Sunday, December 18, 2022

పంచారామాల పుట్టుక:

 Xxxxxx.      191222-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           పంచారామాల పుట్టుక:
                    ➖➖➖✍️

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్దము) రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది... 

క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. 

కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు.

దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు.

శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చేసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు.

దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది.

లింగ ప్రతిష్ట చేసిన ఈ ఐదు ప్రదేశములే పంచారామములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! 

సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపోవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశాలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు.

దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుద్ధే పునస్తారకంచ వధిష్యతి మహాబలః ‍ ‍ ‍ 
                      - స్కాందము.

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.

దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు.

కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు.

క్షీరారామము (పాలకొల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు.

భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు.^

అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు.

ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతోంది.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment