Sunday, February 1, 2026

 మను ధర్మం ఎక్కడ ఉన్నది ?. ఎవరు ఆచరిస్తున్నారు ?.

భారతదేశ చరిత్రలో, కృత, త్రేతా, ద్వాపర యుగాల కాలంలో, వర్ణ వ్యవస్థ ఉండేది. వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే, మనుధర్మ శాస్త్రమును ఆచరించటం జరిగినది. వర్ణ వ్యవస్థతో కూడిన సమాజంలో, నాలుగు వర్ణముల వారు, మనువు చెప్పిన ధర్మ శాస్త్రమును పాటించే వారు. వారి రాజ్యాంగము కూడాను, మను ధర్మ శాస్త్రమే. మనం ఉన్నది కలి యుగంలో. కలియుగం మొదలై 5000 సంవత్సరములు అవుతున్నది.  

భారతీయ సమాజంలో, నాలుగు వర్ణములతో కూడిన, వర్ణ వ్యవస్థ కూలిపోయి, 5000 సంవత్సరములు అవుతున్నది. గత 5000 సంవత్సరాల కాలములో, వర్ణ వ్యవస్థ స్థానంలో వర్గ వ్యవస్థ వచ్చినది. వర్గ వ్యవస్థ స్థానంలో కుటుంబ వ్యవస్థ వచ్చినది. ఈ కుటుంబ వ్యవస్థ, కాల క్రమేణా, కుల సమాజముగా వృద్ధి చెందినది. 

ఈ సంధి కాలములో, భారతీయ సమాజంలో, ఎన్నో ధర్మములు రావటం, పోవటం జరుగుతున్నది. క్రొత్తగా వచ్చిన ధర్మములు, మనుధర్మ స్థానంలోనే వచ్చినవే. ఎందుకంటె, సనాతన ధర్మం కంటే ముందు, భారతీయ సమాజంలో వేరే ధర్మములు ఉన్నట్టుగా, మనకు ఏ చరిత్ర చెప్పుట లేదు. క్రొత్తగా వచ్చిన ధర్మ ముల గురువులు, వారి వారి సిద్ధాంతములు, ప్రజలకు చెప్పుతూనే ఉన్నారు.      

జైనం, బౌద్ధం, చార్వాకం, సిక్కు, శైవం, వైష్ణవం, శాక్తేయం, ద్వైతం, అద్వైతం, విశిష్ఠాద్వైతం, వీర శైవం, అచల తత్త్వం మరియు ఆర్య తత్త్వం. ఈ తత్వములు అన్నియు కూడాను, సనాతన ధర్మం నుండి పుట్టినవే. వీరు అందరు, మనుధర్మ శాస్త్రంలో చెప్పబడిన అంశములను, వారి వారి అవగాహనా శక్తిని బట్టి గ్రహించి, వారి వారి విధానములలో, ప్రజలకు చెప్పటం జరుగుతున్నది.  

అయినప్పటికిని, కొందరు మాత్రం, మనువాదం నశించాలి. సమాజంలో అన్ని రుగ్మతలకు కారణం మను వాదమే అని పిచ్చి వాదనలు చేస్తారు. ఎందుకంటె, 5000 సంవత్సరముల క్రిందట, ఆగిపోయిన ధర్మమును కించపర్చటం, వెఱ్రి కాకపోతే ఏమనాలి. అసలు మనువాదం అంటే ఏమిటో వీళ్ళకు తెలియదు. మను ధర్మం అమలులో ఉన్నదో లేదో కూడా విమర్శలు చేసే వాళ్ళు ఆలోసించటం లేదు.  

కులమును సృష్టించింది, మను ధర్మశాస్త్రం అని కొందరు అంటున్నారు. ఇది అబద్దం. మనుధర్మ శాస్త్రంలో కులము అనే పదం వాడటం జరిగింది. అది కుటుంభం గురించి ప్రస్తావించే సందర్భంలో వాడినారు. మనుధర్మ శాస్త్రంలో కుటుంభం, కులము అనేవి ఒకే అర్థంతో కూడినవి. కనుక, మనుధర్మ శాస్త్రం, అమలు జరిగిన కాలములో, ఆ సమాజములో ఉన్నది, నాలుగు వర్ణములతో కూడిన, వర్ణ వ్యవస్థ మాత్రమే. 

మను ధర్మం శాస్త్రం  ప్రకారం, ధర్మమును కాపాడవలసిన బాధ్యత బ్రాహ్మణులది. రాజ్యమును కాపాడవల సిన బాధ్యత క్షత్రియులది. వస్తు వినిమయం, వ్యాపారం కాపాడవలసిన బాధ్యత వైశ్యులది. వ్యవసాయము ను కాపాడవలసిన బాధ్యత శూద్రులది.  

గత 5000 సంవత్సరముల నుండి, అన్ని వర్గముల వారు, అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. దీనిని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏమంటే, చేస్తున్న పని, పొట్ట కుటికోసమే తప్ప. మరే విధమైన నిర్ధారణకు ఆధారము కాదు. అంతేకాదు, అన్ని వర్గముల ప్రజలు, అన్ని రకముల పనులు చేస్తున్నారు అంటే, మను ధర్మం శాస్త్రం అమలులో లేదు అని రూడి అవుతున్నది.  

భారతదేశంలో ప్రజలు అనాదిగా ఆచరిస్తున్నది సనాతన ధర్మం. దీనినే హిందూ ధర్మం అని కూడా అంటారు. సనాతన ధర్మంలో భాగమే మనుధర్మ శాస్త్రం. ఇది స్వాయంభువ మునువుచే చెప్పబడినది. దీనియందు, ధర్మముగా చేయవలసిన పనులు, అధికారములు, బాధ్యతలు మరియు శిక్షలు అన్నియు పొందుపర్చబడి నవి. అంటే, పరిపాలనకు మార్గదర్శి (రాజ్యాంగము) కూడాను. 

గత 5000 సంవత్సరముల నుండి, మనుధర్మ శాస్త్రం అమలులో లేనప్పటికిని, ప్రజలు, సనాతన ధర్మము ను, ఎవరికి తోచిన విధముగా వారు ఆచరిస్తున్నారు. సనాతన ధర్మమే, మనుధర్మం అని కొందరు భ్రమపడు తున్నారు. ఇది భ్రమ మాత్రమే. 

భారతదేశంలో కులము ఎలా ఏర్పడినదో తెలియటం లేదు, అని వ్యాసములు వ్రాచిన ప్రబుద్ధులే, కులమును నశింపజేయాలి అని కూడా వ్యాసాలు వ్రాయటం జరిగింది. ఇది భూత వైద్యుడి బొంకులాంటిది మాత్రమే. ఇటు వంటి ప్రబుద్ధులే, వాళ్ళ కులము గొప్పదని వ్రాచుకున్న సందర్భములు కలవు. 

మనం, ఏ ధర్మం పాటిస్తున్నాము అనేది, మనకు మనం విశ్లేషించుకోవాలి. మనం పాటించని ధర్మం గురించి మాట్లాడటం, అజ్ఞానమే. కనుక ఎవరికి నచ్చిన ధర్మమును వారు పాటించుకుంటూ, వారి వారి సరిహద్దులలో వారు జీవిస్తే, అందరికి మంచిది. అందుకే అన్నారు, ధర్మో రక్షతి రక్షతః అనే వేద సూక్తిని. అంటే, మనం ధర్మముగా జీవిస్తుంటే, ఆ ధర్మమే మనకు రక్షణగా ఉంటది.        
డాక్టర్. ఎక్కిరాల వెంకటనరసయ్య
9391129992.

No comments:

Post a Comment