Tuesday, December 14, 2021

మంచి సందేశం. నామజపం.

మంచి సందేశం. తుకారాం ఆత్మానుభూతి పొందిన మహాత్ముడు. ఆయన అటు భగవంతుడికి ఇటు జనులకు సేవలందిస్తూ వచ్చాడు. భగవన్నామ మహత్వాన్ని ఆయన తన జీవితంలో పలుమార్లు నిరూపించి చూపించాడు. అటువంటి ఒక సంఘటన ఇది.


ఒక రోజు ఇరుగుపొరుగు ఇళ్ళలోని ఇద్దరు స్త్రీల మధ్య ప్రారంభమైన కలహం చిలికి చిలికి గాలివాన అయినట్లు ఉగ్రరూపం దాల్చింది. ఆ స్త్రీలు ఇద్దరు కలిసి ఒకే చోట పిడకలు తట్టారు. ఎండిన తరువాత అవి కలసిపోయాయి. ఎవరివి ఎన్ని అని తెలుసుకోవడానికి సాధ్యంకాక కలహించుకోసాగారు.


తుకారాం అప్పుడు ఆ దారి గుండా పోతున్నాడు. విషయం విన్న ఆయన పిడకలను విభజించి ఇస్తానని చెప్పాడు. ఎండిన అన్ని పిడకలనూ ఆయన ముందు గుమ్మరించారు. ఆయన ఒక్కొక్క పిడకగా తీసి చెవి వద్ద పెట్టుకుని చూసి, వాటిని రెండు భాగాలుగా విభజించారు. ఆ తరువాత,


"అమ్మా! మీ ఇద్దరిలో ఎవరు పిడకలు తట్టుతున్నప్పుడు 'విఠల్, విఠల్' అని చెబుతూ వచ్చారు?” అని ప్రశ్నించాడు.


నామం ఉచ్చరిస్తూ పిడకలు తట్టిన స్త్రీ ముందుకు వచ్చింది.


"అమ్మా! ఎడమ వైపు ఉన్న పిడకల గుట్ట నీది, కుడి వైపుది ఆమెది అని తుకారాం చెప్పాడు.


ఈ విడ్డూరం చూడడానికి వచ్చిన వారు, "స్వామీ, ఇదేమిటి?” అని ఆశ్చర్యపోతూ అడిగారు.


"మనం భగవన్నామం ఉచ్చరిస్తున్నప్పుడు, నామ తరంగాలు చుట్టు ప్రక్కలంతా వ్యాపిస్తాయి. నామ ప్రతిధ్వనులు ఈ పిడకల్లో నెలకొని ఉన్నాయి. అవి విని వాటిని విభజింప గలిగాను" అని తుకారాం వివరించి చెప్పాడు.


నామ జపానికి చోటు, సమయం చూడవలసిన అవసరంలేదు. నామజపం మనకు శ్రేయోదాయకమేకాక, చుట్టూ వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది. కనుక మనం ఎడతెగకుండా నామజపం చెయ్యాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment