Monday, September 26, 2022

ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అంతఃకరణ శుద్ధి అవసరం

 ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా 
అంతఃకరణ శుద్ధి అవసరం

భగవంతుడిని ఆరాధిస్తూ.. ఆయన చేసిన సృష్టిలో కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువగా చూడటం అల్పత్వం అనిపించుకుంటుంది. సమస్త చరాచర వస్తువుల్లోనూ తనను తాను దర్శించగల దార్శనికుడే నిజమైన సాధకుడు అనిపించుకుంటాడు. 

వస్తు, విషయ భేదాలలో కొట్టుమిట్టాడుతూ ఎంత తపస్సు చేసినా వ్యర్థమే అవుతుంది. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించగలిగిన సాధకుడి ఆరాధననే దైవం స్వీకరిస్తాడు. అలాంటివారి పట్ల ప్రసన్నుడవుతాడు. ఈ సత్యాన్ని గుర్తించని వాడు పతనమవుతాడు.

ఒకానొక గ్రామంలో ఓ ఆలయం ఉండేది. దానికి అనుబంధంగా అద్దాల మంటపం నిర్మించారు. ఆ మంటపంలో చుట్టూ గోడలకు అద్దాలు అమర్చారు. అందులోకి ప్రవేశిస్తే.. ఎటుచూసినా ప్రతిబింబాలు కనిపిస్తాయి.

ఓ రోజు ఆ గదిలోకి ఓ కుక్క ప్రవేశించింది. గదిలో ఏ మూలన చూసినా తనకు ఎదురుగా మరో శునకం ఉన్నట్టుగా అది భావించింది. అద్దంలో ఉన్నది తన ప్రతిబింబం అని గుర్తించక, ఎదురుగా ఉన్న కుక్కను చూసి కంగారుపడి దానిపై దాడికి యత్నించింది. అద్దంలో ప్రతిబింబం కూడా తనపై ఎదురుదాడికి దిగినట్టు కనిపించింది. చుట్టూ ఉన్న అద్దాలను రక్కడం మొదలుపెట్టింది. తలతో బాదుతూ మొరగసాగింది. ఈ ప్రయత్నంలో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అక్కడే చతికిలపడి కన్నుమూసింది. సాయంత్రం ఆలయ నిర్వాహకుడు అద్దాల మంటపంలోకి వచ్చాడు. అక్కడే చచ్చిపడి ఉన్న కుక్కను చూసి ‘అయ్యో’ అనుకున్నాడు. పనివాళ్లను పురమాయించి కుక్క కళేబరాన్ని బయట పారవేయించాడు. మంటపం నుంచి వెళ్తూ వెళ్తూ.. అద్దంలో తననుతాను చూసుకొని, నుదుటిపై పక్కగా ఉన్న తిలకాన్ని సరిదిద్దుకొని బయటకు వెళ్లిపోయాడు.

కుక్కకు జ్ఞానం లేకపోవడంతో అద్దంలో ప్రతిఫలించిన కుక్కలన్నీ తానేనని భావించలేకపోయింది. ఆ శునకాలు వేర్వేరని భావించి, వాటిపై దాడికి దిగి ప్రాణాలు కోల్పోయింది. ఆలయ నిర్వాహకుడికి మాత్రం అక్కడి అద్దాల్లోని ప్రతిబింబాలన్నీ తనవేనని తెలుసు. అందుకే తను వచ్చిన పని చూసుకొని వెళ్లిపోయాడు. ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇదే! ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే. అన్నిటిలోనూ ఉన్నది ఒకే ఆత్మ. భిన్నభిన్న ఉపాధులలో కనిపిస్తుంటుంది. అజ్ఞాని
ఆ ఉపాధులను గుర్తించక తనకు భిన్నమైనదని భావిస్తుంటాడు. తనచుట్టూ మనుషుల్లో, వస్తువుల్లో భేదభావం ప్రదర్శిస్తూ అశాంతి కొనితెచ్చుకుంటాడు. భగవంతుని ఆరాధనలోనూ మనసు నిలుపలేకపోతాడు. కానీ, సమస్త జీవరాశుల్లో తానే (ఆత్మ ఒకటే) ఉన్నాననీ, అవన్నీ అద్దంలో ప్రతిబింబాల వంటివని గుర్తించగలిగినవాడు ఉత్తముడు. 

అతడికి సృష్టిలో, మనుషుల్లో తారతమ్యాలు కనిపించవు. జీవకోటిపై కరుణ, దయ ఏర్పడుతుంది. అందరినీ సమానంగా చూసే గుణం అలవడుతుంది. ఆ స్థితికి చేరుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు. అతడి జీవితం ఆనందమయం అవుతుంది.

అనేకత్వంలో ఏకత్వం గుర్తించగలిగే శక్తిని సంపాదించుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదీ భిన్నమైనది కాదనే భావన బలంగా ఏర్పర్చుకోవాలి. ‘అవిభక్తం విభక్తేషు’ అనే గీతా సూత్రాన్ని హృదయంలో కొలువుదీర్చుకొని ప్రాణికోటిపై దయ, కరుణ చూపాలి. అప్పుడే జీవుడు కృతార్థుడవుతాడు. 

సృష్టి అంతా ఒకే ఆత్మస్వరూపం ఉందన్న అద్వయ దృష్టితో చరితార్థుడవుతాడు. ఆదిశంకరులు చండాలునిలో పరమేశ్వరుడిని దర్శించినట్టు, ప్రతి మనిషి సాటిమనిషిలో దైవాన్ని చూడగలిగితే.. అదే నిజమైన ఆధ్యాత్మికత సాధనకు ఆలవాలం అవుతుంది. ప్రపంచమంతా భగవానుడి స్వరూపంగా భావించిన వారికి ఆయన అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.
.
.
.
.

No comments:

Post a Comment