శ్రీమదిరామాయణము.
(221 వ ఎపిసోడ్),
""'కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచలక్ష్మీ, క్షమయాధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేతు రంభా,
షట్ ధర్మయుక్తా సహధర్మపత్నీ||,
పతికి పనులు చేయవలసివచ్చినప్పుడు దాసివలెను,అలోచనాసరళిలో మంత్రివలెను రూపసౌభాగ్యములయందు లక్ష్మీదేవి వలెను ఓర్పునందు భూదేవివలెను, ఆహారవిషయములయందు తల్లివలెను,శయనసమయములందు రంభవలెను ప్రవర్తిల్లుచు భర్తకు సదా సుఖములు సమకూర్చవలెనని స్త్రీకి నీతి శాస్త్రము వెల్లడిస్తున్నది.
రామాయణము అయోధ్యకాండములో కైకేయి దుష్టకోరికలకు దశరథమహారాజు చింతించుచు,
"" యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ,
భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్టతి||,
"సతతం ప్రియకామా మే ప్రియపుత్త్రా ప్రియంవదా|,
న మయా సత్కృతా దేవీ సత్కర్మార్హా కృతే తవ||,(12 -69,70),
నా భార్య కౌసల్యదేవి పట్డపురాణిగ యుండికూడ దాసి వలె పరిచర్యలు చేసినది. ద్యూతక్రీడాది సమయాలలో నాకు నెచ్చలి వలెనుధర్మానుష్టాన సమయములలో సహధర్మచారిణిగాను సహకరించినది.సుమిత్రాదులని వివాహమాడునప్పుడు నన్ను సోదరి వలె లాలించినది. నా శరీర పోషణాది విషయములలో తల్లివలె ప్రవర్తిల్లినది.సదా నా హితము కోరుచుండెడిది.సర్వదా నాతో ప్రియముగ మాట్లాడుతూండేదని కైకేయికి కౌసల్య సద్గుణాలను తెలియచేస్తాడు.
కానీ సద్గుణరాశిగ మెలిగేలక్షణాలు నీలొ ప్రస్తుతము నాకు గోచరించుటలేదని చెప్పుచు,
"" రమమాణస్త్వయా సార్థం మృత్యుం త్వాం నాభిలక్షయే,
బాలో రహసి హస్తేన కృష్ణసర్పమివాస్పృమివాస్ప్రుశమ్||,(12-82),,
ఓ పాపాత్మురాలా కైకేయి, "" సర్పము ప్రమాదకారి" యని తెలియని పసివాడు యొక నల్లని త్రాచుపై చేయి వేసినట్లు , నీవు నన్ను కబళించుటకు వచ్చిన మృత్యువువని తెలుసుకొనలేక చాలా కాలము నీతో విలాసముగ క్రీడించితినని విచారిస్తాడు.
"" హంతానార్యే మమామిత్రే సకామా భవ కైకయి,
మృతే మయి గతే రామే వనం పురుషపుంగవే"""
"" సేదానీం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి""(11-95_96),,
ఓ దుష్టురాలా! నా రాముడు వనములకు వెళ్లినచో నేను జీవించను.అప్పుడు నీకోరిక నెరవేరును.నీ పగ తీరును.నీ మనస్సు చల్లబడినతర్వాత నీవు విధవవై ఈ రాజ్యాన్ని హాయిగ ఏలుకొమ్మని విలపిస్తాడు
రామాయణములో భార్యాభర్తలు అన్యోన్య సహకారాలతో మెలగాలని మనందరికి తెలియచేస్తున్నది.ఒకరినొకరు అర్థము చేసుకొని
మెలగే మంచి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని రామాయణము హితవు పలుకుతున్నది.
No comments:
Post a Comment