Monday, August 25, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *గోపాలక విద్య*
                ➖➖➖✍️

**శ్రీకృష్ణుడు మురళీధరుడు.*

**ఆయన నాద వినోదుడు.*

**శ్రావ్యమైన మురళీ నాదంతో జీవరాశులన్నింటినీ మైమరపించి మురిపించాడు. ఆ మురళి వల్లే ఆయన పురాణపురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది.*

**వెదురుతో చేసిన పిల్లనగ్రోవిది ఎంత అదృష్టమో కదా... ఆయన అధరాలను తాకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆస్వాదించి రాగాలను సృజిస్తోందని మీరాబాయి గానం చేసింది.*

**అథర్వణ వేదానికి సంబంధించిన కృష్ణోపనిషత్తులో మురళిని గురించిన వివరాలు ఉన్నాయి.*

**ఇది అత్యంత ప్రాచీనమైన వాద్యమని, దీని నుంచి వెలువడే రాగాలను పంచ భూతాలు తమలో లీనం చేసుకొంటాయని కృష్ణోపనిషత్తు చెబుతోంది.*

**ఆదిమజాతి మానవులు సాధు జీవాలను మచ్చిక చేసుకోవడానికి తమ నోటితో రాగయుక్తమైన ధ్వనులు సృజించి వాటికి ఆనందం చేకూర్చేవారట. ఆ తరవాత వెదురు బొంగు నుంచి పిల్లనగ్రోవిని తయారుచేసి రాగ ధ్వనులతో వాటి చెవులకు ఇంపు చేకూర్చేవారని నీలకంఠ శాస్త్రి రాసిన పుస్తకం వేదకాలం నాటి భారతీయ సంస్కృతిని చాటుతోంది.*

**శ్రీకృష్ణుడు ఆలమందల పోషణలో భాగంగా వేణువును ఊదుతూ వాటిని రంజింప జేసేవాడు. అవి మోరలెత్తి ఆ వేణుగానాన్ని వింటూ ఆహారాన్ని నెమరు వేసుకొంటూ ఆనందాన్ని వ్యక్తం చేసేవి.*

**అథర్వణ వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆవులు సైతం తొమ్మిది రకాల భావావేశపూరిత అనుభూతులకు లోనవుతాయని ఒకటో శతాబ్దానికి చెందిన పలకాప్యుడు, ఆ తరవాతి తరం నాటి శాలిహోత్రుడు పేర్కొన్నారు.*

**నింపాదిగా కూర్చుని ఆహారాన్ని నెమరు వేసుకుంటూ నిమీలిత నేత్రాలతో ఆవు ఉంటే సాంత్వనంతో నిమ్మళంగా ఉన్నదని గుర్తు.*

**ఆవు చెవులు నిటారుగా ఉంటూ రెప్పలార్చకుండా ఉంటే వ్యాకులతతో కూడిన ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తారు.*

**కళ్లు మాటిమాటికీ మూసుకొంటూ కళ్లలో తెలుపు భాగం ఎక్కువగా కనిపిస్తే అది భయంతో శరీరంలో ఎక్కడో నొప్పిని అనుభవిస్తున్నట్లుగా సంకేతం.*

**కళ్లు మూసుకుని నిద్రిస్తున్నట్లుగా ఉంటే ఆవు సేదతీరుతున్నట్లు గోపాలకులు గమనిస్తారు.*

**నడకలో విశ్వాసం, ధైర్యం కనపడితే పశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకొంటారు.*

**అవి తలను నేలవైపు దించి అడుగులు వేస్తుంటే సౌఖ్యంగా లేనట్లు భావిస్తారు.*

**అలా వాటి అవస్థలను గుర్తెరిగి మురళిని శ్రీకృష్ణుడు ఊదేవాడట. ఆలమందలు అలా ఊరట చెందేవి.*

**సంగీతం తీయని మాటకన్న మధురమైందని సామవేదం చెబుతోంది.*

**గోపాలుడికి పశుపోషణతోపాటు వాటి నైజం బాగా తెలుసునని శ్రీకృష్ణోపనిషత్తు వివరిస్తోంది.*

**ఆహారంతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని ఆవులు ఆస్వాదిస్తాయని నందుడు శ్రీకృష్ణుడికి చెప్పాడంటారు.*

**ఆలమందల అలవాట్లను క్షుణ్నంగా పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేణునాదాన్నే ఎన్నుకున్నాడు మాధవుడు.*

**ఉదయమే ఆవుల పొదుగులు పాలతో నిండి ఉన్నప్పుడు భైరవి రాగాన్ని మధురంగా పిల్లన గ్రోవిపై ఊదేవాడు.*

*ఈ రాగాన్ని వింటూ ఆవులు కడివెడు పాలు ఇచ్చేవట.*

**భైరవి రాగాన్ని వినగానే గోప బాలకులందరూ చద్ది అన్నాలు కట్టుకొని పశువులను వెంటపెట్టుకొని అడవి వైపు వెళ్ళేవారట.*

**పచ్చిక బయళ్లలో మేసి మధ్యాహ్నం ఆవులు తీరికగా కూర్చున్నవేళ మధ్యమావతి పలికించాలంటారు.*

**రాత్రి పశువులు నిద్రించేవేళ హిందోళం చాలా మంచి రాగమని చెబుతారు.*

**శ్రీకృష్ణుడికి, ఆయన వెంట తిరిగే గోప బాలురకు తెలిసిన ఈ విద్యను ‘గోపాలక విద్య’ అంటారు.*

**శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ గోపాలక విద్యను పాండవులలో అందరికన్నా చిన్నవాడైన సహదేవుడికి అందించాడని భారతం చెబుతోంది.*✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment