఆమె వైపు చూసి స్వామి వారు ఆలస్యంగా మృదువుగా ఆమెను ప్రశ్నించారు:*

*ఎమ్మా “కాశీ, రామేశ్వరానికి వెళ్లాలనుకున్నావా?* 
*కానీ చేతిలో డబ్బు లేదు కదా అందుకే ఇలా వచ్చావా?” అని అడిగారు.*

*ఆమె కంట నీరు కారుస్తూ "అవును స్వామి "అని మాత్రమే అంది.*

*మహా స్వామి వారు ఏమీ మాట్లాడకుండా లోపలికి తిరిగి రామస్వామిని పిలిచి:*

*“ఆ చెంబులో ఉన్న నీటిని తీసుకురా!” అని ఆదేశించారు.*

*తీసుకొచ్చిన నీటిని “ఆ ముసలిమె తలపై పోయించు!”అని చెప్పారు. అక్కడ ఉన్న స్వామి వారి సేవకుడు అలానే చేశారు*

*తర్వాత మహాపెరియవా త‌న క‌మండ‌లం (సన్యాసుల పవిత్ర జలంతో నిండిన పాత్ర) నుండి నీటిని ఖాళీ చెంబులో పోసి:*
*“ఇదీ ఆమె తలపై పోయించు!” అన్నారు.*

*“మొదట రామేశ్వరం… తరువాత కాశీ… ఈ రెండు పుణ్య తీర్థాలలో స్నానం చేసిన ఫలితం నీకు వచ్చేసింది.* 

*ఎలాంటి ఆందోళన లేకుండా వెళ్లిపో.* 
*అంతా శుభమే జరుగుతుంది!”*
*అని ఆశీర్వదించి పంపారు.*

*ఆ ముదుసలి అంతులేని ఆనందం,తృప్తితో అక్కడినుంచి వెళ్ళిపోయింది.*

*ఇప్పటివరకు జరిగినదంతా సాధారణంగానే అనిపించింది. కానీ రెండు రోజుల తర్వాత వచ్చిన వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.*

*ఆ ముసలామె, మహాపెరియవాను దర్శించిన మరునాడు ముక్తి పొందిందట.*

*ఈ విషయాన్ని రామస్వామి స్వయంగా మహాపెరియవాకు చెప్పగా,*

*“అందుకే నిన్ననే నీతో ఆమెకు పుణ్య తీర్థ స్నానం చేయించేశాను. ఎలాంటి కష్టం లేకుండా ముక్తి పొందింది!” అని శాంతంగా స్పందించారు.*

*ఈ సంఘటన ద్వారా మహాపెరియవా:*
*ఒక వృద్ధ భక్తురాలి మనసు లోపల దాచిన ఆశయాన్ని ముందుగానే గ్రహించారు.*

*రామేశ్వరం సముద్రానికి ప్రతీకగా ఉప్పు నీటిని,*
*కాశీ తీర్థానికి ప్రతీకగా తన కమండల నీటిని ఆమె తలపై అభిషేకించారు.*

*ఆమె తీరని తపస్సును తీర్చుతూ, జీవనాంత్యంలో ముక్తిని ప్రసాదించారు.*

*ఇది సాధారణ చరిత్ర కాదు… ఒక పరమహంస, జ్ఞాని, దైవిక శక్తి ఎలా పని చేస్తుందో చూపించే పరమాద్భుతమైన లీల*

*।అపార కరుణా సింధుం జ్ఞానదo శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।*

*।జయ జయ శంకర హర హర శంకర।🙏*

No comments:

Post a Comment