*_మాష్టారికోశిక్ష_*
*["టీచర్ - కథా కమామీషు" అనే పుస్తకంలోని ఒక కథ]*
_(రచన : -గెద్దాడ కస్తూరి)_
*!!!::!!!::!!!::!!!::!!!::!!!::!!!::!!!::!!!*
*మాష్టారూ!*
*నేనెవరో మీకు గుర్తుందా? ఎలా గుర్తుంటుందిలెండి. మీ జీవితంలో నక్షత్రాల్లా స్టూడెంట్స్ ఉంటే, చంద్రుడిలా మీరొక్కరే ఉండి, మమ్మల్ని అస్తమానమూ తిడుతూ ఉండేవారు. మీరెంతమంది విద్యార్థులనని గుర్తు పెట్టుకోగలరు? కానీ, మీరు మాత్రం మా కందరికీ గుర్తేనండీ! ముఖ్యంగా, నాకైతే ఇంకా బాగా గుర్తున్నారు. అసలు మిమ్మల్ని మరిచిపోవడం అసాధ్యం.*
*చిన్నప్పుడు మీరు మా ఇంటి పక్కనే ఉండడంతో, అటు ఇంటి దగ్గరా, ఇటు స్కూల్లోనూ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. సరిగా చదవకపోతే 'స్టాండప్ ఆన్ ది బెంచ్' అని చాలా తేలిగ్గా అనేసేవారు గానీ, అలా బల్లమీద అందరి మధ్య నిలబడడానికి నేనెంత కుమిలి పోయేవాణ్ణో మీకేం తెలుసు? వచ్చే జన్మలోనైనా మీకు మాష్టారుగా పుట్టి మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టాలి అని దేవుణ్ణి ప్రార్థించుకునే వాడిని. విచిత్రంగా దేవుడు నా మొర విని నా కోరిక ఈ జన్మలోనే తీర్చేశాడు. మీరు ఎంతో మంది పురప్రముఖల సన్నిధిలో, స్టూడెంట్స్ ఎదురుగా అలా నిలబడడం, మీకేమనిపించిందోగాని, నాకు సంతోషంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి. నా కోరిక తీరింది. నా కసి తీరింది. ఇప్పుడు మీరూ నిలబడ్డారు కదా!*
*అసలు మీరు నన్ను ఆటలకు వెళ్ళనిచ్చే వారా? చిన్న వయసులో ఆటల మీద కాక మా మనసు చదువు మీద ఉంటుందా? గుర్రాలలాంటి మా మనసు కళ్ళాలను మీ చేతుల్లో పెట్టుకుని ఆటలకు వెళ్ళకుండా ఆపేవారు. మీ పోరు పడలేక ఏదో కష్టపడి చదివి లెక్కల్లో నూటికి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకుంటే సంతోషించకుండా, "మూర్ఖుడా! మిగిలిన ఒక్క మార్కు ఎక్కడికి పోయిందిరా" అంటూ ఎండలో నిలబెట్టేవారు.* *ఆనాటి నా మనస్థితిని ఏమాత్రం అయినా అర్థం చేసుకోడానికి అసలు ప్రయత్నించారా?*
*రామనామ జపంలా ఎప్పుడూ "చదువు, చదువు, చదువు, చదువు" అంటూ అరిగిపోయిన రికార్డులా అరిచేవారు. నాకెంత కోపం వచ్చేదో తెలుసా! అయినా నిగ్రహించుకునే వాడిని, అది మీరు మాత్రం గ్రహించేవారు కాదు. అప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేని పసివాణ్ణి. మీరు బాగా చదువుకున్నారని మీకు చాలా గొప్ప.*
*మీకు తెలియకుండా అల్లరిగా తిరుగుతున్న నన్ను నా తల్లి దండ్రులే పట్టించు కోకపోయినా మీరు పట్టుబట్టి చెవి మెలిపెట్టి "బాగా చదువుతాను" అని నాతో ఒట్టు పెట్టించుకొని వజ్రంలా సానపెట్టడానికి ప్రయత్నించారు. ఎంతసేపూ మీ ధ్యాస మీదేగాని, నాకు చదువంటే ఎంత అయిష్టమో ఆలోచించారా? లోకజ్ఞానం అంటూ ఎన్ని పుస్తకాలు చదివించే వారు!*
*"అందరూ సర్వేపల్లి రాధాకృష్ణలు కాలేరండి అది గుర్తుంచుకోండి" అని నేను అంటే... మీరేం సమాధానం చెబుతారో నాకు తెలుసు. "రాధాకృష్ణలు కాలేకపోయినా, అప్రయోజకులు కానివారందరూ ఆయనతో సమానులే" అంటారు. మీతో వాదించే వయస్సు నాకు లేదనే కదా, మీ ఇష్టం వచ్చినట్లు నన్ను దండించారు. మీకు పనిష్మెంట్ ఇచ్చేంత శక్తి నాకు లేదనే కదా మీ ధైర్యం! కానీ తలదన్నే వాడుంటే, తాడిని తన్నేవాడుంటాడని మరువకండి. మీకు నేను ఏ శిక్షా వేయక పోయినా... ఇప్పుడు ఈ శిక్ష పడిందిగా. నాలాంటి చాలా మందిని పెట్టిన ఉసురు, ఇచ్చిన దండన ఊరికేపోలేదు. మీ మెడకు ఉరితాడై బిగిసింది. మీరు ఆ శిక్షను అనుభవిస్తూంటే... చూస్తూ నేనెంత పొంగిపోయానో తెలియజేయడానికే ఈ ఉత్తరం.*
*మీ ఎదురుగా నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడే శక్తి నాకు ఆనాడూ లేదు, ఈనాడూ లేదు. మీరు అలా నిలబడడం చూస్తే ఆనందంతో నా గుండె పగిలిపోతుందేమోననీ, అసలు ఈ ఉత్తరం రాసే అవకాశం కూడా పోతుందేమోననీ... ఎంతో భయపడ్డాను. నేను చిన్నప్పటి నుంచి పడ్డ మనోవేదన అంతా ఇట్టే క్షణంలో మాయమైపోయింది. ఎలా అంటారా?*
*అవును ఇలాగే యూనివర్శిటీ వాళ్ళు స్నాతకోత్సవ (కాన్వొకేషన్) సందర్భంగా మీకు "కళాప్రపూర్ణ" బిరుదు ఇస్తున్నప్పుడు, మీ గొప్పతనం గురించి తెలిపే పత్రాన్ని (సైటేషన్) మరో మహానుభావుడు చదువుతున్నంత సేపూ, మీరు గవర్నర్ సన్నిధిలో ఎందరో ప్రముఖుల ఎదురుగా, ముఖ్యంగా విద్యార్థులందరికీ అభిముఖంగా నిలబడి ఉండడం, ఆ పిదప గవర్నర్ చేతి మీదుగా 'కళాప్రపూర్ణ' అందుకుని ఒక గోల్డ్ మెడల్ మెడకు తగిలించుకోవడం,........... మరి ఇప్పుడు చెప్పండి నా కోరిక తీరినట్లే కదూ! ఇంత కాలానికైనా మీ ప్రతిభను గుర్తించినందుకు యూనివర్శిటీని నేను అభినందిస్తున్నాను. ఇదంతా నేనెప్పుడు చూశానంటారా?ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి, గోల్డ్ మెడల్ తీసుకున్నది నేనేనండి. అసలు ఆ మెడల్ మీకివ్వక, నా కిచ్చారేమిటా అని ఒక్క క్షణం అనిపించింది. అప్పుడే తళుక్కున మెరిసినట్లుగా తెలిసింది ఏంటంటే... అసలు నేనంటూ వేరుగా ఎక్కడ ఉన్నాను! మీరు లేకుండా నాకు ఉనికి ఎక్కడ ఉంటుంది?! నాలోలోపల అణువణువునా ఇమిడి పోయి ఉన్నది మీరేకదా!!! అంటే... మరి నా ఈ అభివృద్ధికి కారకులు మీరేగా!* *పాదాభివందనాలతో....మీ విద్యార్థి సిద్ధార్థ."*
*ఈ కథలో గ్రాహ్యాంశం:-- ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీకుమీరే గ్రహించుకోగలరు.*
*________________________*
*_[ఒక విద్యార్థి ఒక పాఠంలో అసలు విషయం ఏమీ అర్థం చేసుకోకుండానే... అందులో 12 ప్రశ్నలుంటే, ఎనిమిదింటినో తొమ్మిదింటినో, లేక మొత్తం గానీ కంఠస్థం పెడతాడనుకోండి. పరీక్షల్లో 90% నుండి 100% మార్కులు కూడా తెచ్చాడనుకుందాం. ఇంకో విద్యార్థి మాత్రం పాఠం మొత్తం చదివి 10 శాతమో, 20 శాతమో మాత్రమే విషయాన్ని అర్థం చేసుకున్నాడనుకోండి. ఇప్పుడు చెప్పండి... ఆ పై విద్యార్థి కంటే యీ విద్యార్థే అసలైన సమర్థతగల ప్రయోజకుడిగా తయారవ్వగల విద్యార్థి అని... టీచర్లుగానీ, తల్లిదండ్రులుగానీ గ్రహించాలికదా!...]_*
-----------------------
*_[మరి మీరేమంటారు? ఒప్పుకుంటారుగా..... 🙏🙏🙏--వెలిశెట్టి నారాయణరావు]_*
*_{ఈ కథను నేను వాశిలి హైస్కూల్లోనూ, బట్టేపాడు హైస్కూల్లో పనిచేస్తున్నప్పుడు అన్ని తరగతులలోని విద్యార్థులందరికీ తప్పనిసరిగా చదివి వినిపించే వాడిని. ఇప్పటికీ నా దగ్గరున్న "టీచర్ " అనే పుస్తకం లోనిదే ఈకథ...! : --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
*----------------------*
No comments:
Post a Comment