Wednesday, January 20, 2021

శివతత్వం

శుభోదయం నేటి మంచి విషయాన్ని దయచేసి కాస్త ఓపికతో మొత్తం గా తప్పక చదవండి.
శివతత్వం:-
మానవ శరీరం ఏర్పడినపుడు అది కేవలం ఒకే ఒక కణం మాత్రమే. ఆ ఒక్క కణమే మొత్తం శరీరంగా మారింది. శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో, ఎక్కడ చెవులుగా ఏర్పడాలో, ఎక్కడ గుండెగా పనిచేయాలో.. అన్నీ ఆ కణానికి తెలుసు. అలా ఆ ఒక్క కణమూ తనను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా.. గోళ్లు, జుట్టు, నాలుక, కండరాలు, ఎముకలు ఇలా అన్నిటిగానూ రూపొందింది. మానవ శరీరం ఒక్కటే.. కాని ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం.. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్ని ఒకే పదార్థంతో తయారయ్యాయి. ఆ ఒక్కదానికే ‘శివ’ అని పేరు. శివతత్వాన్ని గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే.శివుడు విశ్వరూపుడే. అంతే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరాకారుడు. విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్లినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా? అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. శివరాత్రి గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు. ‘నీవు శివుని పాదాలు కనుక్కో.. నేను తలను కనుగొంటాను’ అని బ్రహ్మ చెప్పాడు. సరేనని విష్ణువు.. శివుని పాదాలు వెదుకుతూ పాతాళానికి బయల్దేరాడు. బ్రహ్మ ఆకాశమార్గాన పైకి వెళ్లాడు. కొన్ని వేల సంవత్సరాలపాటు గాలించినా పరమేశ్వరుడి ఆద్యంతాలు వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే సృష్టంతా శివునిలోనే ఉన్నది.
ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది. ఒకవంక అతడు శ్వేత వస్త్రధారుడిగా అగుపిస్తాడు. మరోవంక కృష్ణవర్ణుడు. అతడు విశ్వానికి అధిపతి అయినా ఆభరణాలు లేవు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు భోళాశంకరుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతి. అదేసమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతనే. ఆనందతాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగునూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతున్నది. సాధారణంగా ప్రజలు, ‘ఈ జీవితం ఉద్దేశం ఏమిటి? ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది?’ అని అడుగుతూ ఉంటారు. ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వసృష్టికి కారణం లేదు.ఇది కేవలం ఒక లీల. విశ్వ చైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడిగా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజస్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతములు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనందనాట్యమే ఈ విశ్వం. ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటోంది. ఇది తెలియనివాడు బాధపడతాడు. తెలిసినవాడు ఆనందాన్ని కనుగొంటాడు. ఆ సత్యమే శివతత్వం.శివుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు. శివతత్వం ఇక్కడే ఉంటుంది. మన చైతన్యంలో మూడు దశలు ఉంటాయి. మెలకువ, కల, నిద్ర. ఇవిగాక నాల్గో దశ చైతన్యస్థితి ఉన్నది. అది మెలకువ కాదు. కల కాదు. నిద్ర కూడా కాదు. అది ధ్యానంలో అనుభవంలోకి వస్తుంది. ఆ నాల్గోస్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివతత్వం. చైతనత్వంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది. జీవం ఉన్న ప్రతిదానిలోనూ ఆ తత్వం ఉన్నది. ఆ మహత్తే శివతత్వం.
"ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్‌ మృత్యోర్ముక్షియమామృతాత్"
వేదాచారాలలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో శివుని మృత్యుంజయ మంత్రం ఒకటి. మృత్యుంజయ అంటే చావుపై గెలుపు. ఆత్మకు చావు లేదు. అది ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. మృత్యుంజయ అంటే ఈ అశాశ్వతమైన జీవనంపై గెలిచి, మనసు శాశ్వతత్వానికి చేరుకోవడం. ‘నేను శాశ్వతం, ఎన్నటికీ మార్పు చెందనిదేదో అది నాలో ఉన్నది’ అని మనసు గ్రహిస్తుంది. అప్పుడు భయం ఉండదు. భయం అనేది మృత్యువుకు గల సంకేతాలలో ఒకటి. భయాన్ని జయించినపుడు ఈ అశాశ్వతమైన విషయాలను గుర్తుంచుకోవడం మానేసి, ఎన్నటికీ నాశనం కాని దానికోసం కదులుతాము. మనం ఈ రెండింటి కలయికగా ఉన్నాము. మన ఆత్మ నాశనం లేనిది. శరీరం నశించిపోయేది. చాలాసార్లు మన మనసు శరీరానికి అంటిపెట్టుకుని తాను చనిపోతున్నానని భావిస్తూ ఉంటుంది. మనసును ఈ పరిమితమైన గుర్తింపు నుంచి అపరిమితమైన విశ్వవ్యాప్తమైన గుర్తింపుకు మృత్యుంజయ మంత్రం తీసుకెళ్తుంది. ఈ మంత్రంలో ఒక ప్రార్థన ఉన్నది. ‘శివుడు నన్ను బలవంతునిగా చేయుగాక. ఆతడు నన్ను బలవంతునిగా చేయుగాక. ఆతడు నన్ను బంధం నుంచి విముక్తుణ్ని చేయుగాక’’.
||ఓం నమః శివాయ||
||ఓం నమో భగవతే వాసుదేవాయ||
భగవద్ ఆరాధన - మంచికి సంకేతం.
||సర్వే జనా సుఖినోభవంతు||
||సర్వే జనా సుజనూభవంతు||
|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||
::::₹₹₹₹₹:::::
కండ్రపేటి పవన్ కుమార్,
శ్రీ సాయి మారేజ్ లింక్స్, శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిష్య నిలయం
తాడిపత్రి , కొలిమిగుండ్ల

Source - Whatsapp Message

No comments:

Post a Comment