Monday, August 17, 2026

 *భట్టివిక్రమార్క కథలు-9*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
57/374

ఈ విధంగా విక్రమార్కుడు ఇంద్రలోకం ఆహ్వానించబడ్డ యింద్రునిచే ప్రశంసలూ, ఆశీస్సులూ, వరాలూ, బహుమతులూ పొంది వచ్చిన విధానమూ - భట్టి అడగగానే చెప్పాడు.

అంతా చెప్పి.. "భట్టి! నేనొక తెలివితక్కువ పని చేశాను. నా బుద్ధికప్పుడు తట్టలేదు. అదేమిటంటే దేవేంద్రుడు - నేను వెయ్యిసంవత్సరాలు బతికుండి రాజ్యం పాలించేటట్లు వరమిచ్చాడని చెప్పాను కదా. 

ఆ సమయంలో నీ విషయం ప్రస్తావించడం మరచి పోయాను. నేనడిగితే ఇంద్రుడు నీకూ అలాటి వరం యిచ్చి ఉండేవాడు. తప్పు నాది కాని అతనిది కాదు. నువ్వు లేకపోతే నేనెన్నాళ్ళు జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నా కెందుకు? ఇప్పుడేం చెయ్యాలో తోచడంలేదు.” అని చింతించాడు.

అందుకు భట్టి - "గడిచిన దానికి వగచి ఉపయోగమేమిటి? దీనికి నేనొక ఉపాయం చెబుతాను. 

నేను కాళికాదేవి గురించి తపస్సు చేసి ఆమె కరుణ పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి." అని అన్నకి నమస్కరించి, అతని అనుమతి తీసుకుని తపస్సుకు వెళ్ళిపోయాడు.

కాళికాలయంలో ఆరు నెలల పాటు భట్టి తీవ్రంగా తపస్సు చేశాడు. 

అతని నిష్టకీ, భక్తి శ్రద్దలకీ, స్థిరత్వానికీ దేవి సంతోషించి ప్రత్యక్షమైంది. అతడామెను స్తుతించి- "తల్లీ! నేను రెండు వేల సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు.” అని ప్రార్ధించాడు.

అతని కోరిక విని కాళి నవ్వి “వత్సా! నీ కోరిక దుర్లభమైనది. ఇలాటి వరం కావాలంటే.. ధైర్యం, సాహసం, వితరణ మొదలైన
సద్గుణాలన్నీ కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సును నాకు బలివ్వాలి. ఇలా చెయ్యలేకపోతే మరో వరం కోరుకో.” అంది.

దేవి మాటలు వినగానే భట్టికి దిగులేసింది. 'ఇంక నేనేం చెయ్యాలి? చేసిన తపస్సంతా వృధా. కాళి చెప్పిన మహత్కార్యం చెయ్యడం నా తరమా? 

సకల సద్గుణాలూ కల రాజు ఎవరు నా కోసం తన ప్రాణాలర్పిస్తాడు. అలాటివాడు అన్న విక్రమార్కుడొక్కడే. 

ఈ విషయం అతనికి చెబితే ఏమనుకుంటాడో? ఒకవేళ అందుకంగీకరించి 'ప్రాణత్యాగానికి సిద్ధపడినా అలాటివాడిని చంపి నేనెంతకాలం బతికినా ఏం ప్రయోజనం? అని చింతించి,

"తల్లీ! నాకు మరేవరమూ అక్కర్లేదు. నువ్వు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడొక్కడే. అతనితో ఆలోచించి తరవాత చెబుతాను." అన్నాడు.

“సరే” అని కాళి అంతర్థానమైపోయింది.

దీనవదనంతో వచ్చిన భట్టిని చూసి "తమ్ముడూ! ఏమైంది?" అని అడిగాడు విక్రమార్కుడు.

భట్టి - జరిగినదంతా చెప్పాడు.

అదివిని - "దీనికంత విచారం దేనికి? ఇది గొప్పకార్యం కాదు. పద. నేను నా శిరస్సుని కాళికాదేవి కర్పిస్తాను. మన వంశం నిలవడానికి నేనైతేనేం? నువ్వైతేనేం? చింతించకు.” అంటూ.. భట్టి ఎంత చెబుతున్నా వినకుండా కాళికాలయానికి బయలుదేరాడు. విధిలేక భట్టి అతని ననుసరించాడు.

ఇద్దరూ అంబకి నమస్కరించాక, రాజు తమ్ముణ్ణి చూసి- "భట్టీ! సంకోచించకు. ఇదుగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతికలిగేలా వేగంగా నా మెడ నరుకు." అని బలిపీఠం ముందు తలవంచాడు.

విక్రమార్కుణ్ణి మళ్ళీ బ్రతికించుకోవచ్చు నన్న ధైర్యంతో కత్తి తీసుకుని కాళికి మొక్కి - "తల్లీ! నువ్వు కోరినట్లు రాజుని బలిస్తున్నాను. నా మీద అనుగ్రహించి నేను కోరిన వరమియ్యి." అంటూ భట్టి రాజు తల నరికి బలి పీఠం మీదుంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

కాళిమాత ప్రత్యక్షమయింది. “వత్సా! మెచ్చాను. నువ్వు కోరినట్లే రెండు వేల సంవత్సరాలు జీవించి, ఉండేలా వరమిస్తున్నాను. సుఖంగా ఉండు." అన్న అంబని చూసి భట్టి పకపకానవ్వాడు.

"ఎందుకు నవ్వుతావు? నేను చెప్పినట్లు జరగదనుకుంటున్నావా?”

"జననీ! నా కలాగే అనిపించింది. ఎందుకంటే ఈ విక్రమార్క మహీపతి దేవేంద్రుడి నుంచి వెయ్యేళ్ళు జీవించి రాజ్యపాలన చేసేలా వరంపొందాడు. ఆ వరమిచ్చి రెండు రోజులయినా కాకుండానే నేను తపస్సు మొదలెట్టాను. ఇంత స్వల్పకాలంలోనే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుడి మాట అబద్దమయింది. 

ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరంలాగే ఇదీ ఔతుందనిపించి నవ్వొచ్చింది. తప్పులేదుకదా?”. అన్నాడు.

భట్టి చెప్పింది నిజమే అని గ్రహించిన కాళికాదేవి అతని వివేకానికి సంతోషించి - 

"భట్టీ! నువ్వు చెప్పింది న్యాయమే కాని భూమ్యాకాశాలు తలకిందులయినా నా మాట తప్పదు. దేవేంద్రుడి వరమూ తప్పదు.

మీ యిద్దరి ధైర్య సాహసాలనీ, మనోనిబ్బరాన్నీ తెలుసుకోవాలనే అలా కోరాను నీ కింకా ఏదైనా వరం కావాలంటే కోరుకో.” అంది.

"జగదీశ్వరీ! అలాటి సుగుణశీలుడైన రాజు మరణించాక నేనెంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయుంచి ఇతన్ని బతికించు." అని కోరుకున్నాడు.

"భట్టీ! విక్రమార్కుడి శిరమును మొండెంతో చేర్చు.” చెప్పింది కాళి. 

అతను అలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలోంచి లేచినట్లు లేచి ఎదురుగా ఉన్న దేవిని స్తుతించాడు.

వాళ్ళిద్దరికీ సకల శ్రేయస్సులూ చేకూరాలని అంబ దీవించి అంతర్ధానమయ్యాక ఇద్దరూ నగరం వెళ్ళిపోయారు. తరవాత 'విక్రమార్కుడికొక అనుమానం వచ్చింది.

"తమ్ముడూ! దేవేంద్రుడు నాకు వెయ్యి సంవత్సరాలు ఆయుర్దాయం వరమిస్తే, కాళికాదేవి నీకు రెండువేల సంవత్సరాలిచ్చింది. దీనిని బట్టి నేను గతించాక నువ్వు వెయ్యి సంవత్సరాలు జీవించి ఉండాలి.

ఇందుకు నువ్వూ నాలాగే చింతిస్తున్నావేమో." అదివిని భట్టి తలూపి - "నిజమే. కాని దీనికొక ఉపాయం ఉంది.

అలా ఐతే నువ్వూ రెండువేల సంవత్సరాలు జీవించగలవు.” అన్నాడు.

“ఎలా?” అడిగాడు విక్రమార్కుడు.

“మీరు సంవత్సరానికారు మాసాలే రాజ్యపాలన చేస్తూ మిగిలిన ఆరు మాసాలూ రాజ్యాన్ని యితరుల కప్పగించి దేశసంచారం చేస్తూండండి. 

అలా అయితే వెయ్యేళ్ళు రాజ్యపాలన చేయడానికి మరో వెయ్యేళ్ళు కూడి వస్తుంది. 

మొత్తం రెండువేల యేళ్ళు జీవించవచ్చు. దీనివల్ల మరో లాభం కూడా ఉంది. దేశ సంచారం చేయడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి.”

“ఎంత తెలివైనవాడివి భట్టీ! నువ్వు చెప్పినట్లే చేస్తాను” అని అతన్ని రాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. అది మొదలు విక్రమార్కుడు సంవత్సరంలో ఆరు మాసాలు మాత్రమే పరిపాలన చేస్తూ మిగిలిన ఆరునెలలూ రాజ్యాన్ని భట్టి కప్పగించి దేశాటనం చేయసాగాడు.

ఒక్కొక్కప్పుడు ఇద్దరూ బయలుదేరేవారు. అప్పుడు రాజ్యాన్ని భట్టి కొడుక్కి అప్పగించేవాడు.

“ఓ భోజరాజా! ఇలా విక్రమార్క చక్రవర్తి సాహసం, వితరణ, పరోపకారం మొదలైన సద్గుణాలన్నీ కలిగి ప్రజారంజకంగా పాలించాడు. 

అతని రాజ్యంలో మృగాలకి కూడా జాతివైరం ఉండేది కాదు. రాజు, మంత్రి ఐన ఆ అన్నదమ్ముల ఐకమత్యాన్ని అందరూ పొగడేవారు. అతని గుణగణాలు వర్ణించడం అసాధ్యమని ఆదిలోనే చెప్పాను కదా?

విక్రమార్కుని గుణాలు విన్నావు కదా. అతని లక్షణాలు కొన్నయినా నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్టించు. లేకపోతే నీకా అర్హత ఉండదు. వెళ్ళిపో" అంది ప్రతిమ.

ముహూర్తం దాటిపోడంతో భోజరాజు కొలువు చాలించి మందిరానికి వెళ్ళిపోయాడు.

(సశేషం)

No comments:

Post a Comment