Thursday, March 25, 2021

విలువైన ఉంగరం కథ

💍 విలువైన ఉంగరం కథ💍

✍️మురళీమోహన్

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

👌ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు.
"అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". కాబట్టి మీ ముగ్గురూ దేశాటన చేసివచ్చాక మీ అనుభవాలు వివరంగా చెప్పండి అప్పుడు ఎవరు మానవతావాది అవుతారో నిర్ణయించి ఈ ఉంగరం బహుకరిస్తాను అన్నాడు, దాంతో అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడూ తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు.

వారిలో జ్యేష్టుడు ఇలా మొదలుపెట్టాడు, "నాన్నా! విను. ఒక రోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్ని అంతా నాకు అప్పగించి, తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా వుంచుకోమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి యిచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బునిమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర వుంచేసుకునేవాణ్ణే, కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబూ వడ్డీతోసహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు, ఆ వజ్రాల వుంగరానికి నేను తగినవాణ్ణే కదా!" అన్నాడు. వృద్ధుడు ఇలా అన్నాడు "కాని అబ్బాయీ, లోకంలో అంతరాత్మ వుండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు" అన్నాడు.

ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. "నా సముద్ర యానంలో వానా, వురుములతో సహా పెనుతుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను. నాన్నా, ఇప్పుడు చెప్పు, నేను యదార్థమైన మానవతా వాదినే కదా" అన్నాడు. దానికి ఆయన తండ్రి "మంచి పనే చాశావు నాయనా! నీ జీవితాన్నే నీవు లక్ష్యపెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కాని పిరికిపందకానివాడు, ఎవరైనాసరే సరిగ్గా అలాగే చేసేవాడు" అన్నాడు.

ఆఖరి కొడుకు తన అనుభవాన్ని యిలా చెప్పసాగాడు, "నాన్నా! నేను దేశాటనలో కొన్నాళ్లు గొర్రెల మందకు కాపరిగా ఉన్నాను, అప్పుడు ఒకరోజు చల్లని గాలి నా శత్రువును నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఏటవాలుగా వుండే చోటుకు అతను దొర్లిపోయాడు. ఇంక కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అతన్ని లోయలోకి జారిపోనివ్వలేదు. అతను నా శత్రువైనా అతన్ని లేపి ఆ విపత్తునుండి అతన్ని రక్షించాను" అని ముగించాడు. అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ "అబ్బాయీ! నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు, శత్రృత్వాన్నీ, పగనూ మనస్సు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. నీవే నిజమైన మానవతావాదివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి" అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహూకరించాడు.👍

Source - Whatsapp Message

No comments:

Post a Comment