🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*నరక చతుర్దశి...!!*
*దీపావళి...!!*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం.
దీపావళి రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ము తుంటాయి.
ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.
చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.
*నరకాసుర వధ ఎలా జరిగింది? ఎందుకు జరిగింది..?*
శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు.
వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.దేవతలు విష్ణువును సహాయం అర్థిస్తారు.
తాను శ్రీకృష్ణావతారంలో నరకుని వధించెదనని విష్ణువు దేవతలకు నచ్చచెబుతాడు. అయితే భూదేవి విష్ణువు నుండి వరం పొంది ఉంటుంది. నరకుడు చాలా కాలం జీవించాలని, అతడు తల్లి అయిన తన చేతులలో మరణించాలని, మరియు అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరగా ఆ కోర్కెలకు విష్ణువు అంగీకరించి వాటిని వరాలుగా ఇస్తాడు. విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు భూదేవి సత్యభామగా అవతరిస్తుంది.
నరకుడు దేవతల తల్లి అయిన అదితి కర్ణకుండలాలను అపహరిస్తాడు. పైగా పదహారు వేలమంది రాజకన్యలను కూడా అపహరించి బందీ చేస్తాడు. అదితి సత్యభామకు బంధువు.
దీనితో సత్యభామ కోర్కెతో శ్రీకృష్ణుడు నరకునిపై దండెత్తి యుద్ధం చేస్తాడు, నరకాసురుడు కృష్ణునిపై పెక్కు దివ్యాస్త్రాలను ప్రయోగించగా, కృష్ణుడు వాటిని తిప్పికొట్టి సమ్మసిల్లి పడుకుంటాడు చివరకు సత్యభామ ఆగ్రహించి ధనస్సు ను చేత బట్టి నరకుని సంహరిస్తుంది.
అదితికి కుండలాలు తిరిగి వస్తాయి. పదహారువేల మంది కన్యలు రక్షింపబడతారు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపు కుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.
మరుసటి రోజు అమావాస్య కావడంతో చీకట్లు ముసురు తాయి. ఆ చీకట్లను పారదోలడానికై ప్రజలు దీపాలు వెలగిస్తారు..
ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది.
దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.
ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు.
ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు.
మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు.
భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు...
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
No comments:
Post a Comment