Tuesday, October 21, 2025

 7️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*25. సక్తాః కర్మణ్యవిద్యాంసో యథా కుర్వంతి భారతl*
 *కుర్యాద్విద్వాంస్తథాసక్థ:  చికీర్షుర్లోక సంగ్రహమ్ll*

ఎలాగైతే అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మలయందు ఆసక్తి కలిగి ఉండి, వాటినే ఆచరిస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితము కొరకు, ఎటువంటి ఆసక్తి, స్వార్థబుద్ధి లేకుండా, కర్మలు చేస్తుంటారు.

అర్జునా! నీకు ఇంకా వివరంగా చెబుతాను విను. ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరడానికి ఫలితములను ఆశించి, ఏవిధంగా కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు కూడా, తమకు ఏ కర్మచేయవలసిన అవసరం లేకపోయినప్పటికినీ, లోక కల్యాణము కొరకు, లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవడం కొరకు, తాము కూడా నిష్కామ కర్మలు ఎటువంటి కర్తృత్వభావన లేకుండా, పరోపకారం కొరకు కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఒకటే తేడా. అజ్ఞాని తన కోరికలు తీరడానికి ఫలితం ఆశించి, తన స్వార్థం కోసరం కర్మలు చేస్తున్నాడు. జ్ఞాని ఎటువంటి కోరికలు కోరకుండా ఫలితం ఆశించకుండా ఇతరుల బాగుకోసరం, సమాజ శ్రేయస్సుకొరకు కర్మలు చేస్తున్నాడు. ఇంతే తేడా.

ఈ శ్లోకంలో భగవానుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా చూపించాడు. అజ్ఞానులు, జ్ఞానులు ఇరువురు ఈ లోకంలో పుట్టారు కాబట్టి కర్మచేయక తప్పదు. అజ్ఞానులు ఫలాసక్తితో చేస్తారు. జ్ఞాలులు ఫలం కోరకుండా చేస్తారు. అజ్ఞాని కర్మయందు ఆసక్తితో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వబుద్ధితో చేస్తాడు. జ్ఞానులు ఇది నా ధర్మము అనుకుంటూచేస్తాడు. అజ్ఞాని తన ఆనందం కొరకు, తన సంతోషం కొరకు పని చేస్తాడు. జ్ఞాని సమాజం శ్రేయసు కొరకు, ఆనందంతో, సంతోషంతో పని చేస్తాడు. అజ్ఞానిలో స్వార్థం ఉంటుంది. జ్ఞానిలో పరోపకారం, సమాజ శ్రేయస్సు ఉంటుంది. అజ్ఞాని ఆసక్తితో చేస్తాడు. జ్ఞాని అనాసక్తంగా చేస్తాడు. అజ్ఞానికి తాను చేసే కర్మలు బంధనాలు కలిగిస్తే, జ్ఞానికి అవే కర్మలు మోక్షానికి దారిచూపుతాయి. కాబట్టి కర్మలు చేయడం ఇద్దరికీ సమానమే కానీ భావనలో మాత్రమే తేడా. అగ్నిని మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు. కర్మ స్వార్ధానికి ఉపయోగించవచ్చు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవచ్చు. కాబట్టి కర్మ స్వభావమును తెలుసుకొని కర్మచేయాలి. కాబట్టి భగవానుడు వ్యక్తి స్పార్ధము కన్నా సమాజ శ్రేయసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి సకామ కర్మ కన్నా నిష్కామ కర్మ మంచిది. అజ్ఞానంతో స్వార్థబుద్ధితో చేసే కర్మ కన్నా జ్ఞానం కలిగి సమాజ శ్రేయస్సు కొరకు చేసే కర్మ మంచిది.

*26. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసజ్గినామ్l*
 *జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్త: సమాచరన్ll*

ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధరూపములతో, నామములతో, దేవుళ్లను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూచి జ్ఞానులు వారు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్లు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి, అజ్ఞానులకు చూపించి, వారికి నచ్చచెప్పి, వారితో నిష్కాను కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి.

ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాడు. ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు, అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు, తెలిసీ తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడం యందే నిమగ్నం అయి ఉంటారు. అటువంటప్పుడు, జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు. వారి నమ్మకాలను మూఢనమ్మకాలని కొట్టి పారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చచెప్పాలి. వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి. అలాకాకుండా, ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతి వాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు. జ్ఞాని అయిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు అని ఖండించకూడదు. వారి నమ్మకాని వమ్ము చేయకూడదు. మరి ఏం చేయాలి. అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్షరహితంగా, స్వార్ధరహితంగా ముందు తాను చేస్తూ, అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా సమాజహితం కోరుతూ స్వార్ధం లేకుండా కర్మలు చేస్తాడు.

దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే... అజ్ఞానులు నిష్కామ కర్మ తత్వము తెలియక, తాము చేసేది మంచిది అనే భావనతో, శ్రద్ధతో, ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి, కర్మలు చేస్తుంటారు. అన్నీ తెలిసిన వాడు వెంటనే "నీవు చేసేది తప్పు, నీకు పాపం వస్తుంది" అని మొహం మీద చెప్పకూడదు. చెబితే అజ్ఞానులు "నీకేం తెలియదు పో" అని వారు కూడా మొహం మీదనే అంటారు. మరి కొందరు అసలు కర్మలు చేయడమే మాని వేస్తారు. మరి కొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్ధపూరిత కర్మలు చేస్తారు. దానితో అంతా రసాభాస అవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు. తాను మాత్రము ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి, శ్రద్ధతో, ఓర్పుతో వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా, స్వార్ధరహితంగా, ఫలం ఆశించ కుండా చేసి, దాని వలన కలిగే లాభాలను వారికి తెలియబరచి, వారిని కూడా ఆ విధంగా చేయడానికి ప్రోత్సహించాలి. జ్ఞానులు చేసే కర్మలను చూచి, దాని వలన వచ్చే మంచి ఫలితములను గ్రహించి, అజ్ఞానులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి మార్గంలో నడుస్తారు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసాడు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడుచేయకుండా, తాను ఆచరించి ఇతరులచేత ఆచరింపజేయడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు.

మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు తత్వమును బోధించే వాళ్లు ఇలా ఎందుకు చెబుతున్నారు. వాళ్లకు తెలియదా అంటే అన్నీ తెలుసు. కానీ, ఎవరికి ఏది ఏ సమయంలో ఎలా బోధించాలో తెలియదు అంతే. మన వేదాలలో శాస్త్రాలలో అన్నీ చెప్పారు. విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు క్రతువులు అన్నీ చెప్పారు. ఆత్మతత్వము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణారాధన, మానసిక పూజ, ఓంకారము, ధ్యానము, మనసును ఆత్మలో సంయోగం చేయడం ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి. ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి. మనకు చదువు ఒకటో క్లాసు నుండి పదవ తరగతి వరకు వివిధ విషయాలు చెబుతారు. ఇంటర్లో ఇటు స్కూలు విద్య అటు కాలేజీ విద్యకు అనుసంధానంగా పాఠాలు చెబుతారు. తరువాత కాలేజీ విద్య చెబుతారు. తరువాత మాస్టర్ విద్య చెబుతారు. ఇలా అంశాల వారీగా చెబుతారు. అంతేకానీ ఒకే సారి యం.ఏ. పిహెచ్.డి. విద్య పదేళ్ల వయసులో చెప్పరు. అలాగే ఎం.ఏ పాసయిన వాడు, రెండో తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎం.ఏ. విద్యను ప్రదర్శించకూడా రెండో తరగతి విద్యార్థి స్థాయికి తగ్గట్టు చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి. అలాగే ముందు మనసు నిలవడానికి విగ్రహారాధన, సంధ్యావందనము, పూజలు, వ్రతాలు, దేవాలయాలు ఉత్సవాలు చేయమన్నారు. ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి. అప్పుడు వారికి దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. వారి మనసు దైవం మీదికి మళ్లుతుంది. మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది. అప్పుడు నిద్గుణారాధన, మానసిక పూజ, ఆత్మను గురించి బోధించాలి. తరువాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. ఇది కూడా జ్ఞానులు ముందు తాము మనస్ఫూర్తిగా, యుక్తమైన మనసుతో శ్రద్ధగా, ఆచరించి ఇతరులు కూడా తాము చేసిన విధంగా చేయమని ప్రోత్సహించాలి. అంతేకానీ విగ్రహారాధన పనికిరాదు, పూజలు వ్రతాలు దండగ అని మొదలుపెడితే వాళ్లు అటు పూజలు చెయ్యడం మానేస్తారు. ఇటు ధ్యానం చేయడం చేత కాదు. రెండింటికి చెడ్డవారు అవుతారు. అదే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. (కానీ ఈ నాటి స్వామీజీలు తాము విలాసవంతమైన జీవితం గడుపుతూ, అనేక వివాదాలలో ఇరుక్కుంటూ, ప్రజలకు మాత్రం ఆత్మ జ్ఞానం గురించి బోధిస్తుంటారు. అటువంటి స్వామీజీల వెంట వేల మంది శిష్యులు ఉంటారు. అదే మాయ).
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P184

No comments:

Post a Comment